ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల ఫలితాలు తెలంగాణలో చోటుచేసుకున్న నిశ్శబ్ద విద్యావిప్లవాన్ని మరోమారు ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రైవేటు విద్యాసంస్థల వద్దే నాణ్యమైన విద్య లభిస్తుందన్న దశాబ్దాల ఆలోచనా ధోరణిని ఈ ఫలితాలు తిరగరాశాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రైవేటు విద్యాసంస్థలకు అందనంత దూరంలో నిలిచి కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇంటర్లో ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రభుత్వ గురుకులాల్లో 92 శాతం నమోదైంది. సోషల్ వెల్ఫేర్ (89%), బీసీ వెల్ఫేర్ (87%), ట్రైబల్ వెల్ఫేర్ (84%), మైనారిటీ వెల్ఫేర్ (83%), మాడల్ స్కూల్స్ (66%) కూడా సత్తా చాటాయి. టెన్త్ క్లాస్ ఫలితాలూ దీనినే నిరూపించాయి. పదో తరగతి పరీక్షల్లో ప్రైవేటు స్కూళ్లలో 90.9 శాతం ఉత్తీర్ణత నమోదైతే, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 98.25 శాతం నమోదైంది.
నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ.. వాటి పరిపూర్తికే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిమితం కాలేదు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పథకాలు రచించి అమలు పరిచారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో అనేకరంగాల్లో సమూల మార్పు లు సంభవించాయి. వాటిలో ఒక ముఖ్యమైన రంగం ప్రభుత్వ విద్యారంగం. రాశిలోనూ, వాసిలోనూ తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత విద్యారంగానికి పోలికే లేదు. నాడు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు మౌలిక సౌకర్యాల లేమితో, నాసిరకం చదువుతో, విద్యార్థులే లేక కునారిల్లగా… నేడు విద్యార్థులతో కళకళలాడుతూ, సకల సదుపాయాలతో వర్ధిల్లుతున్నాయి. పలు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిష న్లు పూర్తయి, ‘నో అడ్మిషన్స్’ బోర్డులు వేలాడదీస్తున్నారంటే తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో వాటిపై నమ్మకం ఎంత పెరిగిందో అర్థమవుతుంది.
‘తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తు రూపొందుతుంది’ అన్న సూక్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణంగా ఆచరిస్తూ అమలు చేస్తున్నారు. కాబట్టే, విద్యారంగానికి అమిత ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కొత్తగా ఏర్పాటైన విద్యాసంస్థల సంఖ్య, వాటి విస్తృతి దీనిని నిరూపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో 298 గురుకులా లు ఉండగా, నేడు అవి 1004కు చేరుకున్నాయి. వాటిల్లో అత్యున్నతమైన బోధన, సదుపాయాలున్నాయి కాబట్టి, అడ్మిషన్ల సమయంలో కిలోమీటర్ల పొడవున తల్లిదండ్రులు, విద్యార్థులు లైన్లలో నిలబడి, దరఖాస్తులు ఇస్తున్నారు. ఎంసెట్, నీట్లకు విద్యార్థులు భారీసంఖ్యలో హాజరవుతున్న దృష్ట్యా.. వారికి ఉచితంగా శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రైవే టు కాలేజీలకు అనుమతులపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, ప్రభుత్వ కాలేజీల బలోపేతానికి చర్యలు తీసుకుంది. అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల మీద ఒత్తిడి పెంచటంపై కొరడా ఝుళిపిస్తూ పలు నిబంధనలను తీసుకొచ్చింది. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన సకల సదుపాయాలు కల్పించింది. సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. ఈ సకల సమగ్ర కార్యాచరణే నేడు ఫలితాల రూపంలో వెల్లడవుతున్నది.