ఒక ప్రాంతంలో పండితుల నుంచి పామరుల వరకు ఒకే యాసలో, ఒకే భాషలో మాట్లాడే భాషను ప్రాంతీయ భాష అంటాం. ఏ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంతంలోని యాస పదాలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. మనసులోని భావాలను స్వేచ్ఛాయుతంగా ఇంట్లో మాట్లాడే భాష ద్వారా తెలుపవచ్చు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇంట్లో భాష తెలంగాణ యాసలో ఉంటే, పాఠశాల, కళాశాలల్లో పుస్తక భాష వేరే ఉండేంది. దీంతో విద్యార్థులకు పుస్తక భాషే అలవాటయ్యేది. దీనిపై అభిప్రాయపడుతూ భాష రెండు తీర్లు.. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకు బడుల భాష గావాలె అని ఆకాంక్షించిన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తెలంగాణ స్వరాష్టం సిద్ధించాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనీయులు.
హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా న్యాయ పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, ఆ తర్వాత సిటీ కాలేజీలో, హన్మకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు. 1939లో హైదరాబాద్లో ఉన్నత న్యాయస్థానానికి అనుబంధంగా ఉన్నన్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష.
సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 ఏండ్ల వయస్సులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడదీయరానిది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటివారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలను నిర్వహించాడు. ‘ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక’ అని తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఓయూ విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యమైనది. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కేయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
కాళోజీ ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతని గేయాల్లో రూపుకడుతుంది. ఒక ప్రాంతంలోని ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భౌగోళిక పరిస్థితుల నుంచి భాష ఉచ్చారణలో ఉండే విలక్షణత, నుడికారం, చమత్కారం ఉద్భవిస్తుంది. తేనెలొలుకు తెలంగాణ భాష దక్కనీ ఉర్దూ, తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ భాషల మిళితం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పుస్తక భాషగా, ప్రజల భాషగా తెలంగాణ భాషను వినియోగిస్తున్నం. కవులు, రచయితలు తెలంగాణ యాస, భాషల్లో రచనలు చేయడం, సినిమా వాళ్లు కూడా తెలంగాణ భాషకే పట్టం కడుతుండటంతో మన భాషకు దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు దక్కుతున్నాయి.
-బొల్లం బాలకృష్ణ
99897 35216