BRS | ఒకప్పటి తన హైదరాబాద్ స్టేట్ మూలాలను భారత రాష్ట్ర సమితిలో (బీఆర్ఎస్) చూసుకుంటూ మరాఠ్వాడ పాత బంధాలను పలకరిస్తున్నది. మరాఠ్వాడకు ఆయువుపైట్టెన ఔరంగాబాద్లో సోమవారం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి పల్లెలు, పట్టణాలు ఏకమై జగన్నాథ రథ చక్రాల్లా కదలివస్తున్నాయి. మరాఠ్వాడ గడ్డపై బీఆర్ఎస్ పద ఘట్టనలతో తమకు పునర్ వైభవం సిద్ధిస్తుందని ప్రజలు గంపెడాశ పెట్టున్నారు. ఇంతకాలంగా కరువు, కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు తప్ప తమ వైపు కన్నెత్తి చూసిన నాథుడేలేని దయనీయమైన తమ బతుకుల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వెలుగులు తీసుకవస్తారని కొండంత నమ్మకంతో ఉన్నారు.
ఔరంగాబాద్తో హైదరాబాద్కు విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ స్టేట్లో ఔరంగబాద్ పాత్ర అత్యంత కీలకమైంది. ప్రస్తుతం ఔరంగాబాద్ సాంకేతికంగా మహారాష్ట్రలో ఉన్నప్పటికీ హైదరాబాద్తో ఉన్న చారిత్రక అనుబంధం ఎప్పటికీ మాసిపోనిది.
టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా మారాక తెలుగు రాష్ర్టాలకు వెలుపల జరిగిన రెండు భారీ బహిరంగ సభలు (నాందేడ్, కందార్ లోహ) మహారాష్ట్ర గడ్డపైనే జరిగాయి. సోమవారం జరుగబోయే మూడవ సభ కూడా ఇదే గడ్డపై ఔరంగాబాద్లో జరుగబోతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ నిర్వహించిన రెండు భారీ బహిరంగ సభలు మహారాష్ట్ర రాజకీయాలలో పెనుప్రకంపనలు సృష్టించాయి. ఇక మూడవ సభ జరగకముందే దానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో మహారాష్ట్ర రాజకీయ పార్టీలు భయంతో వణికిపోతున్నాయి. ఇందుకు అక్కడి నేతల వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. ‘మహారాష్ట్ర గడ్డపై కేసీఆర్కు ఏం పని’ అని నాందేడ్ సభ తర్వాత ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ మహారాష్ట్రలోకి అడుగుపెట్టకుండా ఎలాగైనా నిలువరించే దిశగా ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం కుట్రలు, కుయుక్తులకు తెరతీసింది. అడుగడుగునా ఔరంగాబాద్ సభ కు ఆటంకాలు కల్పిస్తున్నది. మొదట సభకు అనుమతించి సభాస్థలికి పూజా, సన్నాహాలు జరుగుతున్న క్రమంలో వేదికను మరొక చోటికి మార్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభకు ప్రజలు భారీగా వెళ్లకూడదన్న కుట్రతో సభ జరిగే రోజున ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారులతో సమ్మేళనాల పేరిట దావత్లు ఇవ్వడం మొదటి సభ జరిగిన నాందేడ్తోనే మొదలు పెట్టింది.
ఇక మరాఠ్వాడలో బలంగా ఉన్నట్టు కనిపించే ఎన్సీపీ, దాని నాయకత్వం అధినేత బీజేపీతో చేతులు కలపడానికి ప్రయత్నించడం, బీఆర్ఎస్ ప్రభావం వల్లేనని అనిపిస్తున్నది. ఎన్సీపీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా మరాఠ్వాడలోని అన్ని పార్టీల స్థానిక నాయకులూ బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ రేపటి ప్రాభవానికి ఇది తొలి సంకేతం.
మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రం అచ్చంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తు తం శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ది (ఎన్సీపీ) పాలకపక్షమో, ప్రతిపక్షమో అర్థం కాని పరిస్థితి. ఏ క్షణంలోనైనా పాలకపక్షం బీజేపేతో కలిసినడవడానికి ఎన్సీపీ సిద్దంగా ఉంది. ఇక కాంగ్రెస్ది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితే. పాలక, ప్రతిపక్షానికి తేడా లేకుండా కలగలిసిన మహారాష్ట్రలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ శూన్యతను బీఆర్ఎస్ భర్తీ చేయగలదన్న ఆశలు ఇటీవల చిగురించాయి. అందుకే మహారాష్ట్రలో ప్రజలు బీఆర్ఎస్కు నీరాజనాలు పలుకుతున్నారు. రెండు సభలను విజయవంతం చేయడమే కాకుండా మండుటెండల్లో ఔరంగాబాద్ సభకు ఊళ్లకు ఊళ్లూ కదులుతున్నాయి.
