రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువలను, ఆదేశాలను బేఖాతరు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాజకీయ అధికారం కోసం పావులుగా వాడుకుంటున్నది. ఈ నీచ రాజకీయాలను నిరోధించేందుకు రాజకీయ పార్టీలు, మేధావులు, బుద్ధిజీవులు కలిసి ఐక్యంగా పోరాడాలి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత బీజేపీయేతర పాలిత రాష్ర్టాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను బాహాటంగానే ఉపయోగించుకుంటున్నది. సమాఖ్యస్ఫూర్తిని కూల్చే పనిలో నిమగ్నమైంది. స్వయం ప్రతిపత్తి గల కేంద్ర దర్యాప్తు సంస్థలను తన ఆధీనంలో పెట్టుకొని దేశంలో నియంత తరహా పాలన కొనసాగిస్తున్నది. కేంద్రానికి అనుకూలంగా లేని రాష్ర్టాల్లో ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు నిర్వహిస్తూ అక్కడి పాలక పార్టీల నాయకులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నది.
మరోవైపు గవర్నర్ వ్యవస్థ ను కేంద్రం అడ్డుపెట్టుకొని అధికార దాహంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఏకంగా ఎమ్మెల్యేలనే కొనుగోళ్లు చేస్తున్నది. తెలంగాణలో బీజేపీ బేరసారాల కుట్రను సీఎం కేసీఆర్ ఛేదించేసరికి ఉక్కిరి బిక్కిరై మనీ లాండరింగ్ కేసుల పేరుతో పాలక పక్షనాయకులను లొంగదీసుకోవడానికి ఐటీ, ఈడీ దాడులకు తెరలేపింది. దీన్ని పరిశీలిస్తే 20 24 ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటినుంచే వేట మొదలు పెట్టినట్లు అర్థమవుతున్నది.
స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులోభాగంగా ఆగమేఘాల మీద కేంద్ర ఎన్నికల కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ను నియమించింది. మే 15 నుంచి ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషనర్ స్థానాన్ని ఎందుకు హడావుడిగా భర్తీ చేశారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది. ఈ నిర్ణయాన్ని ఇంత త్వరగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించింది. దేశంలో ఎన్నికలను సజావుగా సాగేలా చూసేందుకు నియమించే కేంద్ర ఎన్నికల కమిషనర్లకు బీజేపీ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండని కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ మోదీ ప్రభుత్వం దేశ పరిపాలనలో నియంతలా వ్యవహరించడానికి రాజ్యాంగస్ఫూర్తికి విఘా తం కలిగేలా వ్యవహరిస్తున్నది. ఇందుకోసం ప్రధాని మోదీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సరిగ్గా 1920లో జర్మనీ నియంత హిట్లర్ కూడా ఇలాగే చేశారు. నాజీ పార్టీని స్థాపించి ప్రజల్లో జాతీయవాదం రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టారు. తనతో ఏకీభవించని వారి పీక నొక్కే ప్రయత్నం చేశారు. దేశానికి నియంతగా వ్యవహరించి తాను నమ్మి న సిద్ధాంతాన్ని అమలుచేశారు. ఇప్పుడు మోదీ కూడా హిట్లర్ వలె ప్రవర్తిస్తున్నారనే విమర్శ వినిపిస్తున్నది.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన బడా ఆర్థిక నేరగాళ్లను వదిలిపెట్టి, రాజకీయాల కోసం అధికార దుర్వినియోగం చేస్తున్న బీజేపీ చేస్తున్నవి నీచ రాజకీయాలు… చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులు. మోదీ ప్రభుత్వం అధికార పిపాసిలా తయారై, నియంతగా వ్యవహరిస్తూ బహుళత్వానికి, వైవిధ్యానికి చిహ్నమైన మన సమాజాన్ని అమాంతంగా తొక్కి వేస్తున్నది. బీజేపీ పిట్ట బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడినా చైతన్యవంతమైన తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీకి ఆదరణ లభించదు. దేశవ్యా ప్తంగా కేంద్ర ప్రభుత్వం అరాచక రాజకీయాలకు పాల్పడుతున్న నేపథ్యంలో భావసారూప్యత గల పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, విభేదాలన్నీ పక్కనబెట్టి కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలి. బుద్ధి జీవులు, ప్రజాస్వామికవాదు లు, ప్రగతివాదులు కేంద్ర ప్రభుత్వ అరాచకాలను ప్రతిఘటించాలి. తమతో కలిసి వచ్చే రాజకీయపార్టీల మద్దతు తో కేంద్రంపై ఉమ్మడి పోరా టం చేయాలి.
డాక్టర్ సంగని మల్లేశ్వర్:98662 55355