ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి రామతీర్థ పారమార్థిక జీవనంలోనే కాదు ప్రాపంచిక జీవితంలోనూ ఆదర్శనీయులు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో రామతీర్థ బాల్యమంతా కల్లోల కడలిలో నావలాగే సాగిపోయింది. ఈ క్రమంలో ఆయన డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రామతీర్థకు పాలంటే చాలా ప్రీతి! కానీ, రోజూ పాలు కొనే శక్తి ఆయనకు లేదు. అయితే, రామతీర్థపై ప్రేమతో స్థానిక దుకాణదారుడు డబ్బులు తీసుకోకుండానే రోజూ అతనికి పాలు పోస్తుండేవాడు. రామతీర్థ అడపాదడపా ఎంతో కొంత డబ్బు చెల్లిస్తూ ఉండేవాడు. ఒకనెల ఇంటి నుంచి డబ్బులు రాకపోవడంతో పాల బాకీ భారీగా పెరిగిపోయింది. అయినా దుకాణదారుడు పాలు పోయడం మానలేదు. ఇంతలో రామతీర్థ డిగ్రీ పూర్తయింది. ఆయన ప్రతిభను గుర్తించి ఓ కళాశాల యాజమాన్యం అధ్యాపకుడిగా ఉద్యోగం ఇచ్చింది.
ఆ నెల నుంచి జీతం రాగానే రామతీర్థ తనకు పాలు పోసిన దుకాణాదారుడికి నెలకు కొంత డబ్బు మనియార్డర్ చేస్తూ వచ్చాడు. బాకీ తీరిపోయాక కూడా మనియార్డర్ పంపడం ఆపలేదు. ఆరు నెలలు గడిచిపోయాయి. దుకాణదారుడు బాకీ తీరిందని రామతీర్థకు చెబుదాం అనుకున్నా వీలుపడలేదు. అనుకోకుండా ఒకరోజు సమీప పట్టణంలో ఆ దుకాణ దారుడికి రామతీర్థ ఎదురుపడ్డాడు. ‘అయ్యా! మీరు బాకీపడిన అప్పు ఎప్పుడో తీరిపోయింది. అయినా నెలనెలా డబ్బు పంపుతూనే ఉన్నారు. దయచేసి ఇక పంపకండి’ అన్నాడు.
అప్పుడు రామతీర్థ నవ్వుతూ ‘సోదరా! నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నేను చదువుకునేప్పుడు మీరు నాకు చేసిన సాయం నేనెన్నటికీ మరువలేను. దాన్ని డబ్బుతో కొలవలేను. మీ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేను. పొందిన సాయాన్ని మరచిపోయేవాడు రాక్షసుడితో సమానం. చేసిన సాయానికి లెక్కలు కట్టి బాకీ తీర్చేసి, ఆ తర్వాత స్మరించుకోని వాడు సామాన్యుడు. కానీ, అందుకున్న సాయానికి లెక్కలు కట్టకుండా, ఆజన్మాంతమూ మరచిపోకుండా ఏదోవిధంగా రుణం తీర్చుకుంటూనే ఉండేవాడు మహితాత్ముడు’ అంటూ రెండు చేతులెత్తి దుకాణదారుడికి నమస్కరించాడు. రామతీర్థే కాలక్రమంలో వివేకానందస్వామిని కలుసుకున్నాడు. ఆయన స్ఫూర్తితో పారమార్థిక జీవనం వైపు అడుగులు వేశాడు. తదనంతర కాలంలో ప్రపంచ సర్వమత సభల్లో రామతీర్థ కూడా ప్రసంగించి భారతీయ ఆధ్యాత్మికశక్తిని లోకానికి చాటిచెప్పాడు.