దేవాలయాల్లో మూల విరాట్టు కొలువై ఉండే స్థానం గర్భాలయం. కాగా, గర్భాలయంలో ప్రధాన దైవాన్ని బట్టి ద్వారాలకు రెండువైపులా ద్వార పాలకులు ఉంటారు. విష్ణుమూర్తి, ఆయన అవతారాలైన నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు కొలువై ఉండే వైష్ణవ ఆలయాల ద్వార పాలకులు జయవిజయులు. అంతేకాదు, శ్రీమహావిష్ణువు నిజవాసం వైకుంఠం వాకిలికీ జయవిజయులే కాపలాదారులు. జయుడు ద్వారానికి కుడివైపున ఉంటే, విజయుడు ఎడమవైపు ఉంటాడు. విష్ణుమూర్తి నాలుగు చేతుల్లో చక్రం, శంఖం, గద ఉంటాయి. జయవిజయుల చేతుల్లోనూ ఇవే ఆయుధాలుంటాయి. అయితే వీరి విషయంలో కుడి ఎడమల వరస మారుతుంది. ఇద్దరూ మూల విరాట్టు విష్ణువునే పోలి ఉంటారు. అందువల్ల విష్ణువు నుంచి వీరిని వేరుగా గుర్తించడానికి కొన్ని ఆలయాల్లో జయవిజయుల మూర్తులకు కోర దంతాలను ఉంచుతారు. మరికొన్ని ఆలయాల్లో ద్వారానికి కుడివైపున ఉండే జయుడి కుడిచేయి, ఎడమ వైపున ఉండే విజయుడి ఎడమచేయి చూపుడు వేలు హెచ్చరిస్తున్నట్లుగా ఉంటాయి. అంటే అది… భగవంతుడి ముందు భక్తులు తమ పరిమితిని, మనుషులుగా తమ స్థానాన్ని గుర్తుంచుకోవాలన్న హెచ్చరిక. లోపల కొలువైనది బ్రహ్మాండ నాయకుడు కాబట్టి భయ భక్తులతో మసలుకోవాలన్న హెచ్చరిక. దేవదేవుడి దర్శనం కోసం ఆలయంలో అడుగుపెట్టడానికి ముందు బాహ్యంగా, అంతరంగా శుచిని పాటించాలన్న హెచ్చరిక ఈ ముద్రల అంతరార్థంగా గ్రహించాలి.
భాగవతం ప్రకారం జయవిజయులు వైకుంఠానికి ద్వారపాలకులు ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఓసారి బ్రహ్మ మానసపుత్రులు సనత్కుమార, సనక, సనందన, సనాతనులు-నలుగురూ విష్ణుమూర్తి దర్శనానికి వైకుంఠానికి వెళ్తారు. వారు ఎప్పటికీ పసిపిల్లల్లానే కనిపిస్తారు. అయితే సాటిలేని విజ్ఞానం, తపశ్శక్తీ వారి సొంతం. అది విష్ణువు యోగనిద్రలో ఉన్న సమయం కాబట్టి, బాలల్లా కనిపించిన సనక సనందనాదులకు జయవిజయులు వైకుంఠ ప్రవేశం నిరాకరిస్తారు. ఈ విధంగా కొన్ని పర్యాయాలు జరుగుతుంది. తమకు శ్రీమన్నారాయణుడి దర్శనం జరగకుండా అడ్డుకుంటున్నందుకు కోపించిన సనత్కుమారులు వైకుంఠానికి దూరంగా జన్మలు ఎత్తుతారని జయవిజయులను శపిస్తారు. ఇంతలో విష్ణుమూర్తి వస్తాడు. జరిగింది తెలుసుకొని పరిష్కారం చెప్పమంటాడు. అప్పుడు విష్ణువుకు భక్తులుగా ఏడు జన్మలు ఎత్తడం, లేదంటే పరమాత్ముడికి శత్రువులుగా మూడు జన్మలు ఎత్తడం ఏదో ఒకటి ఎంచుకోవాలని పరిహారం సూచిస్తారు. తమ స్వామికి ఏడు జన్మలపాటు దూరంగా ఉండటానికి మనసు ఒప్పని జయవిజయులు మూడు జన్మలు శత్రువులుగా పుట్టడానికే అంగీకరిస్తారు.
ఆయా జన్మలలో జయవిజయులు భూమ్మీద చేసే ఆగడాల బారినుంచి దేవతలు, మునులు, ప్రజలను రక్షించి, వారికి జన్మరాహిత్యాన్ని ప్రసాదించడానికి తాను వివిధ అవతారాలు ధరిస్తానని మాట ఇస్తాడు శ్రీహరి. అలా జయవిజయులు కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా, త్రేతాయుగంలో రావణకుంభకర్ణులుగా, ద్వాపరంలో శిశుపాలదంతవక్త్రులుగా జన్మిస్తారు. భూమిని చాపలా చుట్టుకుపోయి సముద్రంలో దాక్కున్న కారణంగా హిరణ్యాక్షుడిని వరాహ అవతారంలో, హరిభక్తి మానుకోమని కొడుకు ప్రహ్లాదుడిని వేధిస్తున్నందుకు హిరణ్యక శిపుణ్ని నరసింహుడిగా, సీతను అపహరించినందుకు రావణ కుంభకర్ణులను శ్రీరాముడి రూపంలో, విపరీత చర్యలకు ఫలితంగా శిశుపాల, దంతవక్త్రులను శ్రీకృష్ణుడిగా అవతరించి సంహరించి, వారికి ముక్తిని ప్రసాదిస్తాడు శ్రీమహావిష్ణువు. కాగా, కొన్నిచోట్ల మాత్రం ఈ జాబితాలో కార్తవీర్యార్జునుడు, కంసుణ్ని కూడా చేర్చడమూ కనిపిస్తుంది.
వివిధ జన్మలలో శివుడిని, బ్రహ్మదేవుడిని మెప్పించి అజేయమైన వరాలు పొందుతారు జయవిజయులు. అయినా శ్రీహరి చేతిలో హతులవుతారు. అయితే నారాయణుడి మీద ద్వేషంతో నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. దీన్ని విపరీత భక్తి, ద్వేషభక్తి, వైరభక్తిగా పేర్కొంటారు. ద్వేషంతో భగవంతుడి నామాన్ని స్మరించడమే వైరభక్తి. అలా వైరభక్తి కారణంగా భగవంతుడి చేతిలో మరణించిన జయవిజయులు చివరికి వైకుంఠానికి చేరుకుంటారు. తమ విధుల్లో భాగంగా ఏ తప్పూ చేయకపోయినా వారికి సనత్కుమారులు శాపం ఇస్తారు. దానిని అనుభవించి, వీలైనంత తొందరగా తమ ప్రభువును చేరుకొని, సేవించుకునేందుకు జయ విజయులు ఎంచుకున్న మార్గమే రామాయణం, హరివంశం, భాగవత కథలకు నేపథ్యంగా నిలిచింది. పరమాత్ముడు భూమ్మీద అవతరించాలన్న తమ ఉద్దేశాన్ని సనత్కుమారులు ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇదీ వైష్ణవ మందిరాల్లో ప్రధాన దైవానికి అంగరక్షకులుగా ఉండే మూర్తులు జయవిజయుల కథ!