75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందటం లేదు. ముఖ్యంగా, ఎస్సీల్లో ఉపకులాలుగా ఉన్న ప్రజలు అభివృద్ధికి ఎంతోదూరంలో ఉన్నారు. ఎస్సీలకు అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల మాల, మాదిగలే గరిష్ఠంగా లబ్ధి పొందుతున్నాయి. ఉమ్మడి ఏపీలో నాలుగేండ్లపాటు అమలైన వర్గీకరణ కూడా ఉపకులాలకు న్యాయం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఉపకులాలను ఆదుకునే విధంగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాల్సిన అవసరం ఉన్నది.
ఎంతో ఆశావహ దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు, వాటి ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదు. ఎస్సీలలోని కొన్ని సంపన్న శ్రేణులు మొత్తం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఇది సామాజిక అసమానతలకు దారితీస్తున్న విషయాన్ని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 16, 338, 341, 342, 342 ఏ అనేవి ఎంతో ప్రాధాన్యత కలిగినవి. రిజర్వేషన్ల లక్ష్యం అసమానతలు తొలగించడమే అయినప్పుడు, కల్పించిన రిజర్వేషన్లతోనే అసమానతలు ఏర్పడటం ఆందోళనకరం.
1996 సెప్టెంబర్లో నాటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఎస్సీలలో ఉన్న 59 కులాల్లో కొన్ని కులాలు మాత్రమే సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నాయని,మిగిలిన కులాలు రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నాయని తెలిపింది. అందువల్ల అందరికీ సమన్యాయం కోసం ఎస్సీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలని సూచించింది. దాని ప్రకారం…
ఏ- గ్రూపులో రెల్లి తదితర 12 కులాలకు ఒక శాతం రిజర్వేషన్; బీ- గ్రూపులో మాదిగ తదితర 18 కులాలకు 7 శాతం రిజర్వేషన్; సీ గ్రూపులో మాల తదితర 25 కులాలకు 6 శాతం రిజర్వేషన్; డీ గ్రూపులో ఆది ఆంధ్ర తదితర 4 కులాలకు ఒక శాతం రిజర్వేషన్.. మొత్తం 59 కులాలకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ మేరకు 2000 నుంచి 2004 వరకు ఏపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసింది. 2004లో దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన ఇ.వి.చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రద్దుచేస్తూ, వర్గీకరణచేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటాలతో ఎస్సీలలో ఉన్న అసమానతలు తొలగించటానికి వర్గీకరణ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ 2008లో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.
తెలంగాణలో ఎస్సీల జనాభా 63,60,158 ఉండగా, అందులో మాదిగలు 25,09,992 అంటే, మొత్తం ఎస్సీ జనాభాలో 39 శాతం ఉన్నారు. మాలలు 17,05,448 అనగా 27 శాతం ఉన్నారు. ఇక మిగతా వారిలో మోచి, బైండ్ల, హోలీయదాసరి, గోసంగి, చిందు, మాస్టి న్, మాదిగజంగం, మాలజంగం, డక్కలి, సమగర, బేడ బుడగజంగం, నేతకాని, మితల్ అయ్యళ్వార్లు, మాదాసికురువ, పాకి, బ్యాగరి, దోంబరా, మన్నే మొదలైన అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలు ఉన్నాయి. వీరి జనాభా 21,44,718. ఎస్సీలలో 34 శాతం ఉన్నారు.
ఈ దేశ చరిత్రను, పురాణాలను భాగవతం, యాక్షగానాల రూపంలో భవిష్యత్ తరాలకు అందిస్తున్న ఉపకులాలకు చెందిన ప్రజలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. భిక్షాటన చేస్తూ, అంగళ్ళలో పూసలు అమ్ముతూ, రోడ్డుపై చెప్పులు కుడుతూ, సంచారజీవనం గడుపుతూ, వీధిసర్కస్ చేస్తూ, గ్రామ దేవతలకు పూజారులుగాఉంటూ జీవనం సాగిస్తున్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్ధిక, రాజకీయపరంగా మాల, మాదిగలతో పోల్చితే అత్యంత వెనుకబడి ఉన్నారు.
కులం, వృత్తి, దారిద్య్రం ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. రిజర్వేషన్ల వల్ల సమన్యాయం జరుగాలి. ఇదే అంశంపై 2020 ఆగస్టు నెలలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దావీందర్సింగ్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పరిశీలనకు నివేదించడం జరిగింది. ఈ కేసులో కొన్ని ముఖ్యమైన అంశాలను గమనిస్తే… ఎస్సీలను వర్గీకరించరాదంటూ 2004లో ఇచ్చిన తీర్పును పునఃపరి శీలించాలని, ఎస్సీలను వర్గీకరించి వారిలో వెనుకబడ్డ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ర్టాలకు ఉందని ధర్మాసనం తేల్చిచెప్పింది. 2004లో చెన్నయ్య కేసును చూసిన బెంచ్ ఇచ్చిన తీర్పు సరికాదని, వాస్తవాలను గుర్తెరగకపోతే సామాజికమార్పు జరగాలన్న రాజ్యాంగలక్ష్యం నెరవేరదని స్పష్టంచేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 నుంచి 2004 వరకు అమలులో ఉన్న ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలలో ఉన్న మాల, మాదిగ కులాలు మాత్రమే అధిక లబ్ధి పొందాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఉపకులాలకు తీరని నష్టం జరిగిందని వివిధ నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గతంలో జరిగిన ఎస్సీ వర్గీకరణను రద్దుచేసి, అందుకు భిన్నంగా ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా హేతుబద్ధంగా ఎస్సీవర్గీకరణ జరగాలి. ఎస్సీ ఉపకులాలను ‘ఏ’ గ్రూపులో; మాదిగలను ‘బీ’గ్రూపులో, మాలలు ‘సీ’ గ్రూపులో ఉండేట్లు ఎస్సీల వర్గీకరణ జరగాలి. వస్తుంది. మూడు గ్రూపులకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించాలి. మాలల ద్వారా మాదిగలకు నష్టం జరిగిందని అంటున్నారు. అది నిజమే కానీ.. మాల, మాదిగల ద్వారా ఎస్సీ ఉపకులాలకు కూడా తీవ్రనష్టం జరుగుతూనే ఉంది. దీనిని నివారించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఒకే జాతి వారమన్న నెపంతో సంపన్న శ్రేణి వారు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందడం సరికాదు. కాబట్టి రాజ్యాంగ రక్షకులైన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఈ అసమానతలను తొలగించటానికి తగు చర్యలు తీసుకొని అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో ఎస్సీల్లో ఉన్న ఉప కులాలకు రిజర్వేషన్లలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
– బైరి వెంకటేశం మోచి 94919 94090
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి)