2030 చివరి నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనే మాట ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఎస్ అండ్ పీ సంస్థ, ఐఎంఎఫ్ తమ నివేదికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాయి. రానున్న రోజుల్లో జపాన్, జర్మనీలను దాటి భారత్ బలమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతుందని అవి చెప్పాయి. మరోవైపు తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని మోదీ సర్కార్ గప్పాలు కొడుతున్నది. కానీ, ఇప్పటికీ మన దేశ జనాభాలో 3 శాతం వరకు ప్రజలు తీవ్రమైన పేదరికంలోనే కొట్టుమిట్టాడుతుండటం ఆందోళనకరం.
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి మందకొడిగానే ముందుకుసాగింది. ప్రపంచీకరణ దిశగా అడుగులు వేయకపోవడం, అప్పటి ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం తదితర కారణాల వల్ల భారత్ వృద్ధి చెందలేదు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాకే ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకున్నది. మాడిసన్ ప్రాజెక్టు డాటా ప్రకారం.. 20వ శతాబ్ది సగం వరకు మన జీడీపీ వృద్ధి రేటు ఏడాదికి 0.9 శాతం మాత్రమే. అదే సమయంలో జనాభా పెరుగుదల రేటు ఏడాదికి 0.8 శాతం ఉండగా, తలసరి ఆదాయం వృద్ధి రేటు 0.1 శాతమే ఉన్నది. స్వాతంత్య్రానికి ముందటితో పోలిస్తే ఆ తర్వాత వృద్ధి రేటు పెరిగిందనేది వాస్తవమే. కానీ, అదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ వృద్ధి నమోదైందనేది కూడా కాదనలేని సత్యం. వరల్డ్ బ్యాంకు నివేదిక ప్రకారం.. 2008లో 3.1 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2014 నాటికి 7.4 శాతానికి చేరుకున్నది. ఆ తర్వాత పడుతూ లేస్తూ 2022 నాటికి 7.2 శాతానికి చేరుకున్నది.
దేశ జీడీపీ రూ.273.1 లక్షల కోట్లు ఉండొచ్చని 2023 జడ్జెట్లో కేంద్రప్రభుత్వం అంచనా వేసింది. అనుకున్న లక్ష్యం ప్రకారం.. 5 లక్షల కోట్ల డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ చేరుకోవాలంటే జీడీపీ సుమారుగా 52 శాతం వృద్ధి చెందాలి. అంటే సరాసరి ఏడాదికి 8.7 శాతం వృద్ధి నమోదవ్వాలి. ఒకవేళ ఏటా రూపాయి విలువలో 4 శాతం క్షీణిస్తే.. అప్పుడు ఏటా 12.7 శాతం వృద్ధి రేటు నమోదవ్వాలి. అలా జరిగితేనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. అదే సమయంలో జర్మనీ, జపాన్ల వృద్ధి రేటు క్షీణించాలి. 1980ల నుంచి చూసుకుంటే.. ఏటా సగటున 5.6 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. ఏటా సుమారు 5 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నింటి ఆధారంగా అంచనాలు అటూఇటూగా మారవచ్చు.
అత్యధిక శ్రామిక శక్తి కలిగిన భారత్ లాంటి దేశాలు ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం
తదితర అంశాలపై దృష్టి పెడితే బాగుంటుందని ఆర్థికవేత్తల భావన. దేశంలో ఇప్పటికే ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2023 డిసెంబర్లో 5.69 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉన్నది. 8.7 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఆందోళన కలిగిస్తున్నది. గతంలో పార్లమెంట్లో జరిగిన ‘రంగు పొగల’ ఘటన ఈ కోవలోనిదే. ఉపాధి రహిత వృద్ధి, అంకెల్లో మాత్రమే కనిపించే అభివృద్ధి వల్ల దేశానికే ప్రమాదం.
