చల్లదనానికి, చక్కదనానికి మారుపేరైన పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో మంటలు రాజుకుంటున్నాయి. అనునిత్యం ముష్కర సైనిక నియంతృత్వం కింద మగ్గిన ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. సుదీర్ఘకాలం ఉక్కుపాదం కింద నలుగుతున్న పీవోకే ప్రజలు ‘ఇంకానా ఇకపై సాగదు’ అన్నట్టుగా.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని అక్కడి నుంచి వెలువడుతున్న వార్తలను బట్టి అవగతమవుతున్నది. పీవోకేలో అప్పుడప్పుడు అసమ్మతి భగ్గుమనడం, సైన్యం అణచివేయడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి జరుగుతున్న ఆందోళనలు తీవ్రస్థాయిలో ఉండటం గమనార్హం.
ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనోద్యమాలకు భిన్నంగా ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్నది అచ్చమైన ప్రజాందోళన కావడం విశేషం. వేలసంఖ్యలో వీధుల్లోకి వస్తున్న ప్రజలు అందుకు నిదర్శనం. ఇస్లామాబాద్ ఎప్పటిలాగే అణచివేత చర్యలకు పాల్పడుతున్నది. నాయకులను అరెస్టు చేయడం, ఆహారం, మందులు వంటి అత్యవసర సరఫరాలు అందకుండా చేయడం వంటివి అందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఉద్యమ నాయకులు బహిరంగంగా డిమాండ్ చేయడం కీలక పరిణామం.
పాకిస్థాన్ పాలకులు ఈ ప్రాంతానికి ‘ఆజాద్ కశ్మీర్’ అనే ముద్దుపేరు తగిలించినప్పటికీ అక్కడ ‘ఆజాదీ’ ఏమేరకు ఉన్నదో ప్రపంచానికి తెలుసు. పీవోకే పరిపాలనను ఇస్లామాబాద్లోని ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ద్వారా నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రే ఈ ప్రాంతానికి ‘రాజు’గా వ్యవహరిస్తారు. వాస్తవానికి, ఇక్కడ పరిమిత అధికారాలు కలిగిన ‘అధ్యక్షుడు’, ‘ప్రధాన మంత్రి’ వంటి పదవులు ఉన్నప్పటికీ, అంతిమంగా స్థానిక యంత్రాంగానికి ఎటువంటి నిర్ణయాధికారం ఉండదు.
నిరసనలకు మూలకారణమైన 38 డిమాండ్ల జాబితా ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ డిమాండ్లు ఏవీ కొత్తవి కావు. ఇవి చాలాకాలంగా ఉన్నవే. అయితే, 2023లో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ) ఏర్పడిన తర్వాత వీటిని అధికారికంగా ఒక జాబితా రూపంలో పొందుపరిచారు. తీవ్రమైన శాంతిభద్రతల విచ్ఛిన్నానికి, పరిపాలనా సంక్షోభానికి దారితీసిన ప్రస్తుత నిరసనలకు తక్షణ కారణంగా అనేక అంశాలు ఉన్నాయి.
ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ప్రాతినిధ్యానికి మార్గాలు లేకపోవడం, ప్రాదేశిక శాసనసభలో రిజర్వ్ సీట్లు కేటాయించాలని ఇస్లామాబాద్ పట్టుబట్టడం, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని శరణార్థులు, రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో పాక్ ప్రభుత్వం, సైన్యం తరచూ జోక్యం చేసుకోవడం వంటివి జేఏఏసీ సమర్పించిన 38 డిమాండ్ల పత్రంలోని కొన్ని అంశాలు. జేఏఏసీ రాజకీయ పార్టీ కాదు. సమస్యలతో విసిగిపోయిన సామాన్య ప్రజలు కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న ఆ ఉద్యమ సంస్థకు మద్దతిచ్చిన ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ సంస్థ భారత్ అనుకూల ప్రకటనలు చేస్తుండటం పాక్ పాలకులకు కంటగింపుగా మారింది.
నిరసనలు కొనసాగుతున్న కొద్దీ, అణచివేత కూడా పెరుగుతున్నది. ఇదంతా భారతదేశానికి కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది. మొదటిది, పాక్ ఆక్రమిత కశ్మీర్ను తన సొంత భూభాగంగా ఢిల్లీ భావిస్తున్నందున, కనీసం మానవతా దృక్పథంతోనైనా జోక్యం చేసుకొనే హక్కు దానికి ఉన్నది. అంటే సరిహద్దు వద్ద సాయుధ ప్రతిఘటనను ఎదుర్కొంటూ, సహాయ సామగ్రి కాన్వాయ్ని పంపడం. ఇందుకు గల సాధ్యాసాధ్యాలు తేల్చడం అంత సులభమైన విషయం కాదు.
రెండవది, ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకొనేలా ఒత్తిడి తీసుకురావడం. పాక్ ఆక్రమిత కశ్మీర్కు మద్దతుగా యూకే అంతటా, న్యూజిలాండ్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఇది జేఏసీసీ నాయకులను జైలులో పెట్టకుండా, కనీసం వారితో చర్చలు జరిపేలా ఇస్లామాబాద్పై ఒత్తిడి తీసుకురావడానికి ఒక అవకాశాన్ని కల్పించగలదు. ఏ రకంగా చూసినా సమస్య సున్నితమైనదే. భారత్ దౌత్యపరమైన శక్తిసామర్థ్యాలకు పీవోకే ఆందోళనలు ఓ సవాల్గా నిలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.