వైఎస్ షర్మిల తెలంగాణలో కవ్వింపు రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్టున్నారు. ఆమె వ్యవహారశైలి రోజురోజుకు వివాదాస్పదమవుతున్నది. మీడియా ఆకర్షణ కోసమో, లేక కొన్ని రాజకీయ పార్టీల మెప్పు కోసమో పనిచేస్తున్న షర్మిల ఏ లక్ష్యంతో ముందుకుసాగుతున్నారో ఎవరికీ పాలుపోవడం లేదు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయపార్టీలు పెట్టుకోవచ్చు. ఆ మేరకు ప్రచారం చేసుకోవచ్చు. కానీ షర్మిల, ఆమె కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని చూస్తే అసలు షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారో ఇప్పటికీ చాలామందికి అర్థం కావడం లేదు. కానీ ఆమె లక్ష్య రహితంగా నిర్వహిస్తున్న పాదయాత్ర, ప్రసంగాలు, పర్యటనలన్నీ నిశితంగా గమనిస్తే ‘కమలం పువ్వులోని ఓ రెమ్మ’ అని స్పష్టం అవుతున్నది.
తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న షర్మిల వ్యాఖ్యలను విని, విసిగిపోయిన జనం ఇప్పుడు ‘షర్మిలా! ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఓపిక నశించిన తెలంగాణ సమాజం, రాజకీయ విశ్లేషకులు వైఎస్సార్టీపీ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే షర్మిల ఒక గమ్యం లేని బాణం. కుటుంబ సమస్యల్లోంచి ఆ పార్టీ పుట్టిందా… లేక బీజేపీకి పరోక్షంగా సహకరించేందుకు పురుడు పోసుకున్నదా, లేక ఆస్తులు కాపాడుకోవడం కోసమా తెలియదు కానీ తెలంగాణకొచ్చి రాజన్న రాజ్యం తెస్తుందట వైఎస్సార్టీపీ. సరే ఓసారి అదే రాజన్న రాజ్యం గురించి ఇప్పుడు చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. బలంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని చంపాలని చూసింది వైఎస్సార్. నికార్సయిన ఉద్యమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీలో, ఉద్యమంలో చిచ్చులు పెట్టాలని ప్రయత్నించింది వైఎస్సార్. ఇక్కడికి రావాల్సిన నిధులు, నీళ్లను దోచుకెళ్లి తెలంగాణ వెనుకబాటుకు కారణమైంది వైఎస్సార్. ‘తెలంగాణ వస్తే అక్కడికి వెళ్లాలంటే మనం వీసా తీసుకోవాలి’ అని ఎన్నికల సమయంలో తెలంగాణ పట్ల తనకున్న అక్కసును ఆంధ్రాలో వెళ్లగక్కారు వైఎస్సార్. ఆ మాటకొస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లను పోతిరెడ్డిపాడుకు గండి పెట్టి మరీ తరలించుకుపోయింది నిజం కాదా? ఇక్కడి ఉద్యోగాలు, నిధుల విషయంలో సీమాంధ్రకు పెద్దపీట వేసింది వాస్తవం కాదా? ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తంగా వైఎస్సార్ కుటుంబం తెలంగాణకు బద్ధ వ్యతిరేకులన్నది పచ్చి నిజం. ‘తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడం, వైఎస్సార్ వలె నీతివంతమైన పాలన అందించడం’ అని కూడా షర్మిల మాట్లాడుతున్నారు. రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నీతివంతమైన పాలన జరిగితే, తనయుడు జగన్ జైలు జీవితం ఎందుకు గడిపిండు?
