2001-2002 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన పింఛన్ అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. అప్పటికే నూతన పింఛన్ విధానం రూపకల్పనపై బీకే భట్టాచార్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపొర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 2004 జనవరి 1 నుంచి నూతన పింఛన్ను (ఎన్పీఎస్)ను అమలుచేస్తున్నది. రక్షణ శాఖను మినహాయిస్తూ అన్నిశాఖల్లో దీన్ని ప్రవేశపెట్టాలి.
ఉమ్మడి ఏపీలో 2004, జనవరి 9 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పింఛన్ స్కీమ్ (సీపీఎస్)ను అమలుచేస్తున్నది. అప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ పింఛన్ రూల్స్ 1980 ప్రకారం నాన్-కాంట్రీబ్యూటరీ డిఫైన్డ్ పింఛన్ స్కీమ్ను రద్దుచేస్తూ కాంట్రీబ్యూటరీ పింఛన్ స్కీమ్ (సీపీఎస్)ను అమలుచేసింది. దీన్ని చందా ఆధారిత, భాగస్వామ్య పింఛన్ పథకం అంటారు.
1.ఉద్యోగి పదవీ విరమణ తర్వాత, పదవీ విరమణ చేసిన చివరి నెలలోని మొత్తం వేతనం నుంచి సగం మొత్తాన్ని ఉద్యోగికి ప్రతి నెలా పింఛన్గా చెల్లిస్తారు. ఉదాహరణకు ఉద్యోగి పదవీ విరమణ చేసిన నెలలో రూ.లక్ష జీతం ఉంటే పదవీ విరమణ చేసిన మరుసటి నెల నుంచి రూ.50 వేలు పింఛన్గా చెల్లిస్తారు. ఇది సీపీఎస్లో లేదు. 2. ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే వారి కుటుంబసభ్యులకు ఒకరికి ఉద్యోగం, కుటుంబ పింఛన్ ఇస్తారు. దీన్నే ‘డెత్ కమ్ ఫ్యామిలీ పింఛన్’ అంటారు. ఇది కూడా సీపీఎస్లో లేదు. 3.ఉద్యోగి పదవీ విరమణ తర్వాత మరణిస్తే వారి భార్య లేదా భర్త లేదా వారిపై ఆధారపడిన వారికి నెలనెలా పింఛన్ చెల్లిస్తారు. దీన్ని ‘కుటుంబ పింఛన్’ అంటారు. ఇది కూడా సీపీఎస్లో లేదు. 4.ఉద్యోగి పదవీ విరమణ తర్వాత తన పింఛన్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి అమ్ముకొని నగదు పొందుతాడు. దీన్నే ‘కమ్యూటేషన్’ అంటారు.
5. పదవీ విరమణ పొందినవారికి రూ.12 లక్షలు గ్రాట్యుటీ సీపీఎస్లో లేదు. 6. ప్రతి ఐదేండ్లకోసారి ప్రభుత్వం వేసే పీఆర్సీలో వేతన పెరుగుదలలో ఉద్యోగుల వలె పింఛనర్స్కూ వేతన ఫిట్మెంట్, డీఏ, ఐఆర్లలో పెరుగుదల ఉంటుంది. ఈ సౌకర్యం సీపీఎస్లో లేదు. 7. పాత పింఛన్లో ఉద్యోగికి జీపీఎఫ్ అకౌంట్ ఉండటం వల్ల నెలకు కొంత సొమ్మును అకౌంట్లో వేస్తూ అవసరం ఉన్నప్పుడు, పార్ట్ ఫైనల్, లోన్ రూపంలో ఆసుపత్రి ఖర్చులకు, పిల్లల చదువులకు, పెండ్లిళ్లకు ఉపయోగించుకుంటారు. ఇది సీపీఎస్ విధానంలో లేదు. పాత పింఛన్ విధానంలో ఈ సౌకర్యాలన్నీ ఉండటం వల్ల ఉద్యోగి పదవీ(సర్వీస్)లో ఉన్నప్పుడు గాని పదవీ విరమణ అనంతరం గాని భరోసాతో, సామాజిక భద్రతతో జీవిస్తాడు.
పాత పింఛన్లో ఉన్న సౌకర్యాన్ని తొలగిస్తూ నూతనంగా తెచ్చిన సీపీఎస్ విధానంలో ఉద్యోగికి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) కేటాయిస్తూ ఉద్యోగి నెల జీతం నుంచి బేసిక్, డీఎలలో పది శాతాన్ని అందులో జమచేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది. ఇలా ఉద్యోగి పదవీ విరమణ వరకు చెల్లిస్తుంటారు. దీన్ని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) మానిటరింగ్ చేస్తుంది. ఈ సంస్థ కేంద్రం ఆధీనంలో పనిచేస్తుంది. అయితే ఉద్యోగి వాటాను, మూడు భాగాలుగా విభజిస్తూ ఎస్బీఐ 33 శాతం, యూటీఐ బ్యాంక్లో 34 శాతం, ఎల్ఐసీలో 33 శాతం పెట్టుబడులుగా ఈ మొత్తాన్ని పెడుతారు. ఉద్యోగి పదవీ విరమణ అనంతరం దాచుకున్న మొత్తం సొమ్ము నుంచి 60 శాతాన్ని నగదుగా చెల్లిస్తూ మిగతా 40 శాతాన్ని షేర్ మార్కెట్లో యాన్యుటీగా పెడుతారు. దీన్నుంచి వచ్చే లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగికి పింఛన్ చెల్లిస్తారు. ఇప్పటికి పదవీ విరమణ చేసిన లేదా మరణించిన ఉద్యోగులకు నెలకు 2,000 నుంచి 3,000 వరకు పింఛన్ వస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ కన్నా తక్కువే. అందుకే షేర్ మార్కెట్పై ఆధారపడే జీతాల వల్ల ఉద్యోగ విరమణ పొందిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది ఉద్యోగులకు గుదిబండగా మారింది.
తెలంగాణ ప్రభుత్వంలో సీపీఎస్ పరిస్థితి, సీపీఎస్ విధానం వల్ల ప్రభుత్వానికి, ఉద్యోగులకు నష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందాయి. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగి ప్రాన్ ఖాతాల్లో దాచుకున్న సొమ్మును ప్రభుత్వానికి చెల్లిస్తేనే ఫ్యామిలీ పింఛన్ మంజూరు చేస్తారనే నిబంధనలను తొలగించాలి.
ప్రతి నెలా కొంత సొమ్మును ప్రభుత్వ వాటా కింద ఉద్యోగి ప్రాన్ ఖాతాల్లో జమచేయటం, ఆ సొమ్మును కేంద్ర ప్రభుత్వం వాడుకోవడం బడా, బడా కంపెనీలకు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. 15 లేదా 20 ఏండ్ల తర్వాత పదవీ విరమణ పొందే ఉద్యోగుల ఖాతాలకు ఇప్పుడే రాష్ట్రం చెల్లించడం వల్ల ఉద్యోగులకు, రాష్ర్టానికి ఆర్థికంగా భారం పడుతుంది. సీపీఎస్ రద్దు చేయాలన్న ఉద్యోగుల విజ్ఞాపనలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం విశేషం. పాత పింఛన్ పునరుద్ధరణ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని వేస్తామని పార్టీ తమ మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టడం అభినందనీయం. ఉద్యోగులందరూ దీనిని స్వాగతిస్తున్నారు.