డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతూ రూ.80.05కి చేరుకున్నది. ఈ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం దేశచరిత్రలోనే మొదటిసారి. నోమోర్ సంస్థ అంచనా ప్రకారం.. డిసెంబర్ నాటికి రూపాయి విలువ రూ.82 వరకు దిగజారవచ్చు. 2014లో ఒక డాలరు విలువ రూ.58 ఉన్పప్పుడు ‘రూపాయి ఐసీయూలో ఉండి మృత్యువుతో పోరాడుతున్నదని’ దేశ ఆర్థికవ్యవస్థ అంతా ఆగమాగమైనట్లు మాట్లాడిన నరేంద్రమోదీ నేడు నోరు మెదపడం లేదు.
2012 మార్చి 29-ఏప్రిల్ 11 వరకు ముడిచమురు ధర ఒక పీపాకు రూ.121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ (పీపీఏసీ) వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్ 10న మన దేశం కొనుగోలు చేసిన చమురు ధర ఒక పీపాకు రూ.121.28 డాలర్లు. అదే ధరకు 2012లో చెల్లించిన మొత్తం మన రూపాయిల్లో రూ.6,201.05 కాగా నేడు రూ.9,434. 29 చెల్లిస్తున్నాం. అంటే చమురు ధరల్లో మార్పు లేకపోయినా మనం అదనంగా రూ.3233.24 చెల్లిస్తున్నాం. ఎందుకంటే పదేండ్ల కిందట రూపా యి విలువ డాలర్కు రూ.51.13 ఉండగా, 20 22 జూన్ 10 నాటికి రూ.77.79కి చేరి నేడు రూ.80 దాటింది. 2022లో ఇప్పటికే 95.6 బిలియన్ డాలర్ల చమురు దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది మొత్తం 145 నుంచి 150 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రూపాయి విలువ పతనం కారణంగా పదేండ్ల కిందట మనం చెల్లించిన దానికంటే అదనంగా 52శాతం చమురు దిగుమతుల మీద చెల్లిస్తున్నాం. ఇది దేశ ఆర్థికవ్యవస్థ కృంగిపోవడానికి దారితీస్తుంది. దేశ ప్రజలపై విపరీతమైన భారాలు మోపబడతాయి. ఇదంతా రూపాయి పతనాన్ని అరికట్టలేని కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన ఫలితమే!
రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది?
పురాతన చరిత్ర కలిగిన కరెన్సీలలో ఒకటిగా ఉన్న మన రూపాయి విలువ రెండు విధాలుగా నిర్ధారించబడుతుంది. 1.ఎగుమతులు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే రూపాయి విలువ తగ్గిస్తుంది దీన్ని ‘డివాల్యువేషన్ ఆఫ్ రూపీ’ అంటారు. 2.డాలర్ల సప్లయి డిమాండ్ ఆధారితంగా నిర్ణయించబడుతుంది. మన దేశానికి డాలర్ల డిమాండ్ ఎక్కువగా ఉండి వాటి సప్లయి తక్కువగా ఉంటే రూపాయి విలువ తగ్గుతుంది. ఒకవేళ డాలర్ల అవసరం తక్కువగా ఉండి వాటి సప్లయి ఎక్కువగా ఉంటే రూపాయి విలువ పెరుగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తు సేవలకు డిమాండ్ పెరగలేదు. పత్తి లాంటి వాటికి కూడా పెద్దగా డిమాండ్ లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికాలోపం, దూరదృష్టి లేకపోవడం వల్ల బొగ్గు దిగుమతులు 242 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు కూడా పెరిగాయి. మన సింగరేణి బొగ్గు ధరతో పోలిస్తే, విదేశీ బొగ్గు ధర 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బొగ్గు దిగుమతులు వాణిజ్య లోటు పెరగడానికి ఒక ముఖ్య కారణం. రెండవ కారణం చమురు దిగుమతులు. మూడవ కారణం బంగారం దిగుమతులు. గతంతో పోల్చుకుంటే బొగ్గు 242 శాతం, చమురు 94.4 శాతం, బంగారం 169 శాతం దిగుమతులు పెరిగాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పరికరాలు భారీగానే దిగుమతి చేసుకొంటున్నాం. తత్ఫలితంగా వాణిజ్య లోటు రికార్డుస్థాయికి చేరింది. మరోవైపు మన దేశంలోకి వచ్చే డాలర్ల ప్రవాహం పెరగకపోగా తగ్గడం మొదలైంది. 