రాష్ట్ర కూటులు ఎక్కడో మహారాష్ట్రలో పాలించారనీ, ఎల్లోరా గుహల్ని చెక్కించారనీ చదువుకుంటాం. మరి వీరికీ తెలంగాణకు ఉన్న సంబంధం ఏమిటి? తెలంగాణ ఎప్పుడైనా వీరి పాలన కింద ఉందా? ఇలాంటి ప్రశ్నలకు శాసనాలు మనకు సమాధానం చెపుతాయి. తెలంగాణ చరిత్ర దక్కను చరిత్రలో భాగం. దక్కనులోని మహారాష్ట్ర, కర్ణాటకల చరిత్ర కూడా తెలంగాణ చరిత్రతో పెనవేసుకుని ఉంది. శాతవాహనుల నుంచి అసఫ్జాహీల వరకు అంటే దాదాపు 2100 ఏళ్లు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని దక్కన్ భూమి రాజకీయం, ఆర్థికం, సాంస్కృతికం- ఇలా అన్ని విషయాలు కలసిపోయి ఉంటాయి. అందుకే ఔరంగాబాద్లోని ఎల్లోరా గుహల్ని సంరక్షించింది హైదరాబాద్ రాజ్యమే.
వీరి వంశం పేరు వీరి అధికార సూచికగా వచ్చింది. రాష్ట్ర (రాజ్యంలో ఒక పరిపాలన విభాగం- ఇప్పటి రాష్ట్రంతో పోల్చుకోవచ్చు) పాలకులు కాబట్టి వీరి వంశం పేరుతో రాష్ట్రకూటులైనారు. ఈ కాలంలోనే గ్రామాన్ని పాలించే వారిని గ్రామకూటులని కూడా పిలిచేవారు. బాదామి చాళుక్యుల సామంతులుగా ఎన్నో రాష్ట్రకూట వంశాలున్నాయి. తొలి రాష్ట్రకూట కుటుంబాల్లో ఒకటి మానపుర (సతారా జిల్లా మహారాష్ట్ర) ప్రాంతానికి చెందినవాళ్లు అని 5వ శతాబ్దపు ఉత్తరార్థం నాటి పాండురంగపల్లి తామ్ర శాసనం దీనిని ధ్రువీకరిస్తుంది. దీని పాలకుడైన మానాంక అశ్మక (అస్సక) రాజ్యాన్ని జయించాడని తెలుస్తున్నది. అంటే తెలంగాణ, మహారాష్ట్రలోని కొంతభాగం ఒకే పాలన కిందకు క్రీ.శ. 450 నాటికి వచ్చిందన్నమాట. ఆ తర్వాత బాదామి చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూటుల ప్రభావం అశ్మక (తెలంగాణ) పై కనిపిస్తుంది. ఇంకో వైపు కృష్ణా తీరంలోని ప్రాంతాలు బాదామి చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేవి.
సామంతుడైన రాష్ట్రకూట దంతిదుర్గ, తన రాజైన బాదామి చాళుక్య ప్రభువు రెండవ కీర్తివర్మ కాలంలో చేసిన తిరుగుబాటుతో బాదామి చాళుక్య రాజ్యంలో అధికభాగం రాష్ట్రకూటుల స్వతంత్ర పాలన కిందకు వచ్చింది. క్రీ.శ. 756లో దంతిదుర్గ మరణంతో అతని చిన్నాన్న మొదటి కృష్ణ మిగిలిన బాదామి చాళుక్య రాజ్యాన్ని గెలుచుకోవడంతో స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యం మొదలైంది. దంతిదుర్గ కుటుంబం లాల్టూర (మహారాష్ట్రలోని నేటి లాతూర్)లో ఉండేది. ఈ లాతూర్ తెలంగాణ సరిహద్దు పట్టణం జహీరాబాద్కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బాదామి చాళుక్యుల సామంతులుగా ఉన్నప్పుడు వీరి రాజధాని బేరార్ (మహారాష్ట్రలోని నేటి అమరావతి ప్రాంతం) లోని ఎల్లిచ్పూర్ (ఇప్పుడు అచలాపుర)లో ఉండేది. దంతిదుర్గ కాలంలో అది ఎల్లోరా దగ్గరికి మారినట్టు ఎల్లోరాలోని దశావతారగుహగా పిలుచుకునే 15వ గుహలోని గోడమీది శాసనం చెపుతుంది. ఆ తర్వాత మయూర్ఖండికి మారినట్టు తెలుస్తుంది.
చివరగా మొదటి అమోఘవర్షుడి కాలం నాటికి రాష్ట్రకూట రాజధాని మాన్యఖేతకు (మహారాష్ట్రలోని మాల్ఖేడకు) మారింది. ఇది మన జహీరాబాద్కు 90 కి.మీ.దూరం. అంటే రాష్ట్రకూట రాజధాని తెలంగాణ పొలిమేరల్లో ఉండటమంటే రాష్ట్రకూట ప్రభా వం దక్షిణ తెలంగాణ మీద ఎంత ఉండేదో ఊహించుకోవచ్చు. రాష్ట్రకూటులు బ్రాహ్మణ లేదా క్షత్రియ వంశాల నుంచి కాకుండా తొలి మధ్య యుగంలో ఎదుగుతున్న వ్యవసాయిక కులాల నుంచి వచ్చినవాళ్లు. అందుకే దంతిదుర్గ మాళ్వాను గెలుచుకున్న తర్వాత ఉజ్జయినిలో హిరణ్యగర్భ యాగం చేయడంతో మతపర సాధికారత తెచ్చుకున్నాడు.
