మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు నుంచి కాదు, అన్నివైపులా. అసలు మీడియా ఉనికే ప్రమాదంలో పడుతున్నది. మీడియాను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అసలు మీడియా ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నాయి.
తెలుగులో తొలి తరం పత్రికలు 121 ఏండ్ల కిందట పుట్టిన కృష్ణా పత్రిక (1902), ఆంధ్ర పత్రిక (1908) నుంచి ఇప్పటి వరకు మీడియా సాంకేతికంగా ఎంతటి ముందడుగు వేసినా ఉనికికి సంబంధించి ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం గతంలో ఎప్పుడూ లేదు. ఎమర్జెన్సీని మీడియాకు చాలా గడ్డుకాలం అనేవారు. అయితే నాటి గడ్డుకాలంలోనూ మీడియా మూతపడలేదు. విశ్వసనీయత, ఉనికికి సంబంధించి ఇప్పుడున్నంతటి గడ్డు పరిస్థితులను నాడు ఎదుర్కోలేదు. పైగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాయని మీడియాపై ఆ రోజుల్లో గౌరవం పెరిగింది. ఎమర్జెన్సీ కాలంలో సంపాదకీయం స్థానంలో ఏమీ ప్రచురించకుండా ఖాళీ స్థలాన్ని వదిలేయడం ద్వారా కూడా పత్రికలు నిరసన వ్యక్తం చేశాయి. మరి ఇప్పుడు నచ్చకపోతే పారిశ్రామికవేత్తల ద్వారా ఆ మీడియానే కొనేస్తున్నారు. దేశంలో నంబర్వన్ స్థానంలో నిలిచిన ఎన్డీటీవీ ఇలానే అదానీ హస్తగతమైంది. ఇప్పుడు ఒకవైపు కనిపించని ఎమర్జెన్సీ, మరోవైపు యూట్యూబ్ ఛానల్స్ పేరుతో సాగుతున్న అరాచకం. నిర్వహణ వ్యయం పెరగడం, ఆదాయం తగ్గడం.. వీటన్నిటితో మీడియా కొట్టుమిట్టాడుతున్నది. ప్రింట్ అయిన కరపత్రానికి కూడా ఒకప్పుడు ఓ విలువ ఉండేది. మరిప్పుడు వీధి రౌడీ కత్తి పట్టుకొని వీధిలో అందరినీ భయపెట్టినట్టు.. ఒక్క సెల్ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి జనం మీద పడిపోవచ్చు.
మీడియా-రాజకీయపక్షాల అనుబంధం కొత్తదేమీ కాదు. అసలు మీడియా పుట్టిందే రాజకీయపక్షాలకు అనుబంధంగా. బ్రిటిష్ పాలనాకాలంలో దేశంలో మీడియా ప్రారంభమైంది. స్వాతంత్య్ర పోరాటం, మీడియా కలిసే సాగాయి. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, తెలుగునాట ప్రకాశం పంతులు, ఒక వైపు స్వతంత్ర సమర యోధులుగా, కాంగ్రెస్ నాయకులుగా బ్రిటీష్ వారిపై పోరాడుతూనే మరోవైపు ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి పత్రికలు నడిపారు. కాంగ్రెస్ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులందరూ తమ పోరాట ప్రచారం కోసం పత్రికలు ప్రారంభించారు. తెలంగాణలో గోలకొండ పత్రిక వంటివి హైదరాబాద్ రాజ్యంలో పని చేస్తూ, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాయి. కాంగ్రెస్కు అనుబంధంగానే దేశంలో మీడియా అనేది ప్రారంభమైనా, నాటి మీడియాపై ఒక పార్టీకి అనుకూలం అనే విమర్శ రాలేదు. ఎందుకంటే దేశంలో ప్రజలందరి లక్ష్యం స్వాతంత్య్రమే కాబట్టి మీడియాకు పార్టీ అనుబంధం అనే అంశం పెద్దగా విమర్శల పాలు కాలేదు. ఎక్కువ పత్రికలు కాంగ్రెస్కు అనుబంధంగా ఉంటే కమ్యూనిస్టులకు కూడా పత్రికలు నాటి నుంచి నేటి వరకూ ఉన్నాయి.
1980 వరకు తెలుగునాట బహుళ పత్రికల ప్రాబల్యం ఉండేది. చిన్న పత్రికలు తమ తమ ప్రాంతాల్లో స్థానికంగా ప్రభావం చూపేవి. టీడీపీ ఆవిర్భావం, టీడీపీకి ఒక వర్గం మీడియా మద్దతుతో క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక టీడీపీకి అండగా నిలిచింది. మొత్తం తెలుగు పాఠకుల్లో ఒక దశలో 90 శాతం మంది అత్యధిక సర్క్యులేషన్ పత్రిక వెంటే ఉండేవారు. దాదాపు 1995 వరకు మెజారిటీ మీడియా టీడీపీ వైపే అన్నట్లుగా ఉండేది. మధ్యలో దాసరి నారాయణరావు పత్రిక తుఫాన్లా వచ్చినా, ఎక్కువ రోజులు నిలబడలేదు.
