ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఖలిస్థాన్ వాదం మరోసారి పంజా విసురుతున్నది. భారత్ గడ్డ మీద ఈ వేర్పాటువాద ధోరణికి మద్దతు మృగ్యమైపోయిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో ఖలిస్థాన్ వాదులు విజృంభిస్తున్నారు. వారు చేపడుతున్న దుందుడుకు కార్యకలాపాలు ఇటీవలి కాలంలో తరచుగా వార్తలకెక్కుతున్నాయి. ముఖ్యంగా భారత్ వెలుపల సిక్కులు అత్యధిక సంఖ్యలో నివసించే కెనడా ఖలిస్థానీల కేంద్రంగా మారింది. కెనడాలో 2021లో జరిపిన జనగణనలో 7 లక్షల 70 వేల మంది పౌరులు సిక్కు మతం కింద నమోదు చేసుకోవడం గమనార్హం. పైగా భారత్ మొత్తం జనాభాలో సిక్కులు 1.7 శాతం మాత్రమే. కానీ కెనడా జనాభాలో 2.1 శాతం వరకు ఉంటారు. అంతంతమాత్రం జనాభా ఉండే కెనడాలో బలమైన వర్గంగా సిక్కుల మాట చెల్లుబడి అవుతున్నది. అక్కడి రాజకీయాల్లోనూ సర్దార్జీలు చక్రం తిప్పుతున్నారు. 2015లో కెనడా ప్రధాని ట్రూడో తన ప్రభుత్వంలో ఇద్దరు సిక్కులకు స్థానం కల్పించారు. అప్పట్లో భారత ప్రభుత్వంలో ఇద్దరు సిక్కు మంత్రులు మాత్రమే ఉన్నారు. దీని గురించి ట్రూడో గొప్పగా చెప్పుకొనేవారు. ఇప్పుడు ఆయనకు అదే గుదిబండగా మారింది. ఈ ప్రత్యేక హోదా ఫలితంగా కొందరు సిక్కులు కాలంచెల్లిపోయిన ఖలిస్థాన్ వాదాన్ని మళ్లీ ముందుకు తెస్తున్నారు. ఉద్యమం పేరిట ఉల్టాపల్టా పనులకు పాల్పడుతున్నారు. భారత రాయబార కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు. భారత జాతీయ పతాకానికి అపచారం చేస్తున్నారు. చిలికి చిలికి గాలివానగా మారినట్టు ఖలిస్థాన్వాదుల చిల్లర చేష్టలు భారత్, కెనడా మధ్య దౌత్య సంక్షోభాన్ని సృష్టించాయి. దౌత్యవేత్తల బహిష్కరణ, పౌరుల రాకపోకలపై ఆంక్షల వంటి తీవ్ర నిర్ణయాలకు రెండు దేశాలు పాల్పడటం ఆందోళన కలిగించే విషయమే.
ఖలిస్థాన్ సమస్య మరోసారి తలెత్తడమేమిటి? స్వదేశంలో ఎలాంటి పునాది లేకుండాపోయిన నాటి ఉద్యమం సవాల్ విసిరే స్థాయికి చేరుకోవడం ఏమిటి? ఒకప్పుడు పాకిస్థాన్ అండగా ఖలిస్థాన్వాదులు రెచ్చిపోయేవారు. ఆ బంధం బలహీనమైపోయిన నేపథ్యంలో ఇప్పు డు కెనడాలో కొత్తగా పాత పాట ఎత్తుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పంజాబ్లో ఖలిస్థాన్ సమస్యను తుదముట్టించారు. అటు దౌత్యపరంగా పాకిస్థాన్పై ఒత్తిడి తెచ్చి బయటినుంచి మద్దతు లభించకుండా చేశారు. కానీ మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత చాపకింద నీరులా ఖలిస్థానీ కార్యకలాపాలు తెరమీదకు వచ్చాయి. విదేశాంగ విధానంలో సమస్యలు తెచ్చిపెట్టాయి. తొలివిడత పాలనలో సుష్మా స్వరాజ్ విదేశాంగమంత్రిగా ఉన్నా, రెండో విడతలో రాజకీయవేత్త కాకుండా కెరీర్ డిప్లొమాట్ అయిన ఎస్ జైశంకర్ను విదేశాంగ మంత్రిని చేసినా.. అన్నింటా మోదీయే చక్రం తిప్పడం సాధారణమైపోయింది. కనుక విదేశాంగ విధానం లోటుపాట్లన్నింటికీ ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కెనడా ఖలిస్థానీ సమస్య భారత ప్రయోజనాలకు, పరువు ప్రతిష్ఠలకు సవాల్గా పరిణమించిన నేపథ్యంలో కేంద్రం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉన్నది.
విదేశీ గడ్డ మీద నుంచి మరోసారి ఖలిస్థాన్ వాదం తల ఎగరేయడం భారత్కు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ సవాల్ను ఇండియా ధాటిగా తిప్పికొట్టక తప్పదు. దౌత్యపరంగా సమస్యను మొగ్గలోనే తుంచివేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్టే కనిపిస్తున్నది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నదే తప్ప పరిపక్వత కలిగిన దౌత్యచర్యలు చేపట్టలేకపోతున్నది. ఇటువంటి వ్యవహారాల్లో దెబ్బకు దెబ్బ అన్నట్టుగా పోవడం వల్ల ఫలితం ఉండదన్నది తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాని మోదీ మధ్య పెరిగిన దూరానికి జీ-20 సదస్సు అద్దం పట్టింది. తర్వాత పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతున్నది. కెనడా అనవసరంగా సిక్కుల సమస్యపై అతిగా పోయి భారత్తో వైరం కొనితెచ్చుకున్నదని పశ్చిమ దేశాలూ విమర్శిస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయం కారణంగా కెనడా ప్రభుత్వం సిక్కుల కార్యకలాపాలను చూసీచూడనట్టు వదిలేసే పరిస్థితి వచ్చింది. నిజానికి సిక్కులు అందరూ ఖలిస్థాన్వాదులు కారు. ఖలిస్థాన్వాదులు అందరూ ఉగ్రవాదులు కారు. కొందరు మతోన్మాదులు సృష్టిస్తున్న సమస్యకు రెండు దేశాల సంబంధాలు బలవుతున్నాయి. ఇది ఏ మాత్రం అభిలషణీయం కాదు. భారత సార్వభౌమాధికారాన్ని, భారత జాతీయ చిహ్నాల గౌరవాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజాన్ని, ముఖ్యంగా పశ్చిమ దేశాలను కలుపుకొని రావడమూ అవసరమే!