ప్రతిరోజు పాఠశాలలకు పిల్లలు వస్తున్నారా? లేదా? తరగతి గదిలో పిల్లలు ఉంటున్నారా? లేదా? అనే విషయం తెలియాలంటే అటెండెన్స్ తీసుకోవటం తప్పనిసరి. అయితే ఒకప్పుడు ఉపాధ్యాయులు పిల్లల పేర్లు లేదా వారి రోల్నెంబర్ ఆధారంగా అటెండెన్స్ తీసుకునేవారు. దీనికోసం హాజరు పట్టిక (రిజిస్టర్లు)లు ఉపయోగించేవారు. దీనికి చాలా సమయం వృథా అయ్యేది. ఆ తర్వాత పిల్లలకూ బయోమెట్రిక్ విధానం తీసుకువచ్చారు. ఈ బయోమెట్రిక్లో అటెండెన్స్ వేసుకోవడం కూడా సమయంతో కూడుకున్నదే. ఈ వృథా కాలాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తాజాగా ఫేస్ రికగ్నేషన్ సిస్టం యాప్ను తీసుకొచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి కి చేర్చే క్రమంలో ప్రభుత్వం అనేక ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నది. అందులో భాగంగా బయోమెట్రిక్ విధానాన్ని కూడా మార్చ నున్నది. ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, రాగిజావను అందించేవారు. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగానే వంట ఏజెన్సీ వాళ్లకు మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించేవారు. విద్యార్థుల హాజరుశాతం తెలుసుకునేందుకు బయోమెట్రిక్ అమలు చేసినా అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ సిస్టంయాప్ను తీసుకొచ్చింది. పాఠశాలకు హాజరైన విద్యార్థి లెక్క ఇకనుంచి పక్కాగా ఉండడానికి ఉపాధ్యాయుడు సెల్ఫోన్లో గాని, ట్యాబ్ లో గాని ఒక క్లిక్ చేస్తే చాలు పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆన్లైన్లో డిస్ప్లే అయ్యే విధంగా ఈ యాప్ను రూపొందించింది. ప్రభు త్వం పాఠశాల విద్యార్థులకు అందించే ప్రతి సంక్షే మ సౌకర్యాలకు ఈ ఆన్లైన్ వివరాలే ఆధారం కానున్నాయి.
కొన్నిచోట్ల పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపిస్తూ మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతుండడాన్ని అధికారులు గుర్తించారు. దీన్ని నివారించడం కోసమే ఈ ఫేస్ రికగ్నేషన్ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చారు. రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజన చెల్లింపులను మరింత సులభతరం చేసి పేపర్ లెస్ విధానాన్ని అమలు చేయడానికి ఈ యాప్ ఉపయోగపడనున్నది.
ఈ యాప్తో విద్యార్థులను తరగతి వారిగా ఒకేసారి అందరూ విద్యార్థులు వచ్చేలా పోటో తీయడంతో ఆన్లైన్లో హాజరు నమోదవుతుంది. ప్రస్తు తం ఈ యాప్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కోసం డీఈవో కార్యాలయం ద్వారా వచ్చిన లింకుపై క్లిక్ చేసి లేదా ప్లే స్టోర్ నుంచి డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను పాఠశాల హెచ్ఎం తన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి. యూజర్ ఐడీ వద్ద స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ వద్ద స్కూల్ ఎట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ లేదా వారికి నచ్చిన నంబర్ను ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ అటెండెన్స్, డీటెయిల్స్ రిపోర్ట్ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేస్తే సదరు స్కూల్లో ఉన్న విద్యార్థుల మొత్తం సంఖ్య బ్లూ కలర్లో కనిపిస్తుంది. తరగతి టోటల్ విద్యార్థుల సం ఖ్యపై క్లిక్ చేయాలి. ఆ తరగతిలోని విద్యార్థుల ఐడీ లు కనిపిస్తాయి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆ విద్యార్థి పేరుపై క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ విద్యార్థి ఫేసును మొబైల్ కెమెరా సర్కిల్లో ఉంచి, స్టూడెంట్ ఫేస్పై గ్రీన్ సర్కిల్ లోపల క్లిక్ చేసి సబ్మీట్ చేయాలి. ఆ తరువాత పింక్ బటన్ పై క్లిక్ చేయాలి. దీంతో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. స్టూడెంట్ లిస్టు స్క్రీన్లో గ్రీన్ టిక్ మార్క్ చేయబడి ఉంటుంది. ఇలా తరగతిల వారీగా అందరు విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేయాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ పై క్లిక్ చేయాలి. మొబైల్ కెమెరాను అడ్డంగా ఉంచి తరగతిలోని అందరు విద్యార్థులు కనిపించేలా చూసి కెమెరా బటన్ పై క్లిక్ చేయాలి. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య హాజరు ఆన్లైన్లో నమోదవుతుంది. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయి ఉండి, యాప్లో కెమెరా ఓపెన్ చేసినప్పుడు అందుబాటులో ఉన్న విద్యార్థులను మాత్రమే ఆరోజు పాఠశాలకు వచ్చినట్టు యాప్ ద్వారా ఆన్లైన్లో హాజరు నమోదు చేస్తుంది.
ఈ ఆన్లైన్ ప్రక్రియలో జిల్లాలో గవర్నమెంట్ లోకల్ బాడీ మేనేజ్మెంట్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వారి సెల్ ఫోన్లలోను ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారికి ప్రభుత్వం ద్వారా మంజూరైన ట్యాబుల్లో లేదా మొబైల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే ప్రధానోపాధ్యాయుడు క్షేత్రస్థాయిలో సీఆర్పీల ద్వారా సమస్యను ఎంఆర్సీలోని మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్ దృష్టికి తీసుకువెళ్లాలి అక్కడ పరిష్కారం కాకపోతే ఎంఐఎస్ ద్వారా డీఈవో కార్యాలయంలోని ఏఎస్ఓ సరిచేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు పక్కాగా తెలవడానికి ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ తోడ్పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోఅమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిద్వారా ఇటీవల ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ మొదలుకొని మధ్యాహ్న భోజనం, పిల్లలకు కల్పిస్తున్న వసతులు మొదలైనవన్నీ తెలుస్తాయి. దీనివల్ల విద్యార్థుల సంఖ్య ఖచ్చితంగా తెలి యడం తో పాటు హాజరుశాతం కూడా పెరుగుతుంది.