దేశ ప్రజలు నూతన సంవత్సరంలోకి ఒకరకమైన నిర్వేదం, నిరుత్సాహంతో అడుగుపెడుతున్నారని అనిపిస్తున్నది. అందుకు కారణం ఏమంటే.. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన సంఘటనలు. అదొక్కటే కారణం కాదనుకోండి. కానీ అదొక బలమైన కారణం అనటంలో సందేహం లేదు.
తాజాగా ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చేదు అనుభవాలు మిగిల్చేవిగా ఉండిపోతాయి. ఎందుకంటే పార్లమెంట్పై ఒకే సమావేశంలో రెండు దాడులు జరిగాయి. మొదటిది ఆగంతకులు చేసిన దాడి కాగా, రెండోది ప్రతిపక్షాలపై పాలకపక్షం చేసిన దాడి. రెండు దాడులూ హేయమైనవే.
Parliament | పార్లమెంట్పై ఆగంతకుల దాడి చాలా గర్హమైనది. దాడి చేసిన వ్యక్తులు ఆకతాయిలనే ప్రస్తుతానికి మనకున్న సమాచారం. అంటే వాళ్లు ఉగ్రవాద సంస్థలకు చెందినవారని దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు నిర్ధారించలేదు. కానీ వాళ్ల దుస్సాహసాన్ని ఖండించాలి. చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలి. దాడికి పాల్పడినవారు నిరుద్యోగులు, నిస్పృహకు లోనైనవారు అనే సాకుతో వాళ్లు చేసిన పనిని తేలికగా చూడకూడదు. వాళ్ల ఆకతాయి చేష్టలకు ఏకంగా పార్లమెంటును వేదికగా చేసుకోవటం చూసి సామాన్యులు విస్తుపోయారు.
పార్లమెంట్పై దాడికి తెగించిన ఆ దుండగులు శిక్షార్హులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ రక్షణ వ్యవస్థ కన్నుగప్పి రంగు పొగల గొట్టాలను లోపలికి తీసుకెళ్లడం చిన్న విషయం కాదు. ఆ పొగే కనుక విషపూరితమైనదైతే దాని పరిణామాలు ఊహించటానికే భయంకరంగా ఉండేవి. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కదా అని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. పార్లమెంటుపై దాడి చేయాలనే ఆలోచనే దుర్మార్గమైనది. పార్లమెంట్లోకి ప్రవేశించే సందర్శకులకు నఖశిఖ పర్యంతం తనిఖీలుంటాయి. భద్రతా సిబ్బంది సందర్శకుల బూట్లలో ఉన్న వస్తువులను పసిగట్టలేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. సరే అది మానవ తప్పిదమో? లేదా సాంకేతికపరమైన లోపమో? దర్యాప్తులోనే తేలాలి.
పరిశీలకులు, పండితులు, పామరులకు కూడా విస్మయం కలిగించే విషయం ఏమంటే.. అసలు సందర్శకుల పాస్ కోసం సిఫారసు చేసిన ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. తన ద్వారా వచ్చిన సందర్శకుల ప్రవర్తనకు సంబంధించి సిఫారసు చేసిన ఎంపీకి బాధ్యత ఉండదా? కానీ, సదరు ఎంపీపై ఎలాంటి చర్యలూ లేవు. అదే సదరు సభ్యుడు ఏ విపక్ష పార్టీకో చెందినవాడైతేనో లేక మైనారిటీ సభ్యుడైతేనో పరిణామాలు తీవ్రంగా ఉండేవి. దేశభక్తికి సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంట్ ప్రాంగణంతో పాటు కాషాయ మీడియాలో హోరెత్తిపోయేది. సదరు ఎంపీ అధికార పక్షానికి చెందినందున కాషాయ బ్రిగేడ్ నోరెత్తడం లేదు. ఇటీవల దేశం తెలుసుకున్న నగ్నసత్యం ఏమంటే దేశభక్తి అనేది బీజేపీ సొత్తు అని!
పాస్ కోసం నిర్దేశించిన దరఖాస్తులో సందర్శకుడి నడవడికకు పూర్తి బాధ్యత తనదేనని సిఫారసు చేసేవారు చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు చూడటానికి సందర్శకులకు పాసులు ఎంపీల ద్వారానే కాదు, పార్లమెంట్లో పనిచేసే ఉన్నత స్థాయి అధికారుల ద్వారా కూడా పొందవచ్చు. అధికారులు కూడా తాము సిఫారసు చేసే సందర్శకుల నడవడికకు పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పాలి.
సందర్శకుడు నిబంధనలకు భిన్నంగా ప్రవర్తిస్తే సిఫారసు చేసిన అధికారి చిక్కుల్లో పడతారు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మరి ఎంపీలకెందుకు ఈ మినహాయింపు? దుండగులకు పాస్ కోసం సిఫార్సు చేసిన ఎంపీని కనీసం సమావేశాల నుంచి సస్పెండ్ చేయాల్సింది. అలా కాకుండా, ఈ సంఘటనపై హోం మంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసినందుకు ఉభయ సభల నుంచి ఏకంగా 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. దీన్నే పార్లమెంట్పై రెండో దాడిగా పరిగణించాలి. ఇది పార్లమెంట్పై ఆగంతకులు చేసిన దాడికన్నా తక్కువేమీ కాదు. ప్రశ్నించడం అనేది ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. ఈ ఆయుధంతోనే ప్రభుత్వాన్ని సభ్యులు నిలదీస్తారు. అందుకే ప్రశ్నకాలం అనేది చాలా ప్రతిష్టతో కూడుకున్న పార్లమెంటరీ ప్రక్రియ. మెజారిటీని అడ్డం పెట్టుకుని ప్రశ్నించేవారిని సస్పెండ్ చేయడం పార్లమెంట్ గొంతు నొక్కటమే అవుతుంది!
తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించి ప్రకటన చేయాలని అడగటం సభ్యుల హక్కు. అది వారి బాధ్యత కూడా. ప్రకటన చేయాలని అడిగినందుకు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం ఇదే తొలిసారి. ఇదొక దురదృష్టకర స్పందన. పార్లమెంట్లో ప్రకటన చేసేటంతటి సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవచ్చు. ఎందుకంటే దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు గనుక. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాథమిక సమాచారంతోనే సభలో ప్రభుత్వం స్పందన తెలియజేయాలి కదా! ఇదేమైనా సాధారణ విషయమా? ప్రాణహాని జరగలేదు నిజమే. అందుకని ఈ దాడి తీవ్రతను తక్కువ చేసి చూడకూడదు కదా! ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం గానీ, విపక్షాలు గానీ రాజకీయం చేయటం తగదు. ఇరుపక్షాల మధ్య మాట్లాడుకునే వాతావరణం ఉండాలి. పాలక పక్షం, ప్రతిపక్షం రాజకీయ ప్రత్యర్థులే గానీ, విరోధులు కాదు. మరి ఎందుకు ఈ పంతం, పట్టుదల? ఎవరికి ఉపయోగపడుతుంది.. ఇటువంటి మొండి వైఖరి?
ప్రజా ప్రతినిధులకు సభలో ఉండే బాధ్యతలకు నాలుగు కోణాలుంటాయని గతంలో చర్చించుకున్నాం. మొదటగా సభ్యులు మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి. నేతలకు మంచీచెడు అనే విచక్షణ బాగా ప్రస్ఫుటంగా ఉండాలి. దాని ప్రకారం నడుచుకోవాలి. రెండోది వారిని ఎన్నుకున్న ప్రజల అభిప్రాయం ప్రతిబింబించేలా నడుచుకోవాలి. సభలో గందరగోళం సృష్టించాలని ప్రజలు ఎప్పుడూ చెప్పరు. మూడోది పార్టీ కోణం. ఇదే అన్నిటికన్నా పదునైన, ప్రమాదకరమైన కోణం. నాలుగోది రాజ్యాంగం. సభలో సభ్యులుగా రాజ్యాంగంపైనే ప్రమాణం చేస్తారు.
రాజ్యాంగాన్ని కాపాడతామని, రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని, శాసనాన్ని గౌరవిస్తామని. మన రాజ్యాంగం దేశం నలుమూలలను కలిపి, ప్రజల మధ్య భూ సమగ్రతను, ఐకమత్యాన్ని, జాతీయతా భావాన్ని పెంపొందించే ఒక ఆదర్శవంతమైన దిక్సూచి. దాన్నిగౌరవించాలి. స్వాతంత్య్ర సమరయోధులు, జాతి నిర్మాణ ప్రదాతలు ఎంతో లోతైన ఆలోచనతో రూపకల్పన చేసిన ఒక పవిత్ర ఒడంబడిక మన రాజ్యాంగం.
