అతి సామాన్యులే కేంద్రంగా ప్రభుత్వ పథకాలు రూపొందితే అవి వాస్తవ జన జీవిత మార్పునకు బలమైన పునాదులేస్తాయి. ఇలాంటి విధానాలు సామాజిక, ఆర్థిక సమానత్వానికి దారితీస్తాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తున్నది. సమస్త వృత్తులు శారీరక శ్రమ, సౌందర్యాల ప్రతీకలన్నాడో కవి. ప్రపంచీకరణ యుగంలో అలాంటి కులవృత్తులు పతనమయ్యాయి.
కులవృత్తుల గురించి ఏ పాలకులూ పట్టించుకోలేదు. ఆయా వృత్తులపై ఆధారపడి జీవించేవారి గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇదంతా గతం. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేతివృత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి జీవితాలు బాగుగా చేసేందుకు చర్యలకు పూనుకుంటున్నది. వృత్తులకు జీవి పోస్తామనే స‘లక్ష’ణమైన నిర్ణయం తీసుకున్నది. కులవృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయల సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల వృత్తులపై ఆధారపడ్డ వారి జీవితాలు ఎట్లా ఉన్నయనే విషయం మాత్రమే కాదు, యావత్ దేశంలో వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నవారికి పరోక్షంగా గైడ్గా కూడా తెలంగాణ ప్రభుత్వ ఆచరణ ఉండబోతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.
వృత్తుల గురించిన అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించటం చారిత్రకంగా ఓ ముందడుగు. చేపలు పట్టేవాళ్లు. నేత కార్మికులు, రాళ్లు కొట్టుకునే వారు, ఆ రాళ్లతో నిర్మాణాలు చేసేవారు, పండ్లు ఫలాలను గుత్తకు తీసుకుని బతికేవాళ్లు.. ఇట్లా చెప్పుకొంటూపోతే చాలానే ఉ న్నాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, వండ్రంగి, స్వర్ణకార, మేదర, బెస్త, బుడబుక్కల, ఉప్పర, వడ్డెర ఇలా ఎన్నో వృత్తులు ఇప్పటికే సమూలంగా ధ్వంసమయ్యాయి. ఆయా వృత్తులపై ఆధారపడి బతికేవాళ్లు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం వృత్తిజీవుల కోసం ఇప్పటికే మంచి నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తున్నది. మత్స్యకారులు, గొర్రెల, మేకల పెంపకం దార్లకు ప్రోత్సాహకాలు. తాజాగా దళితబంధు పథకం.. ఇవన్నీ కొన్ని వృత్తులపై ఆధారపడి జీవనం సాగించిన వాళ్లకు ఎంతో మేలు చేసే నిర్ణయాలు. సామాజిక నిచ్చెన మెట్ల వంటి కులవ్యవస్థలో వెనుకబడిన తరగతుల గురించి పట్టింపు తెలంగాణ ప్రభుత్వానికి ఎంతగా ఉందో దీని ద్వారా స్పష్టమవుతున్నది.
బీసీల పట్ల, వృత్తిజీవుల పట్ల బీఆర్ఎస్కు మిగతా పార్టీల కంటే ఎక్కువ స్పష్టత ఉంది. అందుకే ఎవ్వరూ డిమాండ్ చేయకున్నా అనేక పథకాలు అమలు చేస్తున్నది. తెలంగాణలో చెరువు, దానిచుట్టూ వృత్తులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి తొలి దశలోనే తెలంగాణ ప్రభుత్వం చెరువులను మరమ్మతు చేసింది. దాంతోపాటుగా వ్యవసాయాన్ని గాడి లో పెట్టింది. దానివెనుక కరెంట్, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగనున్న ఈ శుభవేళ వెనుకబడిన జాతుల అభివృద్ధి కోసం, వారి కులవృత్తులకు సాయం అం దించడానికి సరికొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వారిలో కొత్త ఉత్సాహానన్ని తెచ్చింది. ఫలితంగా గ్రామాల్లో కులవృత్తులు కూలకుండా సజీవంగా ఉండి భావితరాలకు వాటి విలువలను చాటి చెప్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఆస్కాని మారుతీసాగర్: 90107 56666
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)