NCERT | ప్రపంచంలో ఏ దేశానికి చెందిన నాయకులైనా తమ దేశ పౌరులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రపంచ యవనికపై తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే వ్యక్తులుగా రాణించాలనుకుంటారు. వారిని నిరంతర పరిశోధనల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తారు. ఇదే సమయంలో భారతీయ పాలకులు మాత్రం విద్యార్థులను ఆచారాల పేరుతో అంధ భక్తులుగా మారుస్తూ ఆలోచన రహితులుగా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
కొద్దికాలం కిందట కేంద్ర విద్యాశాఖ మంత్రి ‘కోతి నుంచి మనిషి పుట్టడం మీరు ఎప్పుడైనా చూశారా’? అని స్వయంగా ప్రశ్నించారు. అంతే కొంతకాలానికి ఆ మంత్రి ఆలోచనా ధోరణికి అనుగుణంగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) సిలబస్ నుంచి మనిషి పుట్టుక గురించి వివరించే ‘డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం’ను గుట్టుచప్పుడు కాకుండా తొలగించింది. పరిణామం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా అమాత్యులు మాట్లాడిన మాటలను ‘ఎన్సీఈఆర్టీ’ అక్షరసత్యం చేసి చూపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచింది. సైన్స్ను ఏమాత్రం నమ్మకుండా మనిషి పుట్టుకకు భగవంతుడే కారణమనే మత ఛాందసవాదుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిన ఎన్సీఈఆర్టీ తాను ఎవరికోసం పనిచేస్తుందో ఈ సంఘటన ద్వారా ప్రజలకు చెప్పకనే చెప్పింది.
ఇస్లాంను తమ దేశ అధికార మతంగా స్వీకరించిన పలు ఇస్లామిక్ దేశాలు జీవపరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం గతంలో మనం చూశాం. కాలగమనంలో ఆ మత రాజ్యాలు కల్లోలిత రాజ్యాలుగా మారాయి. ఆ దేశ ప్రజలు అత్యంత అస్తవ్యస్త జీవనాన్ని గడుపుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు. మన పక్కనే ఉన్న పాకిస్థాన్ను చూస్తూనే ఉన్నాం.
కేవలం జీవపరిణామ సిద్ధాంతం తొలగింపుతో ఆగని ఎన్సీఈఆర్టీ ఇటీవల సిలబస్ నుంచి ప్రజాస్వామ్యం అనే అత్యంత ఆవశ్యకమైన అంశాన్ని కూడా తొలగించింది. అంటే దేశాన్ని రాచరికంలోకి తీసుకెళ్లాలన్న సంఘ్ పరివార్ ఆలోచనలకు అద్దం పట్టే విషయం ఇది. కొద్ది నెలలకిందట ఇదే ఎన్సీఈఆర్టీ తమ సిలబస్లోని సోషియాలజీ సబ్జెక్టు నుంచి మత కల్లోలాలు అనే అంశం నుంచి గుజరాత్ అల్లర్లను తొలగించింది. అంటే తాము సంఘ్పరివార్ కోసం పనిచేస్తున్నామని చెప్పకనే చెప్పింది. అదే మాదిరి గాంధీజీ హత్యతోపాటు గాంధీకి హిందూ మత ఛాందసవాదుల మీద ఉన్న వ్యతిరేక భావాలను సైతం తొలగించడం ద్వారా సెక్యులరిజానికి వ్యతిరేకమైన సంఘ్ పరివార్కు, ఎన్సీఈఆర్టీ ప్రతిరూపంగా మారుతోందన్న అపవాదును సైతం మూటగట్టుకున్నది.
ప్రపంచ దేశాల్లో భారతీయులకు ఉన్న ఒక గొప్ప గుర్తింపు భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటం. మతాలు వేరైనా, కులాలు వేరైనా మాట్లాడే భాషలు వేరైనా, విభిన్నమైన సంస్కృతులు కలిగినా, రకరకాల ఆచార వ్యవహారాలు కలిగినా అందరిలోనూ మేమంతా భారతీయులమనే గొప్ప భావం కలిగి ఉండటమే భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు విద్వేష శక్తుల పుణ్యమా అని ఆ భావనకే ప్రపంచవ్యాప్తంగా నష్టం వాటిల్లుతున్నది.
పరిపాలనతో మతాన్ని ముడిపెట్టిన అనేక దేశాలు అస్తిత్వాన్ని కోల్పోయిన సందర్భాలు దేశ ప్రజలు తప్పక గుర్తించాలి. తద్వారా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నించే సంఘ్పరివార్ వంటి శక్తుల కుటిల యత్నాలను నిలువరించాలి. అలా భవిష్యత్తు భారతీయ తరాలు అనుభవించవలసిన కష్టాలను మనం ముందుగానే పసిగట్టినవారమవుతాం. దేశాన్ని ప్రజాస్వామ్య భా వాల నుంచి రాచరిక భావాల వైపు నడిపించే ప్రక్రియలో భాగమే ఇది. కొన్ని స్వార్థ్ధ రాజకీయ శక్తుల ఆలోచనలకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ పనిచేయడం దేశంలో చదువుకున్న మేధావులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
ఇటువంటి ప్రయత్నాలు కేవలం ఎన్సీఈఆర్టీతో ఆగలేదు. గతంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూజీసీ దేశంలో ఉన్న పలు యూనివర్సిటీలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ఆవశ్యకత, రాజ్యాంగ రూపకల్పన తదితర అంశాలను చర్చించాలనే విషయాన్ని విస్మరించింది. దానికి బదులు రాజర్షి పేరుతో ఒక రాజ్యానికి రాజు ఏ విధంగా ఉండాలి. రాజుకు సంబంధించిన పరివారం ఏ విధంగా ఉండాలి. అంటూ సాక్షాత్తూ యూజీసీ రాచరిక చర్చకు రాచబాట పరిచింది.
ఈ రకంగా ఎన్సీఈఆర్టీ,యూజీసీలు తమ తమ స్థాయుల్లో మత ఛాందసవాద శక్తులకు వంతపాడుతున్నాయి. ముఖ్యంగా సంఘ్ పరివార్ వంటి సంస్థలకు, మరికొన్ని రాజకీయ పార్టీలకు అనుగుణంగా వ్యవహరిస్తూ దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశంలో ఉన్న సమస్యల మీద, పాలన మీద, పాలనలో తీసుకురావాల్సిన సంస్కరణల మీద చర్చించవలసిన దేశప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. తద్వారా అనవసర విషయాల మీద తమ దృష్టిని కేంద్రీకరించే దుస్థితికి తీసుకువస్తున్నాయి. ఇలాంటి శక్తులను గుర్తించవలసిన అవసరం ఉన్నది. తద్వారా భావి భారతావని నియంతృత్వవాదుల చేతికి చిక్కకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ పౌరులందరిపై ఉన్నది.
-సుధీర్ మరసు