Indravelli | 1981 ఏప్రిల్ 20, సోమవారం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సంత జరుగుతున్నది. అదే రోజు ఆదివాసీల చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీ సంఘం బహిరంగసభకు పిలుపునిచ్చింది. మొదట పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. తర్వాత చివరి నిమిషంలో అనుమతి రద్దు అన్నారు. అప్పటికే ఆదివాసీ గూడేల్లో ప్రచార సాధనాలు అంతగా లేని రోజుల్లో నోటిమాట ద్వారానే నెల రోజుల ముందు నుంచి ప్రచారం జరిగింది. దీంతో ఇంద్రవెల్లికి వేలమంది ప్రజలు చేరుకున్నారు. పోలీసులు జనాన్ని కట్టడి చేసే క్రమంలో అరగంట పాటు కాల్పులు జరిపారు. దీంతో అనేకమంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోగా వందలమంది గాయపడ్డారు.
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మరణించినవారు 13 మంది కాగా, గాయపడ్డవారు 200 పైచిలుకు. అనధికారిక లెక్కల ప్రకారం మరణించిన వారు 60 మంది. ఆదివాసీ సంఘాలు సేకరించిన లెక్కల ప్రకారం 20 మంది. ఈ సభలో గజ్జెకట్టి పాడింది దివంగత ప్రజా యుద్ధనౌక గద్దర్. ఆ కాల్పులు జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. ప్రతిపక్షాలు, ప్రజాహక్కుల సంఘాలు, సాహితీలోకం ‘స్వతంత్ర భారత జలియన్వాలా బాగ్’ అంటూ ఆ ఘటనను నిరసించింది. ఆ తర్వాత గద్దర్ స్వయంగా ‘ఇంద్రవెల్లి కొండల్లో దండూ పుట్టింది .. నేస్తమా రావా.. దండు దండుకు 70 చేతులు పుట్టాయో’ అని పాటకట్టి అనేక వేదికల మీద పాడారు.
తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇంద్రవెల్లి సభ హంతకులే సంతాపసభ పెట్టినట్టు ఉన్నది. సుమారు 43 ఏండ్ల కిందట 1981 ఏప్రిల్ 20న గోండులపై జరిగిన ఆనాటి మారణకాండ, ఈతరం వారికి చెప్పాల్సిన బాధ్యతతో చరిత్ర పుటలను మరొక్క మారు తిప్పి సత్యాన్ని సాక్షాత్కరించేందుకే ఈ నా ప్రయత్నం.
తెలంగాణలో గోండుల హక్కుల పోరాటాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం కుమ్రం భీం. నిజాం పాలనలో తమ జాతివారిని గోండుయేతరుల నుంచి రక్షించుకునేందుకు జరిగిన వీరోచిత పోరాటం తెలంగాణ ప్రజానీకానికి సుపరిచితం. కుమ్రం భీంతో పాటు ఎంతో మంది చేసిన ప్రాణత్యాగం ఫలితంగా 1940లో అప్పటి నిజాం ప్రభుత్వం ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ హైమన్డార్ఫ్ను గిరిజనులు, ఆదివాసీల సమస్యల గురించి అధ్యయనం చేసేందుకు నియమించింది. హైమన్డార్ఫ్ నివేదికను అనుసరించి ‘హైదరాబాద్- ట్రైబల్ ఏరియాస్ దస్తర్-ఉల్-అనర్’ అనే చట్టాన్ని తెచ్చింది నిజాం ప్రభుత్వం. గోండు, ఇతర ఉపజాతులు నివసించే నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఒక ఏజెంట్ ద్వారా పరిపాలన కొనసాగేలా చట్టం చేసింది. ఆ చట్టాన్ని అనుసరించి కోర్టులకు కానీ, రెవెన్యూ శాఖకు కానీ ఆ నోటిఫై చేసిన ప్రాంతాలపై ఎలాంటి హక్కులు ఉండవు. 1946-48లో నిజాం వ్యతిరేక ప్రజా-రైతు పోరాటాలు అదిలాబాద్ వరకు విస్తరించాయనేది చారిత్రక సత్యం. 1949లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన అనంతరం ‘ది 1949 ట్రైబల్ ఏరియా రెగ్యులేషన్’ ప్రకారం కలెక్టర్ను ఏజెంట్గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. తదనంతరం ఆ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 1981లో ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటనలు ఆ చట్టాలు నిర్వీర్యం చేయడం వలన జరిగాయని చరిత్రకారులు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజానీకం అభీష్టాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల పోరాటాలను విస్మరించి, ఆ పోరాటాలను అణచివేసి, ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను తుంగలోకి తొక్కి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణను ఆంధ్రా ప్రాంతంలో బలవంతం గా 1956లో విలీనం చేసింది. 1969లో ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు తుపాకీ గుండ్లతో వందలాది మందిని పొట్టన పెట్టుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.