జగన్కు భయమంటే ఏమిటో చూపిన మానుకోట ఇంకా గాయాల నుంచి కోలుకోకముందే మళ్లీ వైఎస్సార్ తనయ అ ప్రాంతానికి వస్తుందంటే అక్కడి జనం చూస్తూ ఊరుకుంటారా? ఆమె ప్రసంగాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయని నర్సంపేట ఘటన ద్వారా తేటతెల్లమవుతున్నది. తెలంగాణలో మెజారిటీ జిల్లాలు పర్యటించినా ఆమె ప్రసంగాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆమెకు నర్సంపేట నుంచి నిరసన స్వరం ఎదురుకావడానికి అనేక కారణాలున్నాయి. గతంలో సీమాంధ్ర నేతలెవ్వరు వచ్చినా ఇదే నర్సంపేట, మానుకోట గడ్డలు ‘గో బ్యాక్’ అని నినదించాయి. చిరంజీవిపై కోడి గుడ్ల దాడి జరిగినా, కిరణ్కుమార్రెడ్డికి నిరసన సెగ తగిలినా, జగన్ ఓదార్పుయాత్ర పేరుతో వచ్చినా ఆ గడ్డ తన సహజ ధిక్కార స్వరాన్ని వినిపించింది. నేడు షర్మిలనూ అడ్డుకున్నది. ఒక రాష్ట్రంలో ఎవ్వరైనా స్వేచ్ఛగా పర్యటనలు చేయవచ్చు, ప్రచారాలు చేసుకోవచ్చు. కానీ విద్వేషపూరిత ప్రసంగాలను మాత్రం ఇక్కడి జనం జీర్ణించుకోలేరు. అందులో తప్పేం లేదు కూడా. మర్నాడే షర్మిల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నానా హంగామా సృష్టించారు. పోలీసులు అలా అరెస్టు చేశారో లేదో, వెంటనే గవర్నర్ తమిళి సై, బీజేపీ నేతలు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఆమె అరెస్టును ఖండించారు. షర్మిలతో, తెలంగాణ రాజకీయాలతో తమకు సంబం ధం లేదంటూనే ఏపీ నుంచి సజ్జల, కొడాలి నాని సహా పలువురు స్పందించారు. షర్మిలను ఎలా అరెస్టు చేస్తారంటూ ఒంటి కాలి మీద లేస్తున్నారు. అంటే షర్మిలను ఎవరు ఎలా ఆడిస్తున్నారు. ఎవరి చేతిలో ఆమె కీలుబొమ్మ అనేది తేలిపోయిందని ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ఇతర నేతలు ప్రతిస్పందించారు.
షర్మిల పార్టీని, ఆమె తెలంగాణ పర్యటనను, ప్రసంగాలను చాలా తేలికగా తీసుకున్న టీఆర్ఎస్ నాయకత్వంపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. తెలంగాణ అస్తిత్వా న్ని, ఆత్మగౌరవాన్ని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. షర్మిల యాత్రకు ప్రజామోదం లేకపోయినా, ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని అరువు తెచ్చుకొని యాత్రలో కాస్తో కూస్తో జనం ఉన్నట్టుగా షో చేసినా, పెయిడ్ వార్తలతో కొన్ని మీడియా సంస్థల్లో పతాకస్థాయిలో వార్తలను అచ్చు వేయించుకున్నా, సామాజిక మాధ్యమాల్లో తిట్టిన తిట్లను పదేసి సార్లూ చూపినా తెలంగాణ సమాజం అంతగా పట్టించుకోలేదు. షర్మిలను తెలంగాణ సమాజం ఓ పిల్లకాకిలా చూస్తుందే తప్ప రాజకీయ నాయకురాలిగా చూడటం లేదు. కానీ ఆమె ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలపైన వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
తెలంగాణలో రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేతల పట్ల పరుష పదజాలంతో కూడిన ఆరోపణలు చేస్తే ఇక్కడి సమాజం సహించదనే తత్వం షర్మిలకు తెలిసొస్తే బాగుంటుంది. సీమాంధ్ర గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఆత్మగౌరవంతో ముందుకుసాగుతున్నది తెలంగాణ. ఈ క్రమంలో రాజకీయ అవసరాల కోసం మళ్లీ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఈ విషయాన్ని షర్మిల తెలుసుకోవాలి. నర్సంపేట ప్రజల ప్రతిఘటన అనుభవంతోనైనా బుద్ధి తెచ్చుకోవా లి. నర్సంపేట ప్రజలు చేసిన హెచ్చరిక ఒక్క షర్మిలకే కాదు, తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
(వ్యాసకర్త: ఎమ్మెల్సీ, వరంగల్)
-పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి