ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘మల్లన్నసాగర్’ ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ మార్వెల్గా కీర్తి గడించిన ‘కాళేశ్వరం’ ప్రాజెక్టులో మల్లన్నసాగర్ కీలకమైంది. మల్టీ పర్పస్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం మొత్తంలో మల్లన్నసాగర్ అతిపెద్ద జలాశయం. ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చి తెలంగాణపై తనకున్న మమకారాన్ని మరోసారి చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిపూర్ణమైంది.
50 టీఎంసీల నీటి నిల్వతో, మొత్తం 22.6 కిలోమీటర్ల పొడవు ఆనకట్ట కట్టడం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రత్యేకత. నిజానికి కొండలు, గుట్టల మధ్య ఆనకట్టలు కట్టి నీటిని నిల్వచేయడం పాత కట్టడాల విశిష్టత. కానీ మల్లన్నసాగర్ మొత్తం రాతి కట్టడంతో మానవ నిర్మితమైంది. 60 మీటర్ల ఎత్తు, 440 మీటర్ల వెడల్పుతో ఎత్తయిన ప్రదేశంలో కట్టిన ఆనకట్ట మల్లన్నసాగర్ మహాద్భుతమైనది. మెదక్ జిల్లా ఒకప్పుడు కరువు నేల. నీటి చుక్క కోసం విలవిల్లాడిన ప్రాంతం. అలాంటి జిల్లాకు గోదారమ్మను ఒడిసిపట్టి 575 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి నింపిందే మల్లన్నసాగర్. జలాశయం పూర్తి సామర్థ్యం (ఎఫ్ఆర్ఎల్) 557 మీటర్లు. 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ జల భాండాగారం తెలంగాణలోని పది జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్నది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలకు శాశ్వత నీటి పరిష్కారం లభించినట్టయింది. మొత్తం 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు జంట నగరాలకు 30 టీఎంసీల నీటి సరఫరా చేసే ప్రతిపాదనతో మల్లన్నసాగర్ నిర్మాణమైంది. పారిశ్రామిక అవసరాల కోసం మరో 16 టీఎంసీలను సైతం మల్లన్నసాగర్ తీర్చబోతున్నది. మల్లన్నసాగర్ నిండితే గ్రావిటీ ద్వారా కొండపోచమ్మకు, గంధమల్లకు, బస్వాపూర్, నిజాంసాగర్, సింగూరు, తపాస్పల్లి జలాశయాలకు నీరు వచ్చే వెసులుబాటున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 2016, మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ వద్ద భూమి పూజ చేశారు. 2019 జూన్ 21 మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును ఆరంభించారు. ఆ తర్వాత దశలవారీగా వివిధ ప్యాకేజీల్లో భాగంగా బ్యారేజీలు, కాలువలు అందుబాటులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో 200 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా నిలిచిందని ఇండియా వాటర్ మెన్గా గుర్తింపు పొందిన రాజేంద్రసింగ్ ‘ఐదేండ్ల కిందట నేను ఎండిన గోదావరిని చూశాను, ఇప్పుడు జలకళతో నిండిన గోదావరిని చూస్తుంటే కడుపు నిండుతున్నదని’ కితాబు ఇచ్చారు. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరుతో డిస్కవరీ ఛానెల్ తీసిన డాక్యుమెంటరీతో ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకొని నిలబడింది మన తెలంగాణ. రాష్ట్రంలో ఉన్న దిక్కుమాలిన ప్రతిపక్షాలు ఈ భారీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాయి. కానీ కేసీఆర్ జల సంకల్పం ముందు అవన్నీ దూదిపింజల్లా తేలిపోయాయి. తన ‘ఆకుపచ్చని తెలంగాణ’ కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు కేసీఆర్ చేసిన మేధోమథనమే ఈ జలదృశ్యం.
మల్లన్నసాగర్లో 14 గ్రామాలు ముంపునకు గురైన మాట వాస్తవం. దశాబ్దాలుగా పల్లె సీమలతో పెనవేసుకున్న బంధాన్ని తెంచుకోలేక తొక్కులాడిన ప్రాణాలను కాదనలేం. కానీ ఓ ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే ముంపు తప్పదు. త్యాగాలూ తప్పవు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ముంపు బాధితులకు సకల వసతులతో టౌన్ షిప్పులు నిర్మించి, కడుపునిండా ప్యాకేజీలు ఇచ్చి ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో యంగెస్ట్ స్టేట్ తెలంగాణ. తొలి అడుగులే తప్పటడుగులు కాకూడదని జాగ్రత్తగా అడుగులు వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు కొత్తగా పుట్టిన ఓ రాష్ట్రం, అందులోనూ ప్రపంచం మెచ్చిన ఓ మహా ప్రాజెక్టుపై తప్పుడు వాదనలకు దిగి తెలంగాణ పరువు తీశాయి. ఇప్పుడే మొహం పెట్టుకుని తెలంగాణ ప్రజల ముందు తిరుగుతాయి ? కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టుల్లో వందలాది కేసులు. కేంద్రానికి తప్పుడు నివేదికలతో రాతలు. అసలు తాము అడ్డుకుంటున్నది కేసీఆర్ను కాదు, తెలంగాణ అభివృద్ధిని అన్న సోయి ప్రతిపక్షాలకు ఎప్పుడు వస్తుందో..?
దశాబ్దాలుగా నీటి కోసం గోసవడ్డం, తెలంగాణ కోసం తెగించి కొట్లాడినం. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని అనుమతులు పొంది కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుంటే జాతీయ హోదాకు నిరాకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరిచి అడిగితే ‘దేశంలో ఎక్కడా ఇవ్వలేదు, మీ రాష్ర్టానికివ్వలేం’ అని చెప్పడం అన్యాయం కాదా? తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా వద్దా? జాతీయ హోదాకు కావాల్సిన అన్ని అర్హతలు కాళేశ్వరం ప్రాజెక్టుకు లేవా? ఉన్నా ఎందుకివ్వలేదు? పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది మోదీ సర్కారు. తెలంగాణ ఎంపీలు లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఒక్క రూపాయైనా తెచ్చారా ? బీజేపీ ఎంపీలు ఇప్పుడేం సమాధానం చెప్తారు? ఈ రాష్ర్టానికి పట్టిన శని ప్రతిపక్షాలు. వాటి పనితీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకొని రాష్ర్టాభివృద్ధి మీద దృష్టిపెడితే మంచిది.
దశాబ్దాలుగా నీటి కోసం గోసవడ్డం, తెలంగాణ కోసం తెగించి కొట్లాడినం. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని అనుమతులు పొంది కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుంటే జాతీయ హోదాకు నిరాకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)