మహబూబ్ నగర్ : జిల్లా జైలు నుంచి పారిపోయిన నిందితుడు కిషోర్రెడ్డి ఆత్మహత్యా యత్నానికి ( Suicide Attempt ) పాల్పడ్డాడు. జైలు నుంచి నేరుగా స్వగ్రామమైన వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామ శివారులోని పొలం వద్ద పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న కొడుకును గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని అంబులెన్స్ లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు.
నిందితున్ని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. సోమవారం ఉదయం టవాళ్ల సహాయంతో జైలు గోడల నుంచి దూకి పారిపోవడంతో పోలీసులు గాలింపు నిర్వహించారు. నిందితుడు చిక్కడంతో జిల్లా జైలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.