తాతతండ్రులకు పెద్దగా ఆస్తులుగానీ, ఉన్నత చదువులూగానీ లేవు. అసలే కులాలతో కూడుకున్న సమాజం. అలాగని పెత్తందారీ కులమూ కాదు. వీటికి తోడు రహదారి కూడా లేని చిన్న పల్లెటూరు. అలాంటి నేపథ్యం ఉన్న సాధారణ యాదవ కుటుంబంలో జన్మించారు ములాయం సింగ్ యాదవ్.
ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లా సేఫయీ అనే గ్రామంలో 1939 నవంబర్ 22న పుట్టారు ములాయంసింగ్ యాదవ్. కనీసం బడి కూడా లేని పల్లెటూరది. ఆయన తండ్రిపేరు షుగర్ సింగ్. ఐదుగురు కొడుకులు, ఒక కూతురు సంతానం గల ఆ కుటుంబంలో ములాయం మూడోవాడు. చిన్న వ్యవసాయ కమతం, ఆవులు, గేదెలు వీటి సంరక్షణే ములాయం తండ్రి జీవనవృత్తి. తన పిల్లలు కూడా పశువుల పెంపకంలో కొనసాగాలని ఆయన కోరుకున్నారు. కానీ బాల్యంలోనే ములాయం చదువుకుంటానని మారాం చేసి విద్యాభ్యాసం చేశారు. సమీపంలో ఉన్న పట్టణంలో డిగ్రీ పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తి చేయాలనే మమకారంతో బీఈడీ చేశారు. కొంతకాలం టీచర్గా పనిచేసి పాఠాలు కూడా బోధించారు. విద్యార్థిగా ఉంటూనే కుస్తీ పోటీల్లో పాల్గొని మల్లయోధుడుగా గుర్తింపు పొందారు. అంతేకాదు ఆయన పోటీకి దిగాడంటే విజేతగా నిలవాల్సిందే.
1953లో సాగునీటిపై పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేపట్టిన ఆందోళనలో ములాయం పాల్గొని నెల రోజులు జైలు జీవితం గడిపారు. అప్పుడు ఆయన వయసు కేవలం 14 ఏండ్లు మాత్రమే. అలా రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ములాయం సింగ్ యాదవ్ ఇప్పటి వరకు 10 అసెంబ్లీ ఎన్నికల్లో, 7 లోక్ సభ ఎన్నికల్లో, ఒకసారి మండలి ఎన్నికల్లో మొత్తం 18 సార్లు పోటీ చేసి 16 సార్లు గెలిచారు. తొలిసారి 1967లో 27 ఏండ్ల వయసులో తన స్వంత నియోజకవర్గం జశ్వంత్పూర్ అసెంబ్లీకి పోటీచేశారు ములాయం. తన రాజకీయ గురువు, మార్గదర్శి రామ్ మనోహర్ లోహియా ప్రోత్సాహంతో సంయుక్త సోషలిస్టు పార్టీ టికెట్పై పోటీ చేసి గెలిచాడు.
అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారిలో ములాయమే అతి చిన్న వయస్కుడు. అదే స్థానం నుంచి రెండు సార్లు 1969,1980 లలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత ఏడు సార్లు లోక్సభకు పోటీచేసిన ఆయన ఏనాడూ ఓడిపోలేదు. ప్రస్తుతం ఆయన తన స్వగ్రామం ఉన్న మైనాపురి లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. సోషలిస్టు సిద్ధాంతం, అది నేర్పిన పోరాట పటిమ ములాయంను ఎప్పుడూ దేనికీ జంకని వ్యక్తిగా తీర్చిదిద్దాయని ఆయన సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ ఒక సందర్భంలో అన్న మాట అక్షరాల నిజం. అలాగే దంగల్ (కుస్తీ) పోటీల్లో ఎప్పుడూ ప్రత్యర్థిని చిత్తుచేసే అలవాటు కూడా రాజకీయాల్లో ఆయనను ప్రభావితం చేసింది.
ఆరు దశాబ్దాల ములాయం రాజకీయం జీవితం ఏడు రాజకీయ పార్టీలలో కొనసాగింది. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కడా మతతత్వ పార్టీ బీజేపీ వైపు గానీ, ఎక్కువకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్ వైపు గానీ అడుగులు వేయలేదు. 1967లో ఆయన గురువు లోహియా మరణంతో సోషలిస్టు పార్టీ అనేక చీలికలుగా విడిపోయింది. ములాయంకు రాజకీయ నిర్దేశకత్వం కొరవడింది. ఈ దశలో ఆయన రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తర్వాత దేశ ప్రధానిగా పనిచేసిన చరణ్ సింగ్ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నారు. చరణ్సింగ్ పార్టీ భారతీయ లోక్దళ్తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి1977లో ఇందిరా గాంధీని ఓడించడానికి జనతాపార్టీగా ఏకమయ్యాయి. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జాతీయంగానే కాకుండా ఉత్తరప్రదేశ్లో కూడా రామ్ నరేష్ యాదవ్ నాయకత్వంలో జనతా పార్టీ విజయం సాధించింది.
