అన్నిరకాల రంగాలకు విశ్వవిద్యాలయాలున్న తెలంగాణలో ఇప్పుడు సంస్కృత విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించటం అత్యంత ముదావహం. ఎందరో మహా పండితులకు నిలయమైన ఈ నేలలో మల్లినాథ సూరి వంటి మహాత్ముడు పుట్టిన చోట ఈ విద్యాలయం ఏర్పడటం ఎంతో సబబు. అయితే సనాతన ధర్మానికి పట్టుకొమ్మలా ఉన్న తెలంగాణలో ఈ విశ్వవిద్యాలయం ఇతర విద్యాలయాల లాగ ‘హిందుత్వ, హిందు మతం’ అన్న మతపరమైన పునాది మీద కాకుండా దేవభాష సంస్కృతంలో ఉన్న ఆధ్యాత్మికత, మానవ జీవన విలువలు, సమసమాజ స్థాపన అన్న అంశాల మీద కోర్సులు నిర్మిస్తే వేద ధర్మానికి, ఆ భాషకున్న ఔన్నత్యం విశదీకరించినట్టవుతుంది.
డిప్లొమా, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉండవలసిందే! అయితే సంస్కృతిని ప్రతిబించించే ఇతర అంశాల కోసం ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులు అందిస్తే బాగుంటుంది. నిజానికి తమ అవసరం కోసం బ్రిటిష్ పాలకులు ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన అత్యద్భుత ఆధ్యాత్మిక గ్రంథాలను మతం ముద్ర వేసి హిందూయిజం అనే బల్ల కింద తోసేశారు. దానితో ప్రపంచానికి, ఆ మహత్తర గ్రంథాలకు సంబంధం తెగిపోయింది. ఇంక ఈ దేశంలో ఉండి హిందువులుగా ముద్రపడినవారు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమ విద్యా శిక్షణలో పడి తమ గ్రంథాలను గొప్ప చెప్పుకోవటమే కానీ, వాటిని చదవటం మానేశారు. దాని తో ఆ ఉద్గ్రంథాలన్నీ మూలన పడిపోయాయి. భారతీయులకు వాటన్నింటి పేర్లు కూడా సరిగ్గా తెలియవు. మత ప్రసక్తి లేకుండా కేవలం మానవుల జీవన విధానం, పాటించవలసిన విలువలు, వాటిని ఒక ఆధ్యాత్మిక పునాది మీద ఎలా నిర్మించాలి? అనే అంశాలు, ఆ స్థాయి దాటి పైకి వెళ్లే ఉత్సుకత ఉన్నవారికి దిశానిర్దేశం చేస్తాయి ఆ గ్రంథాలన్నీ. ఒక్కసారి వాటిని స్మరించుకొని, వాటిద్వారా సంస్కృత విశ్వవిద్యాలయం ఎటువంటి కోర్సులు అందించవచ్చో పరిశీలిద్దాం!
1.నాలుగు వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. 2.ఉప నిషత్తులు: 108 ఉన్నాయి. 3.వాల్మీకి రామాయణం: ఈ యుగంలో మొట్టమొదటి చరిత్ర. 4.యోగవాశిష్టము: వశిష్టుడు రామునికి జీవన విధానం గురించి, దాని సార్థకత గురించి వివరించిన గ్రంథం. 5.మహా భారతము: వేద వ్యాసునిచే రచింపబడిన ఇతిహాసం. కురువంశం గురించే కాక వేద ధర్మాలు విశదీకరించిన మహా గ్రంథం. దీనినే పంచమ వేదమంటారు. 6.శ్రీ మహా భాగవతం: వేదవ్యాసుడు రచించిన ఖగోళ శాస్త్ర గ్రంథం. ఇది కేవలం భక్తుల కథామాలిక కాదు. ఆ భక్తుల జీవితంలోంచి నేర్చుకోవలసిన అంశాల సమాహారం. 7. ఇక వీటన్నింటినీ ఆపోశన పట్టి తన రచనల ద్వారా అందించిన జగద్గురు శంకరాచార్య వారి ‘శంకర సాహిత్యం’. 8.యువతకు అద్భుతంగా మార్గదర్శనం చేసే వివేకానందుని రచనలు.