చివరికి ఇప్పుడు ప్రతి రాజకీయపక్షానికి ఒక మీడియా ఉన్నది. ప్రత్యక్షంగా పార్టీకి అనుబంధంగా కావచ్చు, పరోక్షంగా ఔట్సోర్సింగ్ మద్దతుగా కావచ్చు. రెండు రాష్ర్టాల్లో అన్ని పార్టీలకు సొంత మీడియా ఉన్నది. చివరికి హైదరాబాద్ ఓల్డ్సిటీకే పరిమితమైన ఎంఐఎంకు సైతం సొంత మీడియా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సాక్షి పత్రికను ప్రారంభించే సమయంలో అసెంబ్లీ లాబీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ను కొమ్మినేని శ్రీనివాస్.. ఒక రాజకీయ పార్టీ నేరుగా పత్రిక ప్రారంభించడమేమిటని విస్మయంతో అడిగారు. ‘నిష్పక్షపాతమైన మీడియా ఉంటే మంచిదే. కానీ అది కల. ఒకే పార్టీకి మీ డియా ఉండటం కన్నా, అన్ని పార్టీలకు మీడి యా మంచిదే’ అంటూ దగ్గుబాటి సమర్థించారు. తనకు జరిగిన వెన్నుపోటులో మీడియా పాత్ర ఉన్నదని ఎన్టీఆర్ ఒక దశలో కన్నీళ్లు పె ట్టుకున్నారు. మీడియా మొత్తం ఒకే పార్టీ వైపు ఉండటం అత్యంత ప్రమాదకరం. దీనికన్నా అన్ని పార్టీలకు మీడియా ఉండటం బెటర్.
2005 తర్వాత మీడియాలో చాలా మార్పులు వచ్చాయి. అన్ని పార్టీలకు సొంత మీడియా ఉండటంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా విజృంభణ మొదలైంది. 2005 తర్వాత వచ్చిన మీడియా బూమ్ అనేక అవకాశాలు కల్పించింది. కరోనా కాలం వరకు ఇది కొనసాగింది. ఇప్పుడు యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల బూమ్ కాలం. దీనిలో అంతా చెడే అని చెప్పలేం. మంచి, చెడు రెండూ ఉన్నాయి. చెడును తొలగించుకుంటే మీడియా బతుకుతుంది. లేదంటే ఈ చెడు మొత్తం మీడియానే మింగేస్తుంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పేరు కూడా తమ పత్రికలో రాకూడదని అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక యజమాని ఆంక్షలు విధించారు. దీంతో ఉండవల్లి ఏం మాట్లాడినా మెజారిటీ పాఠకులకు తెలియకుండా పోయింది. కానీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయారు. లక్షల మంది ఆయన ఉపన్యాసాలు విన్నారు.
పత్రికలో ఎక్కడో ఓ మూల పేరు వస్తే చాలు అనుకునే దశ నుంచి ఉపన్యాసం నేరుగా లక్షల మందికి పైసా ఖర్చులేకుండా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వెళ్తున్నది. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగం పోయినా రోడ్డున పడం, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతికేద్దాం అనే ధీమా జర్నలిస్టులకు వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్కు సంబంధించి ఇవి పాజిటివ్ అంశాలు. కానీ నెగిటివ్ అంశాలు మొత్తం మీడియా ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేట్టుగా ఉన్నాయి.
జర్నలిజంలోకి యూట్యూబ్ రౌడీయిజం ప్రవేశిస్తే ఏమీ చేయలేమా? యూనియన్లు ఏమీ చేయలేవా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడు నాలుగు పత్రికలు ఉన్న రోజుల్లోనే యూనియన్లు కొద్దిపాటి ప్రభావం చూపించాయి. మీడియా-రాజకీయపక్షాల అనుబంధం, మీడియా బూమ్ తర్వాత యూనియన్ల పాత్ర నామమాత్రం అయింది. జర్నలిజం పేరుతో వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్న వారిపై జర్నలిస్ట్ యూనియన్లు చేయగలిగిందేమీ లేదు. మీడియా పది కాలాల పాటు ఉండాలని కోరుకునే జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాలి. అబద్ధాలైనా సరే ప్రచారం చేయండని స్వయంగా హోంమంత్రి అన్నట్టు పత్రికల్లో వచ్చింది. బీజేపీ అధికారంలోకి రావడంలో సామాజిక మాధ్యమాల పాత్ర పెద్దది. వాటి నుంచి ఇప్పటికీ ఆ పార్టీ గణనీయంగా ప్రయోజనం పొందుతున్నది.
సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించే అధికారం కేంద్రానిది. అయితే, స్వయంగా ఆ మాధ్యమాల నుంచి ప్రయోజనం పొందుతున్న బీజేపీ నుంచి సంస్కరణలు ఆశించలేం. అత్యాచారానికి గురైన మహిళ పేరు, ఫొటో మీడియాలో ప్రదర్శించకూడదు. అలా చూపినందుకు ఓ ప్రముఖ ఛానల్పై ఓ మహిళా న్యాయవాది కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆ ఛానల్కు జరిమానా విధించింది. తన ఉద్దేశం ఛానల్కు శిక్ష పడాలని కాదు, ఇలా కేసు వేయడం వల్ల నిబంధనల గురించి జర్నలిస్టులకు తెలుస్తుందని ఆ మహిళా న్యాయవాది కేసు ఉద్దేశాన్ని వివరించారు. ఇదే తరహాలో.. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎవరినైనా ఎంత అసహ్యకరంగానైనా తిట్టవచ్చు, మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేయవచ్చునని భావిస్తున్న వారికి కేసుల ద్వారానే నిబంధనలు నేర్పడం అవసరం. లేకపోతే రౌడీయిజానికి, జర్నలిజానికి తేడాలేకుండా పోతుంది.
రాహుల్గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరస్థుల గురించి ప్రస్తావిస్తూ మోదీ అనే ఇంటి పేరున్న వారిపై చేసిన వ్యాఖ్యకు రెండేండ్ల జైలు శిక్ష విధించారు. ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యకే రెండేండ్ల శిక్ష విధిస్తే తమకు నచ్చని నాయకులు, వారి కుటుంబంపై విచ్చలవిడిగా, అసహ్యకరంగా యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్న వారికి చట్టం వర్తించదా?
– బుద్దా మురళి
98499 98087
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)