దేశ తలసరి ఆదాయం చిన్న దేశాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఐఎంఎఫ్ ప్రకారం.. భారత తలసరి ఆదాయం 2,850 డాలర్లు మాత్రమే. 3,690 డాలర్లతో భూటాన్ మనకంటే మెరుగ్గా ఉన్నది. 34,550 డాలర్లతో జపాన్ మనకంటే చాలా ముందంజలో ఉన్నది. 56,040 డాలర్లతో జర్మనీ మనకు అందనంత ఎత్తులో ఉన్నది.
జీడీపీ గురించి చెప్పుకొనే కేంద్ర పెద్దలు, తలసరి ఆదాయం గురించి కూడా ప్రస్తావించాలి కదా! తలసరి ఆదాయం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. 140 కోట్ల జనాభానే అసలు కారణమని తెలివిగా తప్పించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శ్రామిక శక్తి కలిగి ఉన్న భారత్.. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే అదే దేశానికి బలమవుతుంది. ఒక సర్వే ప్రకారం.. ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న కుటుంబాలు మన దేశంలో మూడింట ఒక వంతు మాత్రమే. మిగిలిన రెండొంతుల కుటుంబాలు పూట గడవడానికి తిప్పలు పడుతున్నాయి. పెద్దలకు, పేదలకు మధ్య అంతరం నానాటికీ పెరుగుతున్నది. దేశ సంపద మొత్తం ఒక శాతం జనాభా చేతుల్లో ఉండటమే దీనికి కారణం.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చంకలు గుద్దుకుంటున్న పాలకులు వాస్తవాలను విస్మరిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ 11 శాతం జనాభా నిరుపేదలే. కడు పేదరికాన్ని అనుభవిస్తున్న సుమారు 19 కోట్ల మంది రాత్రిళ్లు ఖాళీ కడుపులతోనే పడుకుంటున్నారు. వరల్డ్ బ్యాంకు డాటా ఈ కఠోర వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నది. వరల్డ్ పావర్టీ క్లాక్ తాజా నివేదిక ప్రకారం.. ఇప్పటికీ దేశ జనాభాలో 3 శాతం మంది తీవ్రమైన పేదరికంలో బతుకీడుస్తున్నారు.
2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. 125 దేశాల జాబితాలో భారత్ 111వ స్థానంలో నిలిచింది. అయితే దీన్ని కేంద్ర మంత్రి స్మృతిఇరానీ తీవ్రంగా ఖండించారు. సర్వే ప్రామాణికతను ఆమె ప్రశ్నించారు. అదే సమయంలో ఇటీవల నీతి ఆయోగ్ ఓ సర్వేను విడుదల చేసిం ది. మోదీ హయాంలో 24.8 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ఆ సర్వేలో తెలిపింది. అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే సర్వేల ప్రామాణికతను ప్రశ్నించే కేంద్రం దీన్నిమాత్రం సమర్థించుకున్నది. ఈ సర్వే ప్రామాణికత ఏమిటనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. వాస్తవానికి రాజకీయాల అవసరాలకు అనుగుణంగా జీడీపీ లెక్కలు మారుతుంటాయనే విషయం చాలామందికి తెలిసిందే.
ఆర్థిక వ్యవస్థ బలపడినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందినట్టా? తలసరి ఆదాయం సంగతేంటి? జీడీపీ లెక్కలతో ప్రజల స్థితిగతులను అంచనా వేయడం ఎంత వరకు సమంజసం. జీడీపీ పెరిగితేనో, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తేనో ప్రజల స్థితిగతులు మారిపోతాయా? సామాన్యుల జీవనం మారిపోతుందా? దేశంలోని నిరుపేదల జీవితాలు మారినప్పుడు కదా భారత్ అభివృద్ధి చెందినట్టు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి బతుకులు బాగుపడ్డప్పుడు కదా అసలైన దేశాభివృద్ధి సాకారమైనట్టు. ఇప్పటికైనా పేదల అభ్యున్నతికి అక్కరకు రాని లెక్కలను పక్కనపెట్టి ఉపాధి కల్పన దిశగా మన పాలకులు అడుగులు వేయాలి.
– మాలోతు సురేష్
98856 79876