ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి. ఈ గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా మున్ముందు సమస్యలు ఎదురవుతాయని 2014లోనే ఓయూ జేఏసీ ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేసింది. ఓయూ జేఏసీ చేసిన ధర్నాలు, ఇచ్చిన వినతి పత్రాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. వారి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఆ ఐదు గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అప్పటికే ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని’ తెలంగాణ ఏర్పాటు పట్ల అసూయ, ఆంధ్రప్రదేశ్పై వల్లమాలిన ప్రేమతో మాట్లాడిన ప్రధాని మోదీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కలిసి కొత్త రాష్ట్రం అయిన తెలంగాణపై వివక్ష చూపించారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను స్థానిక ప్రజలు వ్యతిరేకించినా ఆంధ్రాలో విలీనమయ్యేలా బిల్లు చేసి చట్టం చేశారు. తత్ఫలితంగా స్థానిక ప్రజలకు ఇష్టం లేకున్నా తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రాలో కలిశాయి. నాటి కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలకు ముంపు ప్రాంతాన్ని ఆంధ్రాలోకి తీసుకోవాలనే యావ తప్ప, ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయో కూడా గమనించలేదు.
‘భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు’ అనే నినాదం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో మార్మోగింది. దానితో భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణకు వదిలేసి, మిగతా మండలం మొత్తం ఆంధ్రాకు కేటాయిద్దాం అనే ఆలోచనలో అప్పటి ప్రభుత్వాలుండిపోయాయి. ఇక్కడ ఒక సాంకేతిక సమస్య ఏమంటే భద్రాచలం పట్టణం మొత్తం అనంటే, కేవలం భద్రాచల పట్టణం మాత్రమేనన్న సాంకేతిక పదజాలంలో తెలంగాణకు భద్రాచలం మాత్రమే ఇచ్చి, భద్రాచలంలోని పంచాయతీలు ముఖ్యంగా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, భద్రాచలం నెత్తిన ఉన్న పురుషోత్తపట్నం, దానికి ఆనుకొని ఉన్న గుండాల గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేటాయించారు. అసలు ఈ ఐదు పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయన్న కనీస అవగాహన విభజించిన వారికి లేకపోవడం శోచనీయం.
నాటి నుంచి ఎనిమిదేండ్లుగా ఈ ఐదు గ్రామాలు విద్య, వైద్యం, ఉపాధి పరంగా జిల్లా కేంద్రానికి దూరమయ్యాయి. ప్రభుత్వ పాలనాపరంగానైతే వందేండ్లు వెనక్కి వెళ్లాయి. నేటికీ ఈ ఐదు గ్రామాల్లోని విద్యార్థులు పదవ తరగతి చదువుకోవాలంటే సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఆ గ్రామాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం కావాలంటే మళ్లీ భద్రాచలం ప్రభుత్వ దవాఖానే దిక్కు. విభజన సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఈ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే 1986 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఈసారి వరద వచ్చింది. 78 అడుగుల వరకు వచ్చిన వరదతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఐదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణ లో కలుపమని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఐదు గ్రామాలు ఆంధ్రాలో ఉన్నంత కాలం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాయి. కాబట్టి, కేంద్రంలోని మోదీ, ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. పోలవరం డ్యాంతో ఈ గ్రామాలకు సంబంధం లేదని గుర్తించాలి. సమస్య వేగంగా పరిష్కారం కావాలంటే ఆ ఐదు గ్రామాలను భద్రాచలానికి అప్పగించాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఆ ఐదు గ్రామాలకు జరిగిన, జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. వారికి ఆంధ్రా ప్రభుత్వం కూడా ఎప్పటికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. అది ఆంధ్రా ప్రభుత్వానికి తలకు మించిన భారం కూడా. వాస్తవాన్ని గ్రహించి ఆ పంచాయతీలను తెలంగాణకు అప్పగిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది.
– గడ్డం శ్రీరామ్, ఓయూ జేఏసీ