సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ చేరాలని భారత రాజ్యాంగం పేర్కొంది. సమాజ వనరులను సమిష్టి ప్రయోజనాల కోసం వాడుకోవాలని చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రూపొందించే విధివిధానాలు, పాలనా అంశాలు.. రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి.కానీ, గత ఎనిమిదేండ్లుగా నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ స్ఫూర్తికి భిన్నంగా పనిచేస్తున్నది. సామాజిక ఆర్థిక ప్రగతి దిశను విచ్ఛిన్నం చేస్తున్నది. భారతీయ సమాజ మనోవికాసాన్ని స్తంభింపజేసే ప్రక్రియపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నది.
స్వతంత్ర భారత పాలకులు దేశ ఆర్థికాభివృద్ధిలో, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలలో బ్యాంకుల పాత్రను గుర్తించి వాటిని జాతీయం చేశారు. ప్రైవేట్ వ్యాపారులకు, కులీనవర్గాలకు పరిమితమైన బ్యాంకు సేవలను జనసామాన్యానికి అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ప్రజల పొదుపు మొత్తాలకు రక్షణ, రుణసౌకర్యం లభించింది. 1956లో ఇంపీరియల్ బ్యాంకును ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా మార్చి జాతీయం చేశారు. 1969లో 14 బ్యాంకులను, 1980లో మరో 8 బ్యాంకులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు జాతీయం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చాయి. ఈ బ్యాంకులను సామాజిక, ఆర్థిక గతిశీల స్వయంప్రతిపత్తితో ప్రభుత్వం తరఫున ప్రజలకు బాధ్యత వహించే సంస్థలుగా తీర్చిదిద్దారు. రైతులకు, కుటీర, చిన్న. మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు తక్కువ వడ్డీలతో రుణాలను మంజూరు చేస్తూ సహాయకారిగా బ్యాంకులు నిలుస్తున్నాయి. ఓ మేరకైనా గ్రామీణ పేదరికం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మోదీ హయాంలో తెరిచిన 43 కోట్ల జనధన్ అకౌంట్లు ప్రభుత్వరంగ బ్యాంకులు లేకపోతే సాధ్యమయ్యేవే కాదు.
జాతీయ ఉద్యమంలో, దేశ నవ నిర్మాణంలో కనీస పాత్ర లేని రాజకీయ నేపథ్యం నుంచి అధికారంలోకి వచ్చిన మోదీ.. ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడానికి గత ఎనిమిదేండ్ల నుంచి ఎడతెగని ప్రయత్నాలను చేస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అనేకసార్లు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడానికి లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతామని చెప్పుకొస్తున్నారు. 2014-2018 కాలంలో ఆర్థిక మందగమనం నుంచి దృష్టి మరల్చడానికి బ్యాంకుల విలీన ప్రక్రియను ముందుకు తెస్తున్నారు. బలవంతమైన విలీనాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం కాలేదు, అనేక బ్యాంకు శాఖలు మూసివేయడానికి ఇది కారణమైంది. నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరగడం ఆగలేదు.
గత కొన్నేండ్లుగా ప్రపంచ బ్యాంకింగ్ కార్యకలాపాలు సానుకూల ధోరణిలో కొనసాగుతున్నాయి. కానీ భారతదేశంలో 50 శాతం బ్యాంకులు నష్టాలను చవిచూస్తున్నాయి. పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులు, కుంభకోణాలు, నిర్వహణ లోపాలు, రాజకీయ జోక్యం వల్ల ప్రపంచంలోనే నష్టాల జాబితాలో ఉన్న బ్యాంకుల్లో 48 శాతం మనవే ఉన్నాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థికమాంద్యం లో భారతీయులు తమ సొమ్మును ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. భారత్ నిలబడటానికి ప్రభుత్వ బ్యాంకుల పనితీరు ప్రధానశక్తిగా పనిచేసింది.