ఈ గ్రంథాలన్నింటిలో మత ప్రబోధనలు, పారాయణలు, వ్రతాలు, నోములు, మూఢభక్తి, భక్తి లేకపోతే ముక్తి లేదనే బెదిరింపులు వంటివి ఎక్కడా కానరావు. కేవలం మానవ జీవితంలోని స్థాయిలు- భౌతిక, మానసిక, భావోద్వేగ, మేధో సామర్థ్య, ఆధ్యాత్మిక అన్నవి ఉంటాయి. వీటన్నింటిని గుర్తించి, గౌరవించి, పెంపొందించుకునే మార్గాలు, సమాజంలో బతికినంతకాలం ఎలా ఉండాలి, ఒంటరిగా జ్ఞానమార్గంలో ఎలా పయనించాలన్న విషయాలు మాత్రమే చెప్పబడ్డాయి. ఇక ఇవి మానవుల కోసం ఎలా ఉపయోగించాలో చూద్దాం.
1.ఒక కార్యసాధకుడికి ఏ లక్షణాలు ఉండాలి. ఏ బలహీనతలను దగ్గరికి రానివ్వకూడదన్న విషయాలు సుందరకాండలో వాల్మీకి అతి చక్కగా వర్ణించారు. అది యువతకు చక్కటి వ్యక్తిత్వ వికాస కోర్సుగా మలచవచ్చు.
2.మహా భారతంలో మానవుల్లోని భావోద్వేగాలన్నీ ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కో ఎమోషన్కి ఉదాహరణగా తీసుకోవచ్చు. వాటి సంయమనం లేకపోతే ఏమవుతుందో సోదాహరణగా వివరింపవచ్చు. ఏ పాత్ర నుంచి ఎంత మంచి గ్రహించాలో, ఎవరిలా ఉండకూడదో తెలిపే అద్భుత గ్రంథం. వేదవ్యాసుడి భారతం- లక్ష శ్లోకాల్లో ఉన్నది- చదవటం అందరికీ కదరదు. కనుక వివిధ అంశాలు- ముఖ్యంగా మానవ విలువలు, ధర్మమార్గం- గురించి వివరిస్తూ, వాటి పర్యవసానాలు విశదీకరిస్తే యువతకు పెడమార్గాలు పట్టే లక్షణాలు తగ్గుతాయి. వంద సంవత్సరాల క్రితం వరకూ ఇంట్లో పెద్దలు మూడు గ్రంథాలు చదివేవారు. లేక పండితుల దగ్గర వినేవారు. సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలని రామాయణం, ప్రపంచంలో ఎటువంటి వ్యక్తులుంటారు వారిని ఎలా అర్థం చేసుకోవాలని భారతం, చివరగా మానవుడు జ్ఞాన మార్గంలోకి ఎలా చేరి పయనించాలని భగవద్గీత తెలిపేవారు. అవి తర్వాతి తరాలకు కూడా చేరేవి. కానీ పాశ్చాత్య నాగరికత ప్రపంచమంతా ప్రబలి ఈ విలువలన్నీ హరించిపోయాయి. వాటిని పునరుద్ధరించాలంటే ఈ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారానే సాధ్యం.
3.యోగ వాశిష్టంలో మానవ జీవన సార్థకత, విలువలు, జీవన విధానం గురించి చాలా తార్కికంగా, అందరినీ ఒప్పించేలాగ వివరింపబడ్డాయి. ఇది నేటి యువతకు చాలా అవసరం.
4.ఉపనిషత్తులన్నీ శాస్త్రీయ విషయాలను వివరిస్తాయి. చదివినందువల్ల, భావాలలో తార్కికత, ప్రవర్తనలో ఆచరణాత్మకత అలవడుతాయి. నేటి యువత కేవలం తమ కంటే వయస్సులో పెద్దవారు చెప్పారు కదా అని ఏదీ నమ్మరు. వారికి ఏ విషయమైనా శాస్త్రబద్ధంగా వివరిస్తాయి ఉపనిషత్తులు. అందులో వీరికి తెలియవలసిన విషయాలు ఒక డిప్లొమా కోర్సు కంటే ఎక్కువ ఉంటాయి. అంతేకాక ప్రకృతి గురించి, ప్రాణుల గురించి ఆధునిక కాలంలో కనుగొనబడిన విషయాలు ఉప నిషత్తులలో చెప్పారు. అవి వివరిస్తే యువతకు నమ్మకం ఏర్పడుతుంది. నేటి ప్రవచకులలో చాలామంది అనుభవంలోకి రాని భక్తి, ముక్తి గురించి మాట్లాడి యువతను ఈ శాస్త్రగ్రంథాలకీ, ఆధ్యాత్మికతకు దూరం చేస్తున్నారు. వీటిపై డిప్లొమా కోర్సులు పెడితే లౌకిక జీవనంలో ఈ గ్రంథాల ఉపయోగం వారికి తెలుస్తుంది.
