కరోనా కాలంలో ఎక్కడికెళ్లినా నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కనిపించేవి. అవి కనుమరుగు కావడంతో ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తరకం బోర్డులు దర్శనం ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆఫీసుల వద్ద ‘నో సెల్ఫీ ప్లీజ్’ బోర్డును పెట్టుకోక తప్పదేమో. మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను ఒక వ్యక్తి తనకుతానుగా ఐపీఎస్ అధికారినని, ప్రస్తుతం సీబీఐలో డిప్యూటేషన్పై పని చేస్తున్నట్టు పరిచయం చేసుకొని ఫోటో దిగడం, మనవాడే కదా అని మంత్రి, ఎంపీ ఫోటోకు పోజు ఇవ్వడంతో ఏం జరిగిందో తెలిసిందే.
సదరు నకిలీ ఐపీఎస్ ఢిల్లీలో తమిళనాడు భవన్లో అసలు సీబీఐ అధికారులకు పట్టుబడటం, ఆయన మొబైల్లో ఉన్న ఫోటోల ఆధారంగా మంత్రికి, ఎంపీకి సీబీఐ నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే నకిలీ అధికారి ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులతో ఫోటోలు దిగినట్టు సమాచారం. ఇదే తరహాలో ఎమ్మెల్యేల ఎర కేసులో పట్టుబడిన నందకుమార్ కూడా పలు పార్టీల ప్రజాప్రతినిధులతో దిగిన ఫోటోలు బయటపడ్డాయి. ఫోటోనే కదా అని ఎవరితోబడితే వారితో కలిసి ఫోటోలకు పోజు ఇస్తే… రేపటి రోజున సదరు ఆగంతకునికి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయో బయటపడితే, వారు కూడా అప్పుడు దర్యాప్తు సంస్థల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!
రాజశేఖర్రెడ్డి బిడ్డను.. పులిబిడ్డను.. పులివెందుల బిడ్డను.. ఎవరికీ భయపడనంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ గడ్డపై రెచ్చిపోయి మరీ స్పీచ్లు దంచేస్తుంది. రాజశేఖర్రెడ్డి అని తండ్రి పేరున్న పిల్లలు ఎవరికీ భయపడరా? ఒక్క పులివెందులలో పుట్టిన వాళ్లు మాత్రమే పులిబిడ్డలా? ఇతర ప్రాంతాలలో పుట్టినవారు కాదా? ఆ మాటకొస్తే అక్కడెక్కడ ఉన్నాయి పులులు? ఇక్కడ మా వద్ద నల్లమలలో ఉన్నాయి. రజాకార్ల సేనలను తరిమి తరిమి కొట్టిన చాకలి ఐలమ్మ వంటి ధీర వనితలు నడయాడిన నేల ఇది. కనీసం చరిత్ర అయినా తెలుసుకోకుండా స్పీచ్లు దంచితే ఎట్లా తల్లి? అని సోషల్ మీడియాలో తెలంగాణ బిడ్డలు ఉతికి ఆరేస్తున్నా పులిబిడ్డ నోరు మెదపటం లేదు ఎందుకో?
– వెల్జాల