దానికి ప్రతీకగానే గన్పార్క్లో అమర వీరుల స్థూపం కట్టారనేది అందరికీ తెలిసిన సత్యం. తదనంతరం జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత, ఎమర్జెన్సీ వలననే తెలంగాణ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు, నక్సలిజం, పౌరహక్కుల సంఘాల ఉద్యమాలు మొదలైనవి ఉనికిలోకి వచ్చాయనేది చారిత్రక సత్యం.
అప్పటి కాంగ్రెస్ అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజాయుద్ధ నౌకనే గద్దర్. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దర్ను ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేశాయనేది చరిత్రపుటల్లో లిఖించి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గద్దర్పై కాల్పులు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యలను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖండించిన దాఖలాలు లేవు. ఆరోజు ప్రజాసంఘాలు, లెఫ్ట్ మాత్రమే గద్దర్ వెంట రక్షణగా నిలబడ్డాయి.
ఇలా అనేక పోరాటాలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో గోండు ప్రజల పోరాటాలు కొనసాగాయి. అదిలాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981లో గోండు మహాసభలకు ఇంద్రవెల్లిలో రైతుకూలీ సంఘం పిలుపునిచ్చింది. ఆ సభ నిర్వహించేందుకు పోలీసు, ప్రభుత్వ అనుమతులు కూడా తీసుకుంది. 1981 మార్చిలోనే ఈ సభల గురించి పోస్టర్లు, కరపత్రాలు పంచి పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఏప్రిల్ 19 నాటికే వేలమంది గోండులు ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే పోలీసులు 19వ తేదీ రాత్రి ఆ అనుమతులు రద్దు చేసి ఆదివాసీలు శాంతియుతంగా తలపెట్టిన సభకు విఘాతం కలిగించారు. ఆ సందర్భంలో జరిగిన అలజడి నెపంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మరణించగా 200 మంది క్షతగాత్రులయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లి (ఈపీడబ్ల్యూ) కరస్పాండెంట్ ఎం.రఘురామ్ ఇంద్రవెల్లి ప్రాంతంలో విసృతంగా పర్యటించి పరిశోధనాత్మక వ్యాసం రాయగా, ‘కార్నెజ్ ఎట్ ఇంద్రవెల్లి’ ఏ రిపోర్ట్ పేరిట 1981, జూన్ 13న అది ప్రచురితమైంది. ఇంద్రవెల్లి కాల్పుల్లో 250 మందికి పైగా మరణించారని, వందలమంది తుపాకీగుళ్ల పాలయ్యారని, వారిలో అధికులు మరణించే అవకాశమే ఎక్కువ అని, వారు పోలీసులకు భయపడి దవాఖానలో చికిత్స తీసుకునేందుకు రాకపోవడమే అందుకు కారణమని తెలిపారు. ఈ ఘటన పోలీసు కాల్పులుగా చూడలేమని, ఇలాంటి మారణహోమాన్ని రాజకీయ నిర్ణయంగా చూడాలని, దీనికి పూర్తి బాధ్యత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పారు.
తెలంగాణలో నక్సలిజం వైపు యువత అడుగులు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వివక్ష, అణచివేతలే కారణం అయ్యాయి. పచ్చని తెలంగాణను ఎండబెట్టి ప్రాజెక్టులు కట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించారు. దీంతో తెలంగాణ అన్నిరంగాలలో నష్టపోయింది. యువత అడవులపాలు, రైతులు, రైతు కూలీలు వలసల పాలయ్యారు. నక్సల్స్ను అణచివేసే క్రమంలో ఈ దేశంలో ఎన్కౌంటర్లకు నాంది పలికింది కూడా కాంగ్రెస్ పార్టీనే కావడం గమనార్హం.
2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి కాలయాపన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు దిగొచ్చి 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటించి, సోనియాగాంధీ పుట్టినరోజు కానుక అని ప్రకటించి, ఆ తర్వాత ఆంధ్రా ఆధిపత్య శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి డిసెంబరు 23న తెలంగాణ ఏర్పాటును వెనక్కు తీసుకుని కమిటీల పేరుతో కాలయాపనకు తెరలేపారు. అప్పటి నుంచి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన ఉద్యమంలో అనేకమంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటారు. ఈ చావులన్నింటికీ కారణం కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణలో చిందిన ప్రతి రక్తపుచుక్క, పారిన నెత్తుటి ధారల వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. ఏ రోజు, ఏ ఊర్లో ఎన్కౌంటర్ జరుగుతుందో? ఏ బిడ్డ నేలకు ఒరుగుతాడో? ఏ తల్లి పేగుబంధం తెగిపోతుందో? తెలియని విషాదఛాయలలో తెలంగాణ గడిపింది.