తెలంగాణలో ఎక్కడ పాలించారు?
క్రీ.శ.757 నాటికి బాదామి చాళుక్య రాజ్యం మొత్తం రాష్ట్రకూటులు వశమైంది. దీంతో తెలంగాణలోని కృష్ణ-తుంగభద్ర ప్రాంతాలు, మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు జిల్లాలైన సంగారెడ్డి, మెదక్ జిల్లాలు; వరంగల్, యాదాద్రి-భువనగిరి ప్రాంతాల్లో రాష్ట్రకూటుల పాలన వారి స్థానిక సామంతుల ద్వారా మొదలైంది. ఇక గోదావరీ పరివాహక ప్రాంతం ఉత్తర తెలంగాణలోని బోధన్లో మొదలై వేములవాడకు చేరుకున్న వేములవాడ చాళుక్య వంశం రాష్ట్రకూటుల సామంతులుగా తెలంగాణ పెద్ద భూభాగాన్ని ఏలారు.
తెలంగాణలో రాష్ట్రకూటుల ఆధారాలు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఏకనాథ స్వామి ఆలయంలో దొరికిన మొదటి కృష్ణుని శాసనం ఇప్పటివరకు దొరికిన రాష్ట్రకూట శాసనాల్లో మొదటిదిగా భావించవచ్చు. ఇది క్రీ.శ. 758-772 మధ్య నాటిది. ఆ తర్వాత, జోగులాంబ-గద్వాల జిల్లాలోని అలంపూర్లోని రెండవ గోవింద శాసనం. ఇది క్రీ.శ.773-80 నాటిది. ఇంకొక రాజైన ధ్రువ కాలం నాటి శాసనం (క్రీ.శ.780) భీమేశ్వరాలయంలో, ఇంకొకటి కామాక్షి ఆలయ ద్వారంపై ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కురువగట్టుపల్లి, మీనాంబరం, ప్రాగటూరు, నస్రుల్లాబాద్, కల్వకోల్, గొల్లత్తగుడి (లఘు శాసనాలు) రాష్ట్రకూట కాలానివే. సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర ఉన్న మల్లికార్జునపల్లిలో (క్రీ.శ.846), అందోల్ దగ్గర మిన్పూర్లో అమోఘవర్షుడి శాసనాలు దొరికాయి. వెండికోల్లో రాష్ట్రకూట కాలంలో శివాలయం ఆవరణలో ఆదిత్య దేవుడికి ఇచ్చిన భూదానం గురించిన శాసనం ఉంది. అమోఘవర్షుడి సామంతుడు భీమరస క్రీ.శ.872లో జారీ చేసిన కాజీపేట శాసనం (వరంగల్ జిల్లా), జాఫర్గఢ్లో నరసింహస్వామి ఆలయం పై తేదీ లేని శాసనం, జనగామ తాలూకా ఆకునూరులో లభ్యమైన శాసనాలు రాష్ట్రకూట కాలపు సాక్ష్యాలు. వరంగల్ జిల్లా కొండపర్తిలో దొరికిన శాసనం సేద్యంలో చేసుకున్న ఒప్పందం గురించి తెలుపుతుంది.
యాదాద్రి జిల్లాలోని వెల్మజాలలో రెండవ కృష్ణ పాలన కాలంలో స్థానిక పాలకుడు రావి చంద్రయ్య జైన బసది కోసం 100 మర్తరుల భూమిని, తోటను దానం చేసిన సంగతి చెప్తుంది. ఇదే జిల్లా మంతపురిలో మాహాసామంతాధిపతి అయ్యనయ్యరసర్ (అయ్యనయ్య అనే అరస- అరస అంటే కన్నడలో రాజు) క్రీ.శ.972లో వేయించిన శాసనం రాష్ట్రకూట కాలపు చివరి శాసనం గా చెప్పుకోవచ్చు. దీంట్లో రాజు పేరు లేకపోవటం రాజకీయ అనిశ్చితిని సూచిస్తుంది.
శాసనాలు ఏమి చెపుతున్నాయి? : రాష్ట్రకూటుల శాసనాల్లో అర్థం చేసుకోవాల్సిన మొదటి అంశం భాష, లిపి. బాదామి చాళుక్యుల కాలంలో మొదలైన తెలుగు-కన్నడ లిపి కొన్ని మార్పులతో కొనసాగింది. వారి మూలం కన్నడ భాష ప్రాంతం కావడంతో ఆ భాషాభివృద్ధి స్పష్టంగా తెలుస్తుంది. ఇక మతం విషయంలో వైదిక మతం సరే సరి, జైన మతం ప్రభావాన్ని పెంచుకోవడం కనిపిస్తుంది. జైన బసదులకు ఇస్తున్న దానాల ప్రస్తావన, రాష్ట్రకూట రాజ్యంలో జైనం ఉచ్ఛ స్థితికి చేరిందనడానికి ఆధారాల్ని శాసనాలు అందిస్తున్నాయి.