ప్రజలు అభివృద్ధి పథంలో పయనించటానికి తగిన దిశానిర్దేశం చేసే గ్రంథం మన రాజ్యాంగం. ప్రజలందరూ ఒకటేనని చాటిచెప్పిన ధర్మబోధిని మన రాజ్యాంగం. రాజ్యాంగ ధర్మాన్ని గాలికొదిలేసి, ప్రజల ఆకాంక్షలను పెడచెవిన పెట్టి, మనస్సాక్షిని ఇంట్లో విడిచిపెట్టి, కేవలం పార్టీ ఆడమన్నట్టు ఆడటం మన నేతలకు పరిపాటిగా మారింది. ఎన్నుకున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలు గట్టిగా వినిపించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన చట్టసభలు నేడు రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోవటం దురదృష్టకరం.
2012లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బొగ్గు గనుల వివాదంపై పార్లమెంట్ సమావేశాలను పూర్తిగా స్తంభింపజేసింది. ఉభయసభల్లో ఒక్క రోజు కూడా సమావేశాలు జరగకపోవటం చాలామందికి గుర్తుండే ఉంటుంది. సభను స్తంభింపజేయటమే ప్రతిపక్షానికున్న ఆయుధమని రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెంకయ్య నాయుడు ఆనాటి ఘటనను సమర్థించుకున్నారు. అదే వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో.. సభలో సభ్యులు హుందాగా ఉండాలి గానీ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించటం సహేతుకం కాదని హితవు పలికారు. ఏటికి ఆవలి ఒడ్డున ఒక మాట, ఈవలి ఒడ్డున మరొక మాట చెప్పటం మన నేతలకు పరిపాటిగా మారింది. నాటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం గందరగోళం సృష్టించిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయలేదు. సభ్యులను సస్పెండ్ చేసి సభను నిర్వహించాలనుకోలేదు. కానీ, నేటి పాలకపక్షం.. ప్రతిపక్షాల గొంతు నొక్కింది. ఇదేమి ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఇదేమి పార్లమెంటరీ సంస్కృతి! అనేది అర్థం కావటం లేదు. అందుల్లనే ఈ సంవత్సరానికి గందరగోళంతో వీడ్కోలు పలుకుతున్నామని అనిపిస్తున్నది.
నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతున్నది. అప్పుడైనా పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగాలని, కొత్త సంవత్సరంలో అయినా దేశానికి మంచి జరగాలని ఆశిద్దాం. ప్రజలు ఓటు వేశాక ఆశించటం తప్ప చేసేదేముంటుంది. ఆశపడటానికి ఖర్చు ఏమీ ఉండదు కదా!
ప్రతిపక్ష సభ్యులు పట్టువిడుపు చూపాలి. పార్లమెంట్పై దాడి జరగటం దురదృష్టకరం. దానిపై దర్యాప్తు జరుగుతుండగానే, ఆ దర్యాప్తు ఓ కొలిక్కి రాకముందే ప్రభుత్వం ఏమని ప్రకటన చేయాలి? ప్రతిపక్షాల పంతం అర్థరహితం. సస్పెండ్ అయ్యి వాళ్లు సాధించిందేమిటి? సభలో ప్రతిపక్షం లేకుండానే కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రతిపక్షం నిరసనతో దేశానికి వచ్చిన ప్రయోజనం ఏంటి? సభలో ఉండి వాళ్ల వాణి వినిపించాలి గానీ, సస్పెండ్ అయ్యి బయట ధర్నా చేస్తే ఒరిగేదేముంది? సభలో గందరగోళం సృష్టించాలని ప్రజలు కోరుకోవటం లేదు. తెగేదాకా లాగమనీ ప్రజలు కోరడం లేదు. మరి ఎవరి ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి? ఇది సమాధానం లేని ప్రశ్న. బహుశా ఇదేనేమో రాజకీయం అంటే!
-గుమ్మడిదల రంగారావు