అటువంటి ప్రభుత్వ బ్యాంకులు మోదీ పాలనలో 2018 వరకూ క్రమంగా క్షీణించాయి. ఇప్పుడు ఏకంగా రుణాత్మక దిశలో పయనిస్తున్నాయి. లాభాలు తగ్గుతున్నాయనే నెపంతో కార్పొరేట్లలో పన్ను ఎగవేతదారుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల నిరర్ధక ఆస్తుల విలువ 16 ట్రిలియన్ కోట్లుగా నమోదైంది. 2014లో నిరర్ధక ఆస్తుల విలువ ఐదు ట్రిలియన్ కోట్లు మాత్రమే. కార్పొరేట్ పెట్టుబడిదారుల నుంచి లోన్లు కట్టించుకోవడం, నిరర్ధక ఆస్తుల విలువ తగ్గించడం వంటి పనులను కేంద్రం చేయాలి. కానీ మోదీ అధికారంలోకి రావడంతోనే రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ‘రైట్ ఆఫ్’ చేయించారు. 2021లో 2.36 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను ‘రైట్ ఆఫ్’ చేయించారు. దీంతో స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా 34,402 కోట్లు, యూనియన్ బ్యాంక్ బ్యాంక్ 16,983 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 15,877 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 14,782 కోట్లు ఎన్పీఏల రూపంలో నష్టపోయాయి.
భారతీయ బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణాలు మోదీ హయాంలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టిన బడా పెట్టుబడుదారులపై, కుంభకోణాల కారకులపై ఎలాంటి చర్యలను మోదీ ప్ర భుత్వం ఉద్దేశపూర్వకంగా చేపట్టలేదు. పైగా ‘బెయిల్ ఔట్’ల పేరుతో నష్టాలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు ప్రజల సంపదను ఇచ్చి వాటిని రక్షిస్తున్నది. ఎయిర్ ఇండియా సంస్థను టాటా కొనడానికి కూడా ప్రభుత్వమే బ్యాంకుల నుంచి రుణాన్ని మంజూరు చేసింది. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను అతిచౌకగా పెట్టుబడిదారులకు అమ్ముతున్నది. రోజురోజుకు ప్రభుత్వ బ్యాంకుల మార్కెట్ వాటా తగ్గుతున్నది. స్టాక్ ఎక్సేంజ్లో ప్రభుత్వ బ్యాంకుల షేర్ విలువ ప్రైవేట్ బ్యాంకుల కంటే అతి తక్కువగా ఉన్నది.
ప్రజాపక్షం వహించే ఆర్థికవేత్తల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకులను సవ్యంగా నిర్వహిస్తే ఏటా రూ.9 లక్షల కోట్ల లాభాలను ఇస్తాయి. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సేకరించడానికి నిర్ణయించుకున్న డబ్బుల కంటే ఇది 8 రెట్లు ఎక్కువ. ప్రజల ప్రగతికి సహకరించే కీలక రంగాలను ప్రభుత్వమే నిర్వహించడానికి, ప్రైవేటుపరం చేసిన ప్రభుత్వ సంస్థలను తిరిగి జాతీయం చేయడానికి ఒక మహోద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. అమృతభారత్ మహోత్సవాల సందర్భంగా జాతీయోద్యమ నాయకుల ఆకాంక్షలను తిరిగి నిలబెట్టడానికి, వాటిని పాలకుల చేత అమలుచేయించడానికి కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి ప్రజాస్వామికశక్తుల ఐక్య పోరాటమే మనముందున్న మార్గం.
జాతీయ సంపద, వనరులు, పరిశ్రమలపై అంబానీ, అదానీలకు గుత్తాధిపత్యం కల్పించే విధంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇతర పెట్టుబడిదారులు, ధనికవర్గం భారత పౌరసత్వాన్ని వదులుకొని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, ఇటలీ దేశాలకు వెళ్తున్నారు. ఈ చర్యలు దేశంలోని మెజారిటీ ప్రజల సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
– అస్నాల శ్రీనివాస్ 96522 75560
(వ్యాసకర్త: ఉపాధ్యక్షులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం)