‘పొట్టచేత పట్టుకోని బొంబాయికి పోయె కొడుకు ఏమి తినెనో.. కొడుకు ఎట్లుండెనో’.. అంటూ కన్నీరు మున్నీరైన పాలమూరు గడ్డ తలరాత మారింది. పాలమూరు అంటే ఒకప్పుడు కరువు, వలస కూలీలు. బొంబాయికి, దుబాయికి బిడ్డలు బత్కవోయిన దైన్యం నుంచి పాలమూరు బయటవడ్డది. ఎక్కడా లేనంత సాగుయోగ్యమైన, సారవంతమైన భూమి పాలమూరులో పరచుకొని ఉన్నప్పటికీ పరాయి పాలనలో నీళ్ల గోసతో నీరసిల్లింది. నీళ్లు లేక, సాగు ముందుకుసాగక కూలి బాట పట్టింది. ప్రాజెక్టుల ఆశ చూపి పబ్బం గడుపుకొన్న వలస పాలన పోయి స్వరాష్ట్రం రావడంతో ఇప్పుడదంతా నిన్నటి కథ అయ్యింది. వలసలు తారుమారైనయి. ఇతర ప్రాంతాల నుంచి కూలీలు ఉపాధి వెతుక్కుంటూ పాలమూరుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షాదక్షతల ఫలితంగా డెబ్బయ్ ఏండ్ల కల నెరవేరింది. నెర్రెలు వారిన నేల గొంతు తడపాలన్న సంకల్పం సిద్ధించబోతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల బృహత్ పథకం నేత్రపర్వమైన జలదృశ్యంగా రూపు దిద్దుకుంటున్నది
పక్కనుంచి చూసీచూడనట్టు పోతున్న కృష్ణమ్మను బుజ్జగించి, లాలించి బీళ్లకు మళ్లించారు. వలస పాలకులు అసాధ్యమన్న దాన్ని కేవలం పదేండ్లలో సీఎం కేసీఆర్ సుసాధ్యం చేసి చూపారు. పాలమూరు-రంగారెడ్డి సజల దృశ్యమై కరవు నేలతో కరచాలనం చేస్తున్నది. పాలమూరుతో పాటుగా మొత్తం దక్షిణ తెలంగాణలో పచ్చని భవితకు భరోసా ఇస్తున్నది. 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు జలహారానికి శుభారంభం కాబోతున్నది. నార్లాపూర్ ఇన్ టేక్ వెల్ వద్ద బాహుబలి మోటర్ల గర్జన వినేందుకు పాలమూరు ఉవ్విళ్లూరుతున్నది. 12.30 లక్షల ఎకరాల భూమికి సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు సమకూర్చే వరదాయిని జలసవ్వడుల కోసం ఎదురు చూస్తున్నది. నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్లోకి కృష్ణా జలాలను ఎత్తిపోసే దృశ్యం ఆవిష్కృతమయ్యే రోజురానే వచ్చింది. సీఎం కేసీఆర్ అన్నట్టుగా దక్షిణ తెలంగాణకు అది అచ్చంగా పండుగ దినమే. మొక్కులు తీర్చుకోవాల్సిన సంతోష సమయమే.
ఇప్పటికే డ్రైరన్ పూర్తి చేసుకొని వెట్న్క్రు పంప్హౌజ్ సిద్ధంగా ఉన్నది. సీఎం కేసీఆర్ స్విచాన్ చేస్తే కృష్ణమ్మ బిరాబిరా పరుగులిడుతుంది. పాలమూరు గుండెలపై పారాడుతుంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని పాలమూరు-రంగారెడ్డిని ప్రభుత్వం పట్టుదలతో ముందుకునడిపింది. ఎట్టకేలకు చివరి అంకంలో నిలిపింది. పర్యావరణ అనుమతులు రావడంతో చివరాఖరి అడ్డంకి తొలగిపోయినట్టయింది. కాళేశ్వర ప్రాజెక్టు స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు ఇంజినీర్లు సిబ్బంది అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల నుంచి నీటిని పొలాలకు తరలించేందుకు కాల్వల నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నది. కాల్వలు పూర్తయితే చిట్టచివరి ఎకరాకు కూడా నీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. బంగారు తెలంగాణ సాధనలో మరో ముఖ్యఘట్టం పూర్తవుతుంది. ఈ విజయం వెనుకనున్న సంకల్పం, కృషి అభినందనీయం.