5.ఇక వ్యాసుడి భాగవతంలో ఖగోళశాస్త్ర అంశాలు, 14 భువనాలు కలిగిన విశ్వం గురించి వివరంగా ఉంది. విలువైన సమాచారాన్ని అర్థం చేయించగలిగితే అది భక్తి పుస్తకం కాదు. శాస్త్ర విజ్ఞాన ఖని అని ప్రపంచానికి తెలుస్తుంది.
6.ఇక వివేకానందుడి భాషణల గురించి ఎక్కువ చెప్పనక్కరలేదు. యువతను సరైన మార్గంలోకి నడిపించే అద్భుతమైనవి ఆయన పలుకులు. జీవితాన్ని అర్థవంతంగా మలచుకోవటానికి ఆయన ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఎంతో ఉపయోగపడుతాయి. వాటిని చక్కటి సంస్కృతంలో, తెలుగులో యువతకు అందించవచ్చు.
సంస్కృత భాషతో పరిచయమున్న వారందరికీ ఒక విషయం బాగా తెలుసు. మానవ జీవితానికి అవసరమయ్యే ప్రతి విషయం ఆ సాహిత్యంలో ఉంది. ఒక్క పంచతంత్రం పిల్లలను ఎంత నీతివంతంగా, ప్రపంచంలో బతుకగలిగిన స్థయిర్యం, లౌక్యం ఇస్తుందో చాలు ఉదహరించటానికి. వీటిని గుర్తించి కేవలం పాఠ్యాంశాలు బట్టీ కొట్టి డిప్లొమా, డిగ్రీలు సంపాదించటమనేది కాకుండా అర్థవంతమైన విద్యనందించాలని సంస్కృత విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రతి ఒక్కరినీ అర్థిస్తున్నాను.
అసలు సంగతేమిటంటే పైన చెప్పిన గ్రంథాలన్నీ ఆధ్యాత్మిక పునాదుల మీద శాస్త్రీయమైన జీవన విధానాన్ని, మానవ విలువలని నేర్పినవి. ఆ జ్ఞానం దూరమైందని గ్రహించాలి. మతపరమైన విషయాలు కాకుండా, ఆ జ్ఞాన గ్రంథాల్లోంచి శాస్ర్తాలు బయటకు తీయాలి. క్రమశిక్షణ, పరుల మీద అభిమానం పెరిగేట్టు యువతను తీర్చిదిద్దాలి. ఈ మంచి విషయాలను కోర్సుల ద్వారా, డిప్లొమాల ద్వారా ప్రపంచ ప్రజలకు అందించాలి. అదీ సంస్కృత విశ్వవిద్యాలయం చేయవలసిన ముఖ్యమైన పని, సేవ!
విద్య అనేది రెండు విధాలుగా అందించాలి. మొదటిది లిబరల్ విద్య. ఇది వ్యక్తిత్వ వికాసానికి, మానవుడు
సంపూర్ణమైన మనిషిగా ఎదగటానికి తప్పనిసరి విధానం. రెండవది ఫార్మల్ విద్య. ఇది ఉపాధిని సంపాదించుకుని తనను, కుటుంబాన్ని పోషించుకోవటానికి పనికివస్తుంది. ప్రస్తుత విద్యా విధానాలన్నీ పొట్టకూటి విద్యలై మొదటిది ఎక్కడా కనిపించటం లేదు. సంస్కృత భాషలో మొదటి పార్శమైన వ్యక్తిత్వ వికాసానికి పెద్దపీట వేయబడింది.
అందుకే ఆ కాలంలో మనిషి మనిషిగా మానవత్వంతో బతికాడు. మరి నేడు?
కనకదుర్గ దంటు: 89772 43484