ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పతాక శీర్షికగా మారింది. శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న మహానగరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి విశ్వవిఖ్యాత ఐటీ కంపెనీల నుంచి కొత్తతరం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కంపెనీల వరకూ ఎన్నెన్నో రంగాల పరిశ్రమలకు వేదికగా నిలుస్తున్నది. నలు దిశలా నగరం విస్తరిస్తున్నది. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్రమైన అభివృద్ధి వ్యూహమే దీనికి కారణం. రోడ్లు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల నుంచి పార్కుల అభివృద్ధి వంటి సుందరీకరణ పనుల వరకూ ప్రణాళికబద్ధంగా జరుగుతున్న కృషి నేడు ఫలితాలను ఇస్తున్నది.
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ను గొప్పగా అభివృద్ధి చేశామని ఊదరగొట్టుకున్న వారి హయాంలో, నగరంలో ఉన్న ఫ్లైఓవర్లు ఏడు మాత్రమే. దానికే బాకా మీడియా హైదరాబాద్ను ఫ్లైఓవర్ల సిటీగా మార్చేశారంటూ వారిని ఆకాశానికి ఎత్తేసేది. నేడు వాటి సంఖ్య 37కి పెరిగింది. కేవలం 8 ఏండ్లలో 30 నిర్మితం కాగా.. మంత్రి కేటీఆర్ కూకట్పల్లిలో ప్రారంభించిన కైత్లాపూర్ ‘రోడ్ ఓవర్ బ్రిడ్జ్’ తాజా ఫ్లైఓవర్. మరికొన్ని నెలల్లో మరో 17 పూర్తికానున్నాయి. ఇదీ స్వపరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి తీరు, వేగం. వాహనదారుల కోసమే కాదు, పాదచారుల కోసం ప్రభుత్వం.. ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి 40 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మిస్తున్నది. రైల్వే క్రాసింగ్ల వద్ద ఏండ్లుగా కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజల వెతలను తీర్చేలా చర్యలు చేపట్టింది. అనేక చెరువులను కబ్జాల నుంచి రక్షించేలా ఫెన్సింగ్ వంటి పకడ్బందీ ఏర్పాట్లు చేయటమేగాక వాటిని అం దంగా తీర్చిదిద్దింది. పచ్చదనం పెంపుదలలో హైదరాబాద్ నగరాన్ని దేశంలోని మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిపింది ప్రభుత్వం. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు గత రెండేండ్లుగా వరుసగా మన నగరానికి అందించిన ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ పురస్కారమే దీనికి నిదర్శనం. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచటంలో భాగంగా రోడ్ల పక్కన ఉండే గోడలనే కాన్వాస్లుగా మార్చారు. పలు చౌరస్తాల వద్ద, రింగ్రోడ్డు పొడవునా, ఫ్లైఓవర్ల పైనా గోడలకు కళాకారుల అందమైన చిత్రాలతో సొబగులద్దుతున్నారు.
ఐటీ రంగాన్ని హైటెక్ సిటీకే పరిమితం చేయకుండా.. నగరం నలువైపులా విస్తరింపజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఏండ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఓల్డ్ సిటీలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసింది. దీంతో పాతనగరానికి కొత్త అందాలు సమకూరాయి. శతాబ్దాలుగా గంగా జమునా తెహజీబ్ సుసంపన్న సంస్కృతికి క్షేత్రంగా ఉన్న నగరం ఆ వారసత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూ అంతర్జాతీయ నగరంగా అడుగులు వేస్తున్నది. కేంద్రంలోని పాలకపార్టీ రాజకీయాల కారణంగా దేశమంతటా మతవైషమ్యాలు పెచ్చరిల్లుతున్నా నగరం.. అన్ని మతాలకు, ప్రాంతాలకు ఆదెరువుగా నిలుస్తున్నది. ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య వారధిగా కొనసాగుతున్నది. తెలంగాణ విజయకేతనం హైదరాబాద్.