రామ్ నరేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో మొదటిసారి సహకార శాఖా మంత్రిగా ములాయం పదవి చేపట్టారు. ఇందిర 1980లో మళ్ళీ ప్రధానై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ములాయం ఓడిపోయారు. ఇది ఆయనకు రెండో ఓటమి. తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో చరణ్సింగ్ ప్రోత్సాహంతో ఆయన పోటీ చేసి ఎన్నికై మండలిలో లోక్దళ్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఎంపికై అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు.1985లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ఈసారి 425 స్థానాలున్న అసెంబ్లీలో లోక్దళ్ 86 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీలో లోక్దళ్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రతిపక్ష నేతగా ములా యం ఎన్నికై ఆ అసెంబ్లీ కాలమంతా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నాయకుడుగా గుర్తింపు పొందారు.
బోఫోర్స్ ఉదంతంతో 1989లో ప్రధాని రాజీవ్ను ఓడించడానికి నాలుగు పార్టీల కలయికతో ఏర్పడిన జనతాదళ్లో ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్దళ్ కూడా విలీనమయ్యింది. లోక్సభ, అసెంబ్లీకి ఏక కాలంలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ అటు కేంద్రంలో ఇటు యూపీలోనూ విజయం సాధించింది. ములాయం ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడడానికి అవసరమైన మెజారిటీ లేదు. కమ్యూనిస్టుల మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ 24 కోట్ల జనాభా కలిగి దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్కు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు.
జనతాదళ్ ప్రభుత్వం మండల్, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళన అనంతర పరిణామాల మధ్య బీజేపీ తన ఎంపీల మద్దతు ఉపసంహరించుకోవటంతో అటు కేంద్రంలో ఇటు యూపీలో ప్రభుత్వాలు పడిపోయాయి. తర్వాత 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ములాయం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో ములాయం మొదటిసారి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ఫ్రంట్ ప్రభుత్వంలో ఆయన కీలకమైన రక్షణ శాఖ మంత్రి పదవి దక్కించుకోవటం విశేషం. అది మొదలు గత 2019 వరకూ జరిగిన అన్ని లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి వరుసగా విజ యం సాధించడం గొప్ప విశేషం. 2003లో మూడోసారి ములాయం యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.
బహుశా దేశంలో ఇప్పటి రాజకీయ నాయకులందరిలో ప్రధానమంత్రిగా ఎవరు సమర్థులు అని చూస్తే ములాయమే కనబడుతారు. కోట్ల మంది అభిమానానికి తోడు సుదీర్ఘ క్రియాశీల రాజకీయ అనుభవం ఆయన సొంతం. మెజారిటీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాన్ని వ్యవహరశైలిగా మార్చుకునే స్వభావం, అటు సామాజిక జీవితానుభవం, ఇటు రాజకీయ రంగ అనుభవం, మొత్తంగా ఆయన నేపథ్యం ప్రధానమంత్రి పదవికి సరిగ్గా సరిపోతుంది.
ఆయనకు ఒక సందర్భంలో ప్రధాని అయ్యే అవకాశం సంపూర్ణంగా ఏర్పడింది. కానీ కొంతమంది వెన్నుపోటు రాజకీయాల వల్ల ఖరారైన ములాయం పేరు స్థానంలో ఐ.కె.గుజ్రాల్ పేరు వచ్చి చేరింది. 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవగౌడ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఇది జరిగింది. అప్పుడు లోపల, బయట జరిగిన పరిణామాలను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక మాజీ సంపాదకుడు శేఖర్ గుప్తా 2012 సెప్టెంబర్ నెలలో వివరంగా రాశారు. అప్పటి సీపీఎం కేంద్ర కమిటీ కార్యదర్శి హరికిషన్ సూర్జిత్ సింగ్ను ఎన్డీటీవీ ఇంగ్లీషు ఛానల్ తరపున వాక్ అండ్ టాక్లో ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఈ వివరాలు తనకు తెలిసాయని గుప్తా రాశారు. ములాయం, లోహియా సోషలిస్టు సిద్దాంతవాది అయినా కమ్యూనిస్టు నాయకుడు సూర్జిత్ తో కూడా సన్నిహితంగా ఉండేవారని, అలాగే అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ములా యం సింగ్దని, ములాయంను ప్రధాని చేయడానికి తాను ప్రయత్నించిన సంగతులు, అలాగే ఆయనకు అన్ని వర్గాల నుంచి ఉన్న మద్దతుతో ములాయం పేరు ఖరారైన తర్వాత కొంతమంది కారణంగా ఆయన ప్రధాని కాలేకపోయారు అని సూర్జిత్ తనతో చెప్పారని శేఖర్ గుప్తా రాశారు.
ములాయం సింగ్ యాదవ్ ఇప్పటి వరకు 10 అసెంబ్లీ ఎన్నికల్లో, 7 లోక్ సభ ఎన్నికల్లో, ఒక మండలి ఎన్నికల్లో మొత్తం 18 సార్లు పోటీ చేసి 16 సార్లు గెలిచారు. తొలిసారి 1967లో 27 ఏండ్ల వయసులో తన స్వంత నియోజకవర్గం జశ్వంత్పూర్ అసెంబ్లీకి పోటీచేశారు
ఆలేటి రమేష్: 99487 98982