అమెరికా నుంచి వచ్చిన మా కొడుకు-కోడలు ఓ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించారు. రాత్రి పూట ఆవురావురుమంటూ లొట్టలేసుకుంటూ ఆరగించారు. తెల్లవారేసరికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్గా తేల్చారు. రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసం, కలర్ కోసం వాడిన రంగు వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రూ.200 బిర్యానీ తిన్న పాపానికి అక్షరాల ఐదు వేల రూపాయలు ఆస్పత్రిలో బిల్లు రూపంలో కట్టాల్సి వచ్చింది. ఆ ఐదు వేల సంగతి పక్కనపెడితే ఆ రాత్రి అనారోగ్యంతో వాళ్లు ఎంత ఇబ్బందిపడ్డారో వర్ణనాతీతం.
నిత్యావసర వస్తువుల్లో అనవసర పదార్థాలను కలిపి కల్తీ చేయడం నేరం. ఈ కల్తీ వల్ల కొన్నిసార్లు ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుంది. మార్కెట్లో ఏ వస్తువుకు డిమాండ్ ఉంటుందో, ఆ వస్తువుకు ధర కూడా ఎక్కువే ఉంటుంది. కల్తీ వ్యాపారులు అలాంటి వస్తువులనే కల్తీ చేసి లాభాలు పొందుతారు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు… ఈ రోజుల్లో నూనె, పాలు, నెయ్యి, పప్పు, కారం వంటి అన్ని నిత్యావసర వస్తువులు కల్తీకి కేరాఫ్ అడ్రస్గా మారాయి.
వేరుశనగల బొమ్మను ప్యాకెట్పై ముద్రించి, ‘బ్లెండెడ్’ అనే పదాన్ని చిన్నదిగా ముద్రించి బ్లెండెడ్ ఆయిల్ పేరుతో కల్తీ నూనె అమ్ముతున్నా రు. దీనిలో పామాయిల్, వేరుశనగ నూనె ఎంత శాతం అనేది కల్తీని బట్టి ఉంటుంది. పప్పుల్లో టాల్కం పౌడర్ను కల్తీగా వాడుతారు. ఉదాహరణకు మినప గుండు పప్పును చాలా రసాయనాలను ఉపయోగించి నిగనిగలాడేలా చేస్తారు. నిజానికి నాణ్యమైన ఏ పప్పూ అంతగా మెరవదు. సాధారణ ఉష్ణోగ్రతలో స్వచ్ఛమైన నెయ్యి గడ్డ కట్టదు. వనస్పతిని కల్తీ చేసి మార్కెట్లో నెయ్యిగా విక్రయిస్తున్నారు. కారంలో రంగుపూసిన చెక్కపొడిని కల్తీగా వాడుతున్నారు. చికెన్, మటన్ బిర్యానీలలో ఆకర్షణ కోసం రంగులేస్తున్నారు. మిఠా యి తయారీలో పరిమిత స్థాయిలో రంగులు కలుపవచ్చు. కానీ కల్తీ వ్యాపారాలు ఏ ప్రమాణాలేవీ పాటించరు. చికోరి గింజలను కాఫీ గింజల్లో కలిపి కాఫీ పొడిని చౌకగా అమ్ముతున్నారు.
కల్తీ ఆహార పదార్థాలతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. మానవ శరీరం స్వచ్ఛమైన జీవ యంత్రం. తనలో ఇమడలేని పదార్థాలను శరీరం వేగంగా గుర్తిస్తుంది. అందుకే వాంతులు, విరేచనాలతో కల్తీ ఆహారాన్ని వెంటనే బయటకు పంపేస్తుంది. జీవ రసాయన చర్యలతో ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ వీటిపై పనిచేయవు. పైగా కొన్ని కల్తీ పదార్థాలు విష పదార్థాలుగా పరిగణింపబడి ఎం జైమ్స్ ఉత్పత్తి పడిపోతుంది. దీర్ఘకాలికంగా కల్తీ ఆహారం తీసుకుంటే మనిషి మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, జీర్ణకోశ సమస్యల బారినపడుతాడు. అందుకే రోడ్డుపక్కన అమ్మే చిరుతిళ్లను సాధ్యమైనంత మేర తినకపోవడమే మంచిది. చిరుతిళ్లకు సంబంధించి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతారు. దానితో తయారైన పిండి పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది.
‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇం డియా’ 2021-22కి గాను విడుదల చేసిన ఆహా ర నాణ్యత సూచిలో దేశంలోని 17 పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణకు 15వ స్థానం దక్కడం శోచనీయం. తమిళనాడు ఆహార నాణ్యతా ప్రమాణాల సూచి లో అగ్రస్థానంలో ఉండటం అభినందనీయం.
దేశంలో కల్తీ వ్యాపారాన్ని అదుపులో పెట్టే యంత్రాంగం సరిగా లేకపోవడం ప్రధాన కార ణం. తనిఖీ అధికారులు నాణ్యత పరీక్ష కోసం మౌలిక సదుపాయాలు, సిబ్బందికి శిక్షణా సామర్థ్యం, వినియోగదారుల సాధికారత అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుం ది. కానీ అవేవీ పారదర్శకంగా జరగడం లేదనేది వాస్తవం. ఆహారం విషయంలో నాణ్యత పాటించనివారికి జరిమానాలు విధించడం, సంబంధిత దుకాణాలను శాశ్వతంగా సీజ్ చేయడమే కల్తీ అనే జఠిల సమస్యకు ఏకైక మార్గం.
టి.పార్థసారథి: 99496 52118
(వ్యాసకర్త: ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు)