అనుభూతిని అక్షరీకరించలేం.. లతామంగేష్కర్ ఓ నాదానుభూతి!! అమృతం రుచిని వర్ణించలేం.. లతాజీ గానం అమృతంగమయం!! లతాజీ నిజంగా భారత రత్నమే! ఆ రత్నానికి విలువకట్టలేము. ఆమె లేరన్న వార్త భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా యావత్ దేశానికే దిగ్భ్రాంతిని కలిగించింది. తీవ్ర శోకాన్ని మిగిలించింది.
లతామంగేష్కర్ ఇంటిపేరు పూర్వీకుల సొంత ఊరు గోవా వద్దగల ‘మంగీశ్’ గ్రామం నుంచి వచ్చింది. తండ్రి దీనానాథ్ సంగీతవేత్త. ఆయన చనిపోయాక వారి కుటుంబ స్నేహితుడు వినాయక్ లతాజీకి అండదండలందించి తొలిసారి మరాఠి చిత్రం ‘కితి హసల్’ లో సదాశివరావు నవ్రేకర్ సంగీతంలో అవకాశం ఇప్పించాడు. 1945లో లతాజీ తన కుటుంబాన్ని బొంబాయికి మార్చాక సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ అవకాశా లిచ్చాడు. వినాయక్ మరణానంతరం, మరో సంగీత దర్శకుడు గులామ్ హైదరి లతాజీని ప్రోత్సహించి గాడ్ ఫాదర్ అయ్యాడు.
లతాజీ భారతావనిపై అవతరించిన అపర గాన సరస్వతి. ఆమె 92 ఏండ్ల సుదీర్ఘ జీవన ప్రస్థానంలో దాదా పు 80 ఏండ్లు సంగీత ప్రపంచంలోనే గడచిపోయింది. ఈ కాలంలో ఆమె పాడిన వేల పాటలు శ్రోతలను అల రించాయి, మేల్కొల్పాయి, ముందుకు నడిపాయి.
లతాజీ వల్లనే హిందీ సినిమారంగం ఒక వెలుగు వెలిగింది. తలత్ మహమ్మద్ , హేమంత్ కుమార్, మహమ్మద్ రఫి, ముఖేశ్, కిషోర్ కుమార్, మన్నాడే, మహేంద్రకపూర్, బాలసుబ్రహ్మణ్యం వంటి హేమాహేమీలందరితో ఆమె కలిసి పాడారు. చెరకు గడను ఎక్కడ రుచి చూసినా తీయగానే ఉంటుంది. లతాజీ పాడిన ఏ పాటైనా ఎదను హత్తుకుంటుంది.
పాటలు పాడితే.. కుటుంబం గడుస్తుందన్న ఆలోచనతో లాతాజీ సినీరంగంలో కాలుమోపారు. తండ్రి మరణం వలన పసి వయసులోనే కుటుంబ బాధ్యతలు స్వీకరించడమే కాదు, జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండి పోయిన త్యాగమయి. ఆమె ప్రతిభను చూసి ఓర్వలేని దుష్టులు ఆమె అడ్డుతొలగించుకోవాలని కుట్రలు పన్నారు. వంటవాడే విషం కలిపిన భోజనం ఇవ్వడంతో మూడు నెలలు ఆస్పత్రిలో గడిపి మృత్యువు బారినంచి తప్పించుకో గలిగారు.
లతాజీ తొలిసారి తెలుగులో ‘సంతానం’చిత్రంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో అనిశెట్టి రాసిన ‘నిదుర పోరా తమ్ముడా’ జోలపాటను శ్రావ్యంగా పాడారు. జూనియర్ శ్రీరంజని మీద చిత్రించిన ఈ పాట ఎంతో హిట్టయింది. ఆమె తదుపరి మళ్ళీ ‘ఆఖరి పోరాటం’ చిత్రం లో ఇళయరాజా సంగీతంలో పాడారు.
2011లో ప్రముఖ నిర్మాత కీ.శే.ఆర్.వి.రమణమూర్తి లతాజీపై పుస్తకం రాయాలని ఈ వ్యాస రచయితను కోరారు. ఆమె జీవనప్రస్థానం, గణాంక వివరాలే ప్రధానం కాకుండా, గాత్ర వైభవానికి వాకిళ్ళు తెరచే విధంగా ఉండాలని సూచించారు. అంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.
ఆమె 980 చిత్రాల కోసం 20 భాషలలో 30వేల పైచిలుకు పాటలు పాడిన భారత కోకిల. ఓ సందర్భంలో.. ‘జొ హమ్ నే దాస్తన్.. అప్ నీ సునాయి, ఆప్ క్యౌం రోయీ..’ అంటూ ఆలపించిన పాటను వింటే కన్నీళ్ళు ఉప్పొంగకమానవు. ప్రసిద్ధ తెలుగు కవి తిలక్ అన్నట్లు.. ‘అమ్మా లతాజీ.. నీవు లేవు నీ పాట మాత్రం ఉన్నది’. సముద్రం ముందు నిల్చుని దోసిలితో ఎత్తినట్లు.. మీకు అశేష అభిమానుల పక్షాన అక్షరాంజలి.
-డాక్టర్ వి.వి.రామారావు, 98492 37663
(వ్యాసకర్త: రచయిత , గాయకుడు)