బీఆర్ఎస్ మహారాష్ట్రలోని మరాఠ్వాడపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మరాఠ్వాడ ప్రాం తానికి తెలంగాణతో సాంస్కృతిక అనుబంధం ఉంది. హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్న మరాఠ్వాడలోని సరిహద్దు ప్రాంతాలు ఆ రా ష్ట్ర రాజధాని ముంబయి కంటే హైదరాబాద్కే దగ్గరగా ఉన్నాయి. తెలంగాణతో మరాఠ్వాడ ప్రజలకు కుటుంబ సంబంధాలు, బంధుత్వా ల రాకపోకలు ఉన్నాయి. శుభకార్యాల షాపింగ్లకైనా, హాస్పిటల్కైనా ముంబయి కంటే హైదరాబాద్కు రావడానికే ఇష్టపడుతారు.
మరాఠ్వాడతో చారిత్రక అనుబంధం కలిగి ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ విస్తరణకు తొలి విడతలో తన ఫోకస్ దీనిపైనే సారించింది. ఇప్పటి వరకు జరిగిన నాందేడ్, కందార్ లోహ రెండు సభలు, జరుగబోయే ఔరంగాబాద్ మూడవ సభ కూడా మరాఠ్వాడలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో 54 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో సగం మహారాష్ట్రలోనే జరుగుతున్నయి. ఇందులో సగం మరాఠ్వాడలోనే జరుగుతున్నవంటే ఇక్కడ రైతన్నల గోస ఎలా ఉందో చెప్పనవసరం లేదు. స్వయానా రైతుగా రైతుల వ్యథ తెలిసిన నాయకునిగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ను మరాఠ్వాడ ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు.
ఈ ప్రాంతంలో ఔరంగాబాద్, బీడ్, హింగోలి, జాల్నా, నాందేడ్, పర్భని, ధారశివ్ 8 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ వారు అధికంగా స్థిరపడిన మరాఠ్వాడలో మొదట తన స్తానాన్ని సుస్థిరం చేసుకున్నాకే ఇతర చోట్లకు విస్తరించాలని బీఆర్ఎస్ భావిస్తోన్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించాక క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునేందుకు మొట్ట మొదటిసారి పరిషత్ ఎన్నికలతోనే రంగంలోకి దిగింది. తొలి ఎన్నికలతోనే నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే మాదిరిగా మహారాష్ట్రలో కూడా మొట్ట మొదటగా బీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఎన్నికల రంగంలోనే అడుగుపెట్టబోతుంది. పార్టీ పునాదిని గ్రామస్థాయి నుంచే మహారాష్ట్రలో పదిలపరుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ మాడల్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మరాఠ్వాడ ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి వ్యవసాయ రంగమే. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం భారీ ఎత్తున చేపట్టిన సాగునీటి పథకాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు, అలాగే రైతు సంక్షేమానికి అమలు చేస్తోన్న రైతుబంధు, రైతు బీమా పథకాల పట్ల మరాఠ్వాడ ప్రజలు అమితంగా ఆకర్షితులు అవుతున్నారు. అలాగే కులవృత్తుల పునర్జీవానికి అమలు చేస్తోన్న పథకాలు, అభాగ్యులకు అండగా నిలిచే ఆసరా పథకాలు తమకు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ పథకాలు తమకు రావాలంటే ఇక్కడ మహారాష్ట్రలో బీఆర్ఎస్కు పట్టం కడితేనే సాధ్యపడుతుందని భావిస్తున్నారు. మరాఠ్వాడ ప్రజలదంతా ఒకటే భావన. ఒకే అభిప్రాయంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల తేడా లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చేరారు. సోమవారం ఔరంగాబాద్లో జరిగే బహిరంగ సభకు చీమలదండులా కదలివస్తున్నారు.
వెల్జాల చంద్రశేఖర్: 98499 98092