తన పాటతో, కవిత్వంతో నిజాం పాలకులను ఎదిరించి ప్రజా పోరాటానికి ఒక ఊపును తీసుకువచ్చిన వాడు సుద్దాల హనుమంతు. నిజాం పాలనకు వ్యతిరేకంగా, గ్రామాల్లో భూస్వాముల దాష్టీకాలను ఎండగట్టడంలో సుద్దాల హనుమంతు ఒక దిక్సూచిలా పనిచేశాడు. పాటను ఆయుధంగా మలిచి పాలకుల గుండెల్లో గురిపెట్టిన సుద్దాల హనుమంతు పాటలు నిజాం వ్యతిరేక పోరాటం చేస్తున్న విప్లవకారుల పెదాల పైన అలవోకగా నర్తించేవి. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
తెలంగాణ ప్రజలను అమితంగా ఆకట్టు కుని ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి పోయిన ‘పల్లెటూరి పిల్లగాడ పసుల కాసే మొన గాడ’ పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో మనకు తెలిసిన విషయమే. నిరంకుశ నిజాం రాజ్యంలో గ్రామాల్లో భూస్వాముల కర్కషత్వం కింద నలిగిపోతున్న అమాయక ప్రజల స్థితి గ తులను కండ్లకు కడుతూ వాళ్లను వెన్నుతట్టి పోరాటానికి సిద్ధం చేసేలా ఆయన గేయాలు ఉండేవి.నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతి కున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందిం చి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజా కవి సుద్దాల హనుమంతు.
‘నీకు జీతము నెలకు కుంచెడు
తాలు వలిపిడి కల్తీ గాసం
కొలవగ సేరు తక్కువ వచ్చాయా
ఓ పాలబుగ్గల జీతగాడా’
ముక్కుపచ్చలారని పిల్లలను పశువుల కాప రులుగా పెట్టుకొని వాళ్ళను ఎన్ని విధాలుగా మోసం చేసేవారో.. సుద్దాల హనుమంతు కండ్ల కు కట్టినట్టు చెప్పారు. ఇచ్చే జీతం నెలకు కుంచె డు గింజలే… అందులో తాలు, వలిపిడి కూడిన కల్తి గింజలు. యజమాని ఇచ్చిన ఆ కుంచెడు గింజలను ఇంటికి తెచ్చుకొని కొలిచి చూస్తే సేరు గింజలు తక్కువ వచ్చాయట. ఈ మోసాలను ఎక్కడా చెప్పుకోలేని దైన్య స్థితిని హనుమంతు గేయాలు విశదీకరిస్తాయి.
నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రజలు అనేక పోరాట రూపాలను ఎంచుకున్నారు. ప్రత్యక్ష పోరాటంలోకి దిగిన పోరాటయోధులు ఆయు ధం చేత బూని యుద్ధరంగంలోకి దిగితే కొంద రు మేధావులు ప్రజా పోరాట భావజాలాన్ని విస్తరించడం కోసం పనిచేశారు. కవులు, రచ యితలు, కళాకారులు… కవిత్వం, నాటకం, కథ, వ్యాసం లాంటి రూపాలలో తమ తిరుగు బాటును పాలకులకు తెలియజేశారు. సుద్దాల హనుమంతు పాటను తన పోరాట రూపంగా మలుచుకున్నారు. ప్రజా పోరాటంలో పాటకు ఉన్న మహత్తర శక్తిని ఆయన అంచనా వేయ గలిగారు. కాబట్టే ఆయన పాటను పదునైన పోరాట రూపంగా మలవగలిగారు. పాటకు కూ డా ఆయన వివిధ రూపాలను ఇచ్చారు. బుర్ర కథ, యక్షగానం, హరికథ మొదలైన ప్రక్రియలు ఆయన గేయాన్ని మరింతగా రాటు తేల్చాయి.
హనుమంతుకు విద్య పెద్దగా లేదు- కేవలం రెండవ తరగతి వరకు చదివాడు. వీధిబడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. శత కా లు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి ఉండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు. చిన్నతనం నుంచే నాటకాలపై ఆసక్తిని పెంచుకున్న హను మంతుకు ప్రజా కళారూపాలైన హరికథ, బుర్ర క్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరా టానికి ప్రచార సాధనాలుగా ఉపయోగ పడ్డా యి. ఆయన బుర్రకథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దు రాగతాలను, దొరల దౌర్జన్యాలను బుర్రకథల రూపంలో ఎండగట్టారు సుద్దాల.
‘ఎన్నో ఆశలతో చెమటోడ్చి
దున్నుకున్న బంజరు భూమి
కన్నుగుట్టి మాయ పన్ని
తన్ని గుంజుకునే భూస్వామి
అన్నా నీవు కన్నకలలు వ్యర్థమాయేగదా’
అంటూ కష్టించి సంపాదించు కున్న నేల తనది కాకుండా ఎలా పోతున్నదో ఆ రైతుకు అర్థమయ్యే టట్టు రాసి పాడటంలో ఆయనకు ఆయనే సాటి. పల్లెటూరి పిల్లగాడ (మాభూమి), రణభేరి మో గింది తెలుగోడ, వేయ్ వేయ్ దెబ్బ, ప్ర జా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయ నకు పేరు తెచ్చాయి.
ఒక క్రమశిక్షణ గల కమ్యూనిస్టు కార్యకర్తగా, కవిగా, పోరాట యోధు డి గా, సామాజిక స్పృహ గల కళాకారుడి గా ఆయన తెలంగాణ పోరాటాలకు వెన్ను దన్నుగా నిలిచారు. సుద్దాలకు కళ ల పట్ల, గేయాల పట్ల మక్కువ ఎక్కువ. ఆ మక్కు వతో ప్రజా పోరాటాలలో విచి త్ర వేషా లు, గొల్లసుద్దులు’, లత్కోరు సాబ్’, బుడ బుక్కలు’, ఫకీరువేషం’, సాధువు’ మొద లైన కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు.
సుద్దాలకు ఊహ తెలిసినప్పటినుంచి అన్యాయాలను ఎదిరించే కమ్యూనిస్టు పార్టీతోనే ఆయన సంబంధం కొనసా గింది. కమ్యూనిస్టు పార్టీ 11వ మహాసభ భువనగిరిలో జరిగిన ప్పుడు ఒక వాలంటీర్గా ప్రవేశం పొందిన సు ద్దాల హనుమంతు జీవితం కడవరకు కమ్యూనిస్టు పార్టీలోనే ఉన్నారు.
ప్రజా గేయాలను, పలు ప్రజా కళారూపాల ను జనంలో ప్రదర్శించే సుద్దాల హను మంతు కొంతకాలం అజ్ఞాత జీవితం గడప వలసి వచ్చింది. ప్రజల కష్టాలను పాటల్లో ప్రదర్శించే ఈ వాగ్గేయకారుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతుకూరు మండలం, పాలడుగు గ్రామంలో 1908 డిసెంబర్లో జన్మించారు. ఆయన ఇంటి పేరు గుర్రం ఐనా ఆయన కుటుంబం చాలా కాలం సుద్దాల గ్రామంలో నివసించడం వల్ల ఆ ఊరి పేరు ఇంటిపేరుగా స్థిరపడింది.
నిజాం వ్యతిరేక పోరాటక్రమంలో ఆయన రాసిన గేయాలు వీర తెలంగాణ పేరుతో సంపు టిగా వచ్చాయి. నిజాం వ్యతిరేక పోరాటంలోనే కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ఎన్నో పోరాటా లకు కవులకు కళాకారుల కు దారి చూపిన సుద్దాల హనుమంతు 1982 అక్టో బర్ 10న క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ ఈ లోకా న్ని విడిచి వెళ్లారు.
(అక్టోబర్ 10న సుద్దాల హనుమంతు వర్ధంతి)
– సీ హెచ్ ఉషారాణి 94412 28142