‘ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లాలోన.. లాఠీ తూటాల రాజ్యమాయె తెలంగాణ పల్లెలోన.. మీసం మొలిసిన కొడుకుల జూసి ఆశలెన్నో పెంచుకుంటే.. సదువుకొని గొప్పోల్లయి సాత్తరని కలలుకంటె.. కన్నందుకూ కంటిపాపలా కాటికైనా మోయ్యకుండా.. గుండెకోత మిగిలిపాయె తెలంగాణ జిల్లాలోన.. అయ్యా.. అవ్వకు ఆశే లేదు తెలంగాణ పల్లెల్లోన.. తుపాకుల మోతలతోన తూరుపు తెల్లారవట్టె.. గుట్ట పక్కన శవం జూసి గుర్తుపట్టుడు కష్టమాయె.. కాలి మీద పుట్టుమచ్చలు తెలంగాణ జిల్లాలోన.. కన్నాకొడుకుల రూపు తెలిపె తెలంగాణ పల్లెలోన’.. అన్న పాటలు పాడుకోవాల్సిన పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్న విషయం తెలంగాణ సమాజం ఇప్పట్లో మరిచిపోదు. అబద్ధపు హామీలు, అవాస్తవ ప్రచారాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 54 రోజుల పాలనలో ఏదో సాధించినట్టు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించడం గర్హనీయం. ముందు ఇంద్రవెల్లి కాల్పులకు కారణం అయిన కాంగ్రెస్ పార్టీ నాటి ఘటనపై ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి. ఇంద్రవెల్లిలో సభలు పెట్టి, గద్దర్ పేరిట అవార్డులు ఏర్పాటు చేయడం మూలంగా కాంగ్రెస్ తన పాపాలు కడిగేసుకోవాలని భావిస్తే అది అత్యాశే. తెలంగాణను ఆంధ్రలో చేర్చడం, తెలంగాణ వనరులు, ఉద్యోగాలు దోచిపెట్టడం, తెలంగాణ బిడ్డలు అడవిబాట పట్టడానికి, ప్రజలు వలసబాట పట్టడానికి, గద్దర్ కాలికి గజ్జె కట్టడానికి, వందలు, వేల ఎన్కౌంటర్లు, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలు, తెలంగాణ బిడ్డల మరణాలకు ఒకే ఒక కారణం కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు చెరిపేస్తే చెరిగేవి కావు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ ద్రోహాలను ఎన్నటికీ మరిచిపోదు.
ఇంద్రవెల్లి మారణహోమానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ, దాని ప్రభుత్వం మళ్లీ 43 ఏండ్ల తర్వాత అక్కడ సభ పెట్టడం, హంతకులే సంతాపసభ పెట్టినట్టుగా ఉన్నది. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గత పదేండ్లలో ఎలాంటి ఎన్కౌంటర్లు లేకుండా పాలించారు. 77 ఏండ్ల తెలంగాణ చరిత్రలో ఇలాంటి ఏకైక ముఖ్యమంత్రి ఆయనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏజెన్సీ ప్రాంతంలో మంచినీటి వసతి కల్పించడం ద్వారా కాంగ్రెస్ పాలనలో నిత్యం మనం చూసే కలరా, మలేరియా మహమ్మారులను, మెరుగైన వైద్య సదుపాయంతో విషజ్వరాలను అరికట్టారు. దశాబ్దాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పక్కనబెట్టిన పోడుభూమి సమస్యను చాలావరకు పరిష్కరించి 4 లక్షల ఎకరాలకు పైగా ఆదివాసీలకు భూహక్కుల్ని కల్పించారు. సుమారు వంద సంవత్సరాల ఆదివాసీ సమస్యలకు పరిష్కారం చూపారు. 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో కారింది కన్నీటిధారలు. పారింది రక్తపుటేరులు. స్వరాష్ట్రంలో నేలను కృష్ణా, గోదావరి నీళ్లతో తడిపి బంగారు పంటలను పండించినం. పేదరికాన్ని తగ్గించి దేశానికే తెలంగాణను రోల్మోడల్ చేసినం. దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ చేయనిది కేసీఆర్ తన పదేండ్ల పాలనలో చేసి చూపించారు.
– రాష్ట్ర మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి