బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేసి చెప్పినా ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, శ్రీధర్బాబు, మహేశ్వర్రెడ్డి, జగ్గారెడ్డి తదితరులంతా ఏవేవో సాకులు చెప్పి డుమ్మాకొట్టారు. ‘ఖర్గే చెప్పినా వినరా?’ అని సీనియర్ నాయకుడొకరు డుమ్మా కొట్టిన నేతలకు ఫోన్చేసి అడిగితే, వరంగల్ సభలో పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని రాహుల్గాంధీ హెచ్చరించినా పట్టించుకోలేదు, అలాంటప్పుడు ఖర్గే చెప్తే వినేవాళ్లు ఎవరున్నారు? అని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చాలని ఈ మధ్య కాలంలో ఆ పార్టీ నేతలు ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. అయినప్పటికీ ఎన్నికల వరకు బండి సంజయే కొనసాగుతారని, అతడిని మార్చే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్చుగ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ఎవరూ అడుగకపోయినా పనిగట్టుకొని ప్రకటించారు. వీరిద్దరి ప్రకటనల వెనుక ఆంతర్యమేమిటని ఆరా తీస్తే, ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు కేంద్రమంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు. ఈ లెక్కన తెలంగాణ నుంచి కూడా ఒకరికి చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆ రేసు నుంచి బండిని తప్పించేందుకే పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతారని పరోక్షంగా హింట్ ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ పాదయాత్రలు చేస్తామంటే, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని సాధారణంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమేమంటే, పోలీసులు పర్మిషన్ ఇచ్చినా పార్టీ నేతల పర్మిషన్ దొరకడం కష్టమే. ఈ నెల 26 నుంచి జూన్ 2 వరకు పాదయాత్ర చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించగానే, ‘నో పర్మిషన్’ అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరికి వారు పాదయాత్రలు చేస్తామంటే ఇక మేం ఉన్నది ఎందుకు? అని ప్రశ్నించారు. పార్టీ నాయకులు హోం గార్డులు, అధ్యక్షుడు ఒక్కరే ఎస్పీలాంటోడు అని రేవంత్రెడ్డి గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్వర్రెడ్డి రూలింగ్తో టీపీసీసీ అధ్యక్షుడు కూడా హోంగార్డేనని తేలిపోయిందంటున్నారు.
– వెల్జాల