గత కొన్ని నెలలుగా వివిధ దేశాల్లో అంతర్గతంగాను, దేశాల నడుమ ఏర్పడిన పరిణామాలు ప్రపంచాన్ని ఆర్థిక కల్లోలం ముంగిట నిలబెట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా, ఐరోపా ద్రవ్య వ్యవస్థల్లో ఏర్పడిన అలజడి, అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం, ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఆటుపోట్లు చూస్తుంటే ఇదంతా ఎటు దారితీస్తుందా అనే భయం కలుగుతున్నది. ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల మధ్య సైప్లె చైన్ను దెబ్బతీసింది. ముడి చమురుతోపాటు అనేక వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సంక్షోభం కొనసాగుతుండగానే, అమెరికాలో భారీ బ్యాంకులు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు పులిమీద పుట్రలా తరుముకొస్తున్న మాంద్యం.
ప్రపంచం డాలర్ చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, డాలర్ బలహీనపడుతుండడంతో పాటు, అమెరికాలో చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో 16వ అతి పెద్ద బ్యాంకు అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం, అనేక దేశాల్లోని స్టార్టప్లు, టెక్ కంపెనీలు, ఆంత్రప్రెన్యూర్స్కు ఫండింగ్ను తీవ్రంగా దెబ్బతీసింది. క్రిప్టో కరెన్సీకి అండగా నిలిచే సిగ్నేచర్ బ్యాంకు వైఫల్యం, ఆన్లైన్ కరెన్సీ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఇక తర్వాత వంతు, ప్రపంచంలోనే 8వ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకైన క్రెడిట్ స్విస్దని వాల్స్ట్రీట్ అనలిస్టు రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. 2008లో లేమాన్ బ్రదర్స్ పతనాన్ని ముందే ఊహించిన చెప్పిన ఘనత అతనిది. భారీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల పతనం అంటే ఉద్యోగ కల్పన రంగాలపై పిడుగుపాటే! దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తున్నది. అమెరికా కంపెనీలు గత రెండు నెలల్లో 1,80,000 ఉద్యోగాల్లో కోత పెట్టాయి. ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలపైనే ఎక్కువ ఆధారపడుతున్న దేశ యువతకు ఇది శరాఘాతం.
60 శాతానికి పైగా వ్యవసాయంపైనే ఆధారపడిన భారతీయ ఆర్థిక వ్యవస్థ కొన్నేండ్ల కిందటి వరకు, ప్రపంచ విపరిణామాల నుంచి, సురక్షితంగానే ఉండేది. అందువల్లే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన 1975, 1982, 1991 ఆర్థిక మాంద్యాలతో పాటు 2009లో ఏర్పడిన మహా మాంద్యం నుంచి కూడా తప్పించుకోగలిగింది. అయితే సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచి, క్యాపిటలిజంతో పొదుపునకు బదులు కన్జ్యూమరిజాన్ని పెంచి, నోట్ల రద్దుతో మధ్య తరగతిని స్టాక్మార్కెట్వైపు నడిపించిన తర్వాత, భారతదేశానికి స్వావలంబన రక్షణ బలహీనపడింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు. బంగారం అమ్ముకునే దుస్థితిలో చిక్కుకున్న దేశాన్ని పీవీ నరసింహారావు- మన్మోహన్ ద్వయం తమ చాణక్యంతో ప్రబల శక్తిగా తీర్చిదిద్దితే, మోదీ సర్కారు తన చేతగానితనంతో సుడిగుండంలోకి నెడుతున్నది. “ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్నది. ద్రవ్య నిర్వహణ, పొదుపు ఖాతా ప్లానింగ్ విషయంలో ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి” అని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ ఇచ్చిన సలహా కేంద్రం వ్యూహ రాహిత్యానికి తాజా సంకేతం!