సుదూర భవిష్యత్తులోనైనా సరే, గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టి విలయం సృష్టించకుండా తగు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే క్రమంలో, అమెరికా సంస్థ ‘నాసా’ చేపట్టిన తాజా ప్రయోగం అపూర్వమైనది. నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక పది నెలల పాటు ప్రయాణించి మంగళవారం నిర్దేశిత గ్రహ శకలాన్ని ఢీకొన్నది. గ్రహ శకలాల నుంచి భూగోళాన్ని కాపాడుకోవడానికి సాగించిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. గత కోట్లాది సంవత్సరాలలో గ్రహ శకలాలు భూమిని ఢీకొన్న ఉదంతాలు ఉన్నాయి. చంద్రుడు భూమి నుంచి విడిపోవడానికైనా, ఇక్కడి రాకాసి బల్లులు ఇతర జీవజాలం అంతరించడానికైనా ఈ శకలాలు ఢీకొనడమే కారణమనే అభిప్రాయం ఉన్నది. వచ్చే కొన్ని శతాబ్దాలలో భూమిని ఢీకొనే పరిస్థితులు లేవు. కానీ ఎప్పటికైనా ఇటువంటి ప్రమాదం తలెత్తితే నిస్సహాయంగా ఉండి పోవలసి వస్తుంది. అందుకే ఈ సంసిద్ధత.
భూమికి పదకొండు మిలియన్ కిలోమీటర్ల దూరంలో, 780 మీటర్ల వ్యాసం ఉన్న డిడైమాస్ అనే గ్రహ శకలం చుట్టూ తిరుగుతున్న 160 మీటర్ల డైమార్ఫస్ అనే చిన్న శకలాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న శకలాన్ని ఎంచుకుంటే ఢీకొట్టడం వల్ల దాని పరిభ్రమణంలో వచ్చే కొద్ది పాటి మార్పును లెక్కించడం కష్టమవుతుంది. అందుకని ఒక శకలం చుట్టూ చిన్న వృత్తంలో ప్రయాణించే మరింత చిన్నదైన శకలాన్ని గుర్తించారు. ఈ చిన్న శకలం ఒక పరిభ్రమణానికి పన్నెండు గంటలు పడుతుంది. అంతరిక్ష నౌక ఢీకొన్న తరువాత ఈ ప్రయాణం పది నుంచి పదిహేను నిమిషాల మేర తగ్గుతుందని అంచనా. ఈ నిర్ధారణకు కొంతకాలం పడుతుంది. శకలం గమనాన్ని మార్చగలమనేది ప్రయోగాత్మకంగా రుజువైతే, ఈ ప్రాతిపదికగా భూమి వైపు దూసుకొచ్చే శకలాలను దారి మళ్ళించడానికి మరిన్ని ప్రయోగాలు జరుపుకోవచ్చు.
మానవాళి చరిత్రలోనే మొదటిదైన ఈ బృహత్తర ప్రయోగం గర్వించదగినదే. అయితే విజ్ఞాన శాస్త్రంలో పురోగమనంతో పాటు మానవులు విజ్ఞతతో వ్యవహరించడం కూడా అవసరం. లేకపోతే శాస్త్రవిజ్ఞానం వికాసానికి బదులు వినాశనానికి దారి తీస్తుంది. ప్రభుత్వ సొమ్ముతో సాగించే ప్రాథమిక ప్రయోగాలు ప్రైవేటురంగ వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతాయనే విమర్శ ఎంతోకాలంగా ఉన్నది. బడ్జెట్ కేటాయింపుల కోసమే గ్రహాంతర జీవుల ప్రచారాన్ని వాడుకున్నారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. మానవాళిని అనేకసార్లు నాశనం చేయగల అణ్వాయుధాలను పెద్ద దేశాలు పోగుచేసుకున్నాయి. విచ్ఛలవిడి అభివృద్ధి విధానాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్నది. ఇప్పటికైనా వివేకంతో వ్యవహరించకపోతే, గ్రహ శకలాలు ఢీకొనకుండానే మానవాళితో సహా సమస్త జీవజాలం అంతరిస్తుంది.