హైదరాబాద్ విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నది. కార్పొరేట్ పరిశ్రమలకు, డేటా సెంటర్ల భద్రతకు స్వర్గధామంగా నిలుస్తున్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతిభద్రతలు, మెట్రో రైలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, స్కై వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడం వల్లే ఇదంతా సాధ్యపడింది. ఒకప్పుడు హైదరాబాద్లో ప్రయాణమంటే నరకంలా భావించిన వాహనదారులు.. ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఒక నిమిషం కూడా ఆగకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు!
హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పూర్తిచేస్తున్నది. పెరుగుతున్న ట్రాఫి క్ కష్టాలను నిరోధించేందుకు వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకానికి (ఎస్ఆర్డీపీ) శ్రీకారం చుట్టిం ది. మొదటి దశలో రూ.8,092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జి లు, ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అందులో రూ.3,748.85 కోట్లతో 31 చోట్ల ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
400 ఏండ్ల చారిత్రక నగరమైన హైదరాబాద్లో రహదారులపై ఫ్లై ఓవర్లు, కారిడార్లు, అండర్పాస్ల నిర్మాణం చేపట్టడం అంత సులభం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తూ పనులు పూర్తి చేస్తున్నది. మొదటి దశలో దాదాపు రూ.3 వేల కోట్లతో ఈస్ట్ జోన్లోని ఎల్బీనగర్ కారిడార్, వెస్ట్ జోన్లోని మైండ్ స్పేస్ కారిడార్లో నాలుగు అండర్ పాస్లు, 16 ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్గ్రౌండ్ రోడ్డు వేస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు నడుస్తున్నాయి. రెండో దశలో దాదాపు రూ.3 వేల కోట్లతో ఏడు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు తప్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మీదుగా ఓఆర్ఆర్ వెళ్లేందుకు ఎంతో అనువైన శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ వల్ల జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐకియా మీదుగా నేరుగా ఓఆర్ఆర్కు, అక్కడినుంచి శంషాబాద్ విమానాశ్రయానికి సులభంగా చేరుకోవచ్చు. దీనిద్వారా గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలు తప్పాయి. హైటెక్ సిటీ, హెచ్కేసీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల మధ్య మంచి కనెక్టివిటీతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు (పంజాగుట్ట), ఔటర్ రింగ్ రోడ్డుకు (గచ్చిబౌలి) కూడా ఇది మంచి కనెక్టివిటీగా మారింది.
గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.263 కోట్ల అంచనా వ్యయంతో 3 కిలో మీటర్ల పొడవు గల కొత్తగూడ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లై ఓవర్లో 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్పాస్ను కూడా నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ వల్ల బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుంచి సాఫీగా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు మియాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలను ఈ ఫ్లై ఓవర్ కలుపుతుంది. ఫ్లై ఓవర్ వల్ల బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో 100 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవడమే కాకుండా, కొండాపూర్ జంక్షన్లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.
దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ఓ లాండ్ మార్క్ను సృష్టించిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు మీర్ ఆలం ట్యాంక్ మీద రెండో కేబుల్ వంతెనను త్వరలో నిర్మించబోతున్నది. ఈ వంతెనను 2.5 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో వేయనున్నట్లు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డీ-మార్ట్-గురుద్వారా-కిషన్బాగ్-బహదూర్పురా క్రాస్రోడ్స్ మార్గంలో భాగంగా ఈ వంతెన బెంగళూరు జాతీ య రహదారిని, అత్తాపూర్ సమీపంలోని చింతల్మెట్తో కలుపుతుంది. ఈ బ్రిడ్జితో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా కొత్తగా ఎయిర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ను నిర్మించతలపెట్టారు సీఎం కేసీఆర్. అతి తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునేలా మెట్రో ప్రాజెక్ట్ను రూపొందించనున్నారు. ఐటీ హబ్గా గుర్తింపు ఉన్న గచ్చిబౌలి, మాదాపూర్, కొం డాపూర్, మైండ్ స్పేస్ టెక్నాలజీ పార్క్లకు రాకపోకలు సాగించడానికి వీలుగా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 60 ఏండ్ల ఉమ్మడి పాలనలో ఆంధ్రా పాలకులు ఒక్క హైటెక్ సిటీ, నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మించి హైదరాబాద్ను అభివృద్ధి చేశామని ఇప్పటికీ జబ్బలు చరుచుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన ఎనిమిదేండ్లలోనే కేసీఆర్ సర్కారు ఇన్ని అభివృద్ధి పనులతో హైదరాబాద్కు విశ్వనగర ఖ్యాతిని తెచ్చింది. మరి దీన్ని ఏమంటారు? సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ మెట్రో సిటీగా అవతరించబోతున్నది. సగటు తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరూ దీనికి గర్వపడాలి.
(వ్యాసకర్త : జీహెచ్ఎంసీ ఏరియా కమిటీ సభ్యులు, కొండాపూర్ డివిజన్)
తాడెం మహేందర్: 95505 47639