సుమారు అయిదు దశాబ్దాల కిందట అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన రూపాన్ని తానే స్కెచ్ వేసుకుని పై కవితను రచించారు ప్రముఖ చిత్రకారులు స్వర్గీయ డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు.
ఏ కళైనా వీక్షకులకు ఆనందాన్ని కలిగించడమే కాదు, మానసికోల్లాసాన్ని, చైతన్యాన్నీ కలిగించగలిగితే ఆ కళ పరమ లక్ష్యం నెరవేరినట్టే. ఆ కళాకారుడికి అంతకన్నా సంతృప్తి మరొకటి ఉండదు. తెలంగాణా గడ్డ మీద పుట్టి కళారాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయులెందరో ఉన్నారు. చిత్రకళలో అసమాన ప్రతిభను కనబరచి ఆ సాధనలో శిఖరాలను అందుకున్న గొప్ప చిత్రకారులలో ముందు వరుసలో ఉండదగినవారు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు.
తానే స్వయంగా ఒక వ్యాసంలో శేషగిరిరావు చెప్పినట్టు.. ‘చిత్రకళ ఒక భాష. రంగులు, రూపాలు దాని లిపి. ఈ లిపితో వ్యక్తీకరించు భావాలే కవిత్వం.’ అయితే, సృజనకారుడికి ఆ భాషా, లిపీ తెలిసి ఉండడమే కాదు, అందులో నిష్ణాతుడై ఉండాలి. ముఖ్యంగా చిత్రకారులు సృజించిన రూప్య, నైరూప్య చిత్రాలలో అలాంటి జీవమున్న కవిత్వం తొణికిసలాడాలి. ఆ సుకవిత్వాన్ని వీక్షకులు అర్థం చేసుకోవాలి కూడా. అలాంటి చిత్రకళా రసభాష పరిపూర్ణంగా తెలిసిన గొప్ప చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకా పెనుగొండ గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో, గోపాల్రావు, రామచూడమ్మ దంపతులకు జన్మించిన శేషగిరిరావు చదువుకోవడానికే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అప్పటికీ, ఇప్పటికీ కూడా చిత్రకళ అభ్యాసం, నిరంతర సృష్టి ఎంతో ఖర్చుతో కూడుకున్నదే. ఈ కళను వృత్తిగా స్వీకరించడానికి ఇతరత్రా ఆదాయం, ఆర్థిక స్తోమత ఉన్నవారికి తప్ప మామూలు వారికి కష్టమే. బ్రష్లు, రంగులు, కాన్వాస్, అవి ఉంచడానికి సరిపడా మంచి చోటు.. ఇవన్నీ మామూలు వారికి అందని ద్రాక్షలే. అయినప్పటికీ పాఠశాల విద్యను ఉర్దూ మీడియంలో పూర్తి చేసిన శేషగిరిరావు.. చిత్రకళపై ఉన్న తీవ్రమైన మక్కువ వల్ల హైదరాబాద్లో 1940లో స్థాపింపబడిన గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో మొదటి బ్యాచ్ విద్యార్థిగా చేరి చిత్రకళను అభ్యసించారు. యుక్తవయసులోనే చిత్రాలు గీయడంలో నైపుణ్యత సాధించి సంతాల్, హార్మనీ, కాకులు వంటి తన చిత్రాలకు ప్రముఖ చిత్రకారులతో పోటీపడి బహుమతులు సాధించారు.
నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ బహదూర్ సహకారంతో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని కళాభవన్లో 1946లో చేరి నందలాల్ బోస్ వద్ద చిత్రకళను అభ్యసించారు. అక్కడ ఉన్న సమయంలో ప్రకృతి చిత్రణలోనూ, పౌరాణిక మూర్తుల చిత్రణలోనూ ప్రావీణ్యత సాధించారు. ముఖ్యంగా బెంగాలీ సంప్రదాయ చిత్రణ, చైనీస్ వాటర్ కలర్ పెయింటింగ్లోనూ, జపనీస్ చిత్రకళలోనూ నిష్ణాతులయ్యారు. కొంతకాలం పాటు రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠ్లో చిత్రకళను అభ్యసించారు. హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ ఆర్ట్ (ప్రస్తుతం కాలేజీ అఫ్ ఫైన్ ఆర్ట్స్)లో లెక్చరర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, ప్రొఫెసర్గా పదవీ విరమణ పొందేదాకా వివిధ స్థాయుల్లో పనిచేశారు.
పౌరాణిక పాత్రలు, సందర్భాలు, చారిత్రక ఘట్టాలు చిత్రీకరించడానికి ఆయా పురాణ, చరిత్ర గ్రంథాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పటివారి వేషభాషలు, అలవాట్లు.. మొత్తంగా ఆనాటి సంస్కృతి ఆయా చిత్రాల్లో ప్రతిబింబించాలి. ప్రతి చిత్రానికీ ఎంతో శ్రద్ధ తీసుకుని గీసే అలవాటు శేషగిరిరావుది. విస్తృత పర్యటన, నిరంతర అభ్యాసం ఆయనను ఉత్తమశ్రేణి చిత్రకారునిగా తీర్చిదిద్దాయి. పౌరాణిక చిత్రాల కోసం ఆయన రామాయణ, భారత, భాగవత గ్రంథాలనూ, అభిజ్ఞాన శాకుంతలం వంటి కావ్యాలనూ, హనుమకొండ లోని వేయిస్తంభముల దేవాలయం, పాలంపేట రామప్పగుడి, కొలనుపాక, నాగార్జున కొండ, లేపాక్షి, తాడిపత్రి, సోమపాలెం, హంపి, తంజావూరు, మథుర, శ్రీరంగం, రామేశ్వరం, సాంచి, సారనాథ్, అజంతా ఎల్లోరా శిల్పాలనూ ప్రత్యేక శ్రద్ధతో, విమర్శనా దృష్టితో అధ్యయనం చేసి చిత్రాలు గీయడంతోబాటు అనేక వ్యాసాలు రచించారు.
కవుల్లో పోతన అంటే శేషగిరిరావుకు ప్రత్యేక అభిమానం. వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము కావ్యంలోని 14 ఘట్టాలకు ఆయన వేసిన చిత్రాలు అత్యద్భుతంగా ఉండడమే కాక చిరకాలం నిలిచిపోతాయి. బమ్మెరలోనూ, ఓరుగల్లులోనూ పోతన పంచ శత జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు ఆ కమిటీ వారి కోరిక మేరకు శేషగిరిరావు చిత్రించిన పోతన పోర్ట్రయిట్ ఇప్పటికీ సాధికారికంగా పోతన బొమ్మగా వాడుతున్నారు. చివరకు శిల్పులు కూడా పోతన విగ్రహం చెక్కాల్సి వస్తే దాన్నే అనుసరిస్తున్నారు . అదేవిధంగా 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన చిత్రించిన ‘తెలుగు తల్లి’ విగ్రహం కూడా బహుళ జనాదరణ పొందింది. వీరి చిత్రాలలో భద్రాచల రామదాసు, విజయనగర సామ్రాజ్య స్థాపన, పోతనకు సరస్వతీ దేవి సాక్షాత్కారం, అహల్యా శాపవిమోచనం, కథా కాలక్షేపం, గడ్డి మోపునెత్తుకున్న పల్లె పడుచు, జంటలేళ్ళు వంటి చిత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
జానపద చిత్ర రంగానికి శేషగిరిరావు చేసిన కృషి, సేవ ఎంతో గొప్పవి. జనగామ ప్రాంతంలోని చేర్యాలలో మరుగున పడిపోతున్న తెలంగాణ పట చిత్రాలైన కాకి పడగలను గుర్తించి లలితకళా అకాడమీ వారిని ఒప్పించి ఆ అట్టడుగు వర్గాల కళను వెలుగులోకి తెచ్చారు.
ప్రకృతి దృశ్యాలు, పక్షులు, జంతువులు, శిలలు, చారిత్రక ప్రదేశాలు వంటివి చిత్రీకరించడంలో ఆయన ప్రత్యేక ఆసక్తి చూపేవారు. హర్షచరిత్ర, క్రీడాభిరామం గ్రంథాల్లోని సున్నిత అంశాలను చిత్రకళకు సమన్వయం చేసి చూపడం వీరి ప్రత్యేకత.
ఆయనలో మంచి చిత్రకారుడే కాక గొప్ప అధ్యాపకుడున్నాడు. చిత్రకళకు సంబంధించిన రంగుల ఎన్నిక, మేళవింపు, పాత్ర స్వభావాన్ని, మూడ్ని, స్థలకాలాల్ని, సంప్రదాయాల్ని గురించిన అవగాహన, చిత్రీకరణలో మెలకువలకు చెందిన విజ్ఞానం, బోధనా ప్రావీణ్యత మాత్రమే కాక ఎన్నో సాంకేతిక అంశాలు శేషగిరిరావు గారికి క్షుణ్ణంగా తెలుసు. ఆయన మంచి కవి, రచయిత కూడా. చిత్రకళకు సంబంధించిన ఎన్నో అంశాలపై విలువైన వ్యాసాలు రాశారు. తమ సమకాలీన చిత్రకారులైన కాపు రాజయ్య, పీటీ రెడ్డి వంటి వారి ప్రత్యేకతల గురించి, ఇతర ప్రముఖుల గురించి కూడా పదుల సంఖ్యలో వ్యాసాలు రచించిన సహృదయత, వైదుష్యం ఆయనది.
బ్రిటిష్ పరిపాలన మన పూర్వ విజ్ఞానాలన్నీ మనకు లేకుండా చేసిందనీ, చిత్రకారులంతా కుంచెలు, రంగుల వంటి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అలవాటు పడ్డారనీ, విదేశీయ ఆయిల్కలర్ బ్రష్లు, వాటర్కలర్ బ్రష్లు మన దేశ సంప్రదాయ రేఖాచిత్రకళా శైలినే మార్చేసిందని ఆయన అనుభవపూర్వకమైన అభిప్రాయం. మన ఉడుత వెంట్రుకలతో ఉత్తమమైన బ్రష్లు తయారుచేయవచ్చనీ, ప్రాచీన చైనా చిత్రకారులు ఎలుక మీసాలతో చేసిన బ్రష్లు వాడేవారనీ, నల్లసిరా, కర్పూరపు మసితో కలిపిన రంగుల మేళవింపుతో మన దేశంలో చిత్రకారులు అద్భుత చిత్రాలను సృజించారనీ ఆయన ఎన్నో వ్యాసాలలో పేర్కొన్నారు. వాటర్ పెయింటింగ్లో ‘ఆక్వా టెక్చర్ ’ అనే ప్రత్యేక విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు.
శేషగిరిరావు మంచి కార్టూనిస్ట్ కూడా అనే విషయం చాలామందికి తెలియదు. సన్నని రేఖల్లో హావభావాలు ప్రకటింపజేయడం ఆయన ప్రత్యేకత. తెలంగాణా సాయుధ పోరాట సమయంలోనూ, అంతకుముందు రోజుల్లోనూ ఆయన చిత్రించిన రాజకీయ వ్యంగ్య చిత్రాలు చురుక్కుమనిపించేలా ఉంటాయి. ఆయన స్వాతంత్య్ర సమర యోధుడు కూడా.
శేషగిరిరావు ప్రతిభకూ, చిత్రకళారంగానికి వారు అందించిన అమూల్య సేవలకూ ఎన్నో సాహిత్య సాంస్కృతిక సంస్థలు బిరుదులతో, పురస్కారాలతో సత్కరించాయి. 1996లో వారిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక ‘హంస’ అవార్డు లభించింది. హైదరాబాద్, మైసూర్, మద్రాస్ ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వారి పురస్కారాలు, ఏపీ లలితకళా అకాడమీ, కలకత్తా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సత్కారాలు, సారస్వత పరిషత్, ప్రపంచ తెలుగు మహాసభల కమిటీ వారి సన్మానాలు పొందారు.
దేశ, విదేశాలకు చెందిన ప్రాచీన, ఆధునిక చిత్రకళా రీతులను సమగ్రంగా అవగాహన చేసుకున్న చిత్రకారుడు, పరిశోధకుడు, సామాజిక, సాహితీవేత్త డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు వైదుష్యాన్ని కేవలం ఒక వ్యాసంలో పేర్కొనడమంటే ఏనుగును ఒక చిన్న సీసాలో పెట్టడమే! ఈ జనవరి 27న వారి శతజయంతి సందర్భంగా సంస్మరించుకోవడం కళాభిమానులందరి కర్తవ్యం.
‘మహోన్నతమైన కళ ఎన్నటికీ వృత్తి కాజాలదు. అది కేవలం ఆత్మవ్యక్తీకరణ మాత్రమే. దానికి ప్రతిఫలాకాంక్ష లేదు. కళకు ఆనందమే పరమావధి. నేత్రానందముతో బాటు మానసికానందము కల్గించినపుడే కళ సార్థకమౌతుంది ’ అని చెప్పిన గొప్ప వ్యక్తి, చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు గారికి నివాళి !!
-నెల్లుట్ల రమాదేవి