2022 జనవరి నుంచి ఇప్పటిదాకా 2 లక్షల 30 వేల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. అమెరికా, అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, భారత ఆర్థిక పరిస్థితి తీవ్ర నిరాశజనకంగా ఉన్న ఫలితంగా విదేశీ పెట్టుబడులు వెనక్కిపోవడంతో డాలర్ డిమాండ్ మరింత పెరిగింది. ధరలను అరికడుతామని కేంద్రం కొన్ని వస్తువుల మీద ఆంక్షలు పెట్టింది. ఉదాహరణకు గోధుమలు, స్టీల్. ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టినందుకు మనకు వచ్చే డాలర్ల ఆదాయం తగ్గిపోయింది. రాబోయే 9 నెలల్లో కేంద్రం 267 బిలియన్ డాలర్ల విదేశీ అప్పు చెల్లించాలి. ఇవన్నీ కూడా రూపాయి మీద ఒత్తిడి పెంచుతాయి.
కేంద్ర ప్రభుత్వ వాదనలు: మన రూపాయి విలువ రూబుల్, యెన్, పౌండ్, యూరోతో పోలిస్తే బలపడుతుందని కేంద్రం చెప్తున్నది. నిజానికి దేశాభివృద్ధికి కావల్సిన అన్నిరకాల వస్తుసేవల విదేశీ వ్యాపార వాణిజ్యాలు అత్యధిక శాతం డాలర్ల రూపంలోనే జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీల విలువలు తగుతున్నాయనేది కేంద్రం మరో వాదన. ఇది దేశ ఆర్థిక సమస్యలను పక్కదారి పట్టించడమే!
80వ దశకంలో మార్గరెట్ థాచర్ ప్రవేశ పెట్టిన ‘ట్రికిల్ డౌన్’ సిద్ధాంతాన్ని ప్రాతిపాదికన చేసుకొని సైప్లెని సమర్థించే ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇది దేశంలో పెట్టుబడిదారుల (అంబానీ, అదానీ) ఆస్తులు పెరగడానికి, పేద ప్రజలు నిరుపేదలు కావడానికి కారణమవుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్.. డిమాండ్ను సమర్థించే ఆర్థిక విధానాలను అమలుచేస్తున్నారు. అంటే పెరిగిన సంపదను, ప్రజలను ‘కేంద్ర బిందువు’గా చేసుకొని పంపిణీ చేసే విధానాలను (సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ వర్గాలకు ఆదాయ పంపిణీ, ఉపాధి కల్పన) అమలు చేశారు. తత్ఫలితంగా దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ దేశ జాతీయ ఉత్పత్తిలో 5 శాతం వాటాను కలిగి ఉన్నది. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అన్నిరంగాల్లో ముందుంటూ దేశానికి ఆదర్శం గా నిలుస్తున్నది. నేడు రూ పాయి విలువ పతనం ఆగాలన్నా, దేశం ఆర్థికసంక్షోభం నుంచి గట్టెక్కాలన్నా కేసీఆర్ ఆర్థిక విధానాలే దేశానికి అవసరం.
పరిష్కారాలు: మన దేశం ఉత్పత్తి, ఉత్పాదన సామర్థ్యాలను వృద్ధి చేసుకోవాలి. తద్వారా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఉపాధి కల్పన పెరగాలి. దేశంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. పరిశ్రమల అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలి. ఎగుమతులు చేసే వస్తుసేవల మీద పన్ను రాయితీ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తాను అనుసరిస్తున్న ఆర్థిక విధానాన్ని మార్చుకోవాలి.
– మెట్టు శ్రీనివాస్
73969 33799
(వ్యాసకర్త: రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్)