కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై ఎప్పటికీ సవితి తల్లి ప్రేమే చూపుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష నగ్నంగా, భయోద్విగ్నంగా కొనసాగుతున్నది. మోదీ పాలనలో ఇది మరింత విశ్వరూపం దాల్చింది. అందుక్కారణం దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా బీజేపీ అధికారంలో లేకపోవడం. కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీయేతర పార్టీల పరిపాలనను అప్రజాస్వామికంగా కూల్చి అధికారంలోకి రావడం రాజ్యాంగ విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే. ఈ క్రమంలో దేశంలో సమాఖ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జాతీయ పార్టీ అవసరం ఉన్నది.
వందేండ్ల పైచిలుకు వయసున్న కాంగ్రెస్ పార్టీ, వందేండ్ల వయసున్న కమ్యూనిస్టు పార్టీలు, జనసంఘ్ గా ఉండి బీజేపీగా నామాంతరం చెందిన భారతీయజనతా పార్టీలన్నీ ఉత్తరాదివారి నాయకత్వంలో పుట్టి పెరిగి వారి ప్రయోజనాలను కాపాడుతున్నవే. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, నీలంసంజీవరెడ్డి, కె.ఆర్.నారాయణన్ నలుగురు మాత్రమే దక్షిణాదివారు. రాష్ట్రపతులుగా ఈ నలుగురు సమర్ధ వంతులుగా, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న వారే. అయినా దక్షిణాది వారిని రాష్ట్రపతులుగా అంగీకరించే సహృదయత ఉత్తరాది పార్టీలకు లేదు. ప్రధానులుగా దక్షిణాది వారు దేవెగౌడ, పీవీ. నరసింహరావులు ఇద్దరే అయ్యారు. అది ఒక అవకాశంగా మాత్రమే. దేవెగౌడను నాలుగు నెలల కంటే ఎక్కువ ఉండనీయలేదు. పీవీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేకున్నా ఐదేండ్లు సమర్ధనీ యంగా పాలించినా అతన్ని ఎన్నో ఇబ్బందులపాలు చేశారు. పీవీ సమాధిని ఢిల్లీలో ఇతర ప్రధానుల పక్కన కట్టకుండా వివక్ష చూపి దక్షిణాదిని అవమానించారు.
జాతీయపార్టీలన్నీ కచ్చితంగా దక్షిణాదిని నిర్లక్ష్యం చేసినవే. ఆయారాష్ర్టాల ప్రాంతీయ సమస్యలను, అవసరాలను, భాషాసాంస్కృతిక విషయాలను గుర్తించకపోవటం వల్లనే ప్రాంతీయ అవసరాల నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. కానీ జాతీయ స్థాయిలో వాటి ప్రభావం అంతంతమాత్రమే. కాంగ్రెస్ సెమీ లౌకికవాద విధానం, ఇందిరా రాజీవ్ల తర్వాత నాయకత్వలేమి, క్రియా శూన్యత క్రమక్రమంగా బీజేపీకి ప్రాణం పోసింది.
పూర్తి మెజారిటీతో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఉపాధిని కలిగించే ఒక్కపని కూడాచేయకుండా నోట్లరద్దు, జీఎస్టీ. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటుపరం లాంటివన్నీ చకచకా జరిగిపోతున్నాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయాలనే వాదం పెరిగిపోతుంది. మతతత్వం, సెంటిమెంట్లను రెచ్చగొడుతూ లౌకిక, ప్రజాస్వామిక, ఫెడరల్ విధానానికి గండి కొడుతూ బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడం పనిగా పెట్టుకున్నది. వందలాది కోట్ల అప్పును దేశప్రజలపై మోపుతూ కార్పొరేట్ శక్తులను ధనవంతులను చేస్తున్నది. పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వాలకు నిధులివ్వకుండా వేధిస్తున్నది. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలను గౌరవించకుండా ఇతర పార్టీలను శత్రుపార్టీలుగా భావిస్తూ అవినీతిముద్ర, దేశద్రోహ ముద్రలు వేస్తూ వేదనకు గురిచేస్తున్నది. మరోవైపు, దేశంలోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఉన్న రాష్ర్టాలకంటే మెరుగ్గా, ప్రజోపయోగకరంగా పని చేస్తున్నాయి. ఎంత బాగా పనిచేస్తున్నా ఈ రాష్ర్టాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్షచూపుతున్నది. పైగా సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ లాంటి రాష్ర్టాల నుంచి కేంద్రం తీసుకోవాల్సిన నిధులు తీసుకుంటున్నది. కానీ ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు. పైగా అవినీతి ఆరోపణల పేరుమీద కేసీఆర్ లాంటి నాయకులను, పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నది. తమపార్టీలోని అవినీతిపరులను, లక్షలాది కోట్ల ప్రభుత్వసొమ్మును ముంచిన కార్పొరేట్ శక్తులను, తమ ఆస్తులను కాపాడుకోవటానికి బీజేపీలో చేరిన, చేర్చుకున్న ఇతర పార్టీనేతల అవినీతి గురించి మాట్లాడకుండా ప్రజల కోసం అద్భుత పథకాలతో పని చేసే ప్రాంతీయ పార్టీలను వేధిస్తున్నది.
అందువల్ల దక్షిణాది నుంచి జాతీయస్థాయిలో మొత్తం దేశానికి సంబంధించిన అంశాలతో, మ్యానిఫెస్టోతో ఓ జాతీయపార్టీ అవసరముంది. ఆ అర్హత సుదీర్ఘ రాజకీయానుభవం, రాజనీతిజ్ఞత ఉన్న కేసీఆర్కే ఉన్నది. కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తించుకోదగిన అభివృద్ధి నమూనాను అందించారు. ఏ దేశం అయినా రాష్ట్రం అయినా ప్రజానీకానికి అన్నమందించే రైతన్నకు ప్రథమ స్థానమిస్తేనే ఆ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టు. ప్రజల ఆకలిమంటలు తీర్చే వ్యక్తి అన్నదాత. ఎవరు పని చేయకున్నా నడుస్తుంది కానీ రైతు పని చేయకుంటే పంటలు (అన్నం) లేక జనం అల్లాడుతారు. రైతే రాజని, అన్నదాతని గొప్ప గొప్ప పేర్లతో పిలిచాం కానీ రైతును పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. వ్యవసాయాన్ని పట్టించుకున్న పాలకులు లేరు. నీటి వసతి లేక, పెట్టుబడి సాయం లేక, రుణమాఫీ లాంటివేమీ లేకుండా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే స్థితిని చూసాం.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో సీఎం కేసీఆర్ పట్టించుకొన్నట్టు రైతును ఎవరూ పట్టించుకోలేదు. నీటికొరత తీర్చడానికి కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, పంటల బీమా, విత్తనాల సరఫరా, రుణమాఫీ లాంటి అనేక పథకాల వల్ల తెలంగాణలో రైతే రాజయ్యే పరిస్థితి వచ్చింది. మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ పథకాలు తాగునీరు, చెరువుల కుంటల, నీటి నిల్వల సమస్యలను తీర్చాయి. హరితహారంతో కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలంగాణాను రోల్ మోడల్గా నిల్పారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నాయకులు 34 మంది కేసీఆర్ను కలిసి అభినందించారంటే అంతకంటే మరేం కావాలి. కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలాన్నీ జాతీయస్థాయిలో అమలు చేయాల్సిన గొప్ప పథకాలు. దేశమంతటికీ వర్తించే మానవీయ పథకాలు అవి. వీటిని మ్యానిఫెస్టోగా తీసుకొని జాతీయ పార్టీని నడిపే సామర్థ్యం ఒక్క కేసీఆర్కే ఉన్నది. ఈ పార్టీ దక్షిణ భారతీయులకే కాక యావత్ దేశ ప్రజానీకాన్ని ఐక్య భారతీయత వైపు మరల్చడంలో విశేష ప్రభావం చూపనున్నది. 2024 ఎన్నికల్లో దక్షిణాదికి చెందినవారు ప్రధాన మంత్రి పదవి చేపట్టి దేశ సౌభాగ్యాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీని ఆహ్వానిద్దాం.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో సీఎం కేసీఆర్ పట్టించుకొన్నట్టు రైతును ఎవరూ పట్టించుకోలేదు. నీటికొరత తీర్చడానికి కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, పంటల బీమా, విత్తనాల సరఫరా, రుణమాఫీ లాంటి అనేక పథకాల వల్ల తెలంగాణలో రైతే రాజయ్యే పరిస్థితి వచ్చింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు తాగునీరు, చెరువుల కుంటల, నీటి నిల్వల సమస్యలను తీర్చాయి.
డా.కాలువ మల్లయ్య: 91829 18567