చరిత్ర ఒకోసారి నమ్మలేని చిత్రాలను చేస్తుంటుంది. అయితే అందుకు తగిన కారణాలుంటాయి. అటువంటిదే ఒకటి ప్రస్తుతం తెలుగు భూమిలో మన కళ్లెదుట జరుగుతున్నది. సీమాంధ్రకు చెందిన పాలక వర్గాల వల్ల తనకు అన్యాయం జరుగుతున్నదని ఉద్యమించిన తెలంగాణ 2014లో విడిపోయింది. ఇపుడు ఎనిమిదేండ్లు గడిచేసరికి అదే సీమాంధ్రకు చెందిన ప్రజలు, అవే పాలక వర్గాల వల్ల తమకు సైతం న్యాయం జరగటం లేదంటూ, తెలంగాణ ఉద్యమ నాయకత్వంతో చేతులు కలిపి, తమ రాష్ట్రంతో పాటు మొత్తం దేశం కోసం ఉమ్మడిగా ఉద్యమించేందుకు ముందుకొస్తున్నారు. ఇది ఎంత చిత్రమైన చారిత్రక పరిణామమో అందుకు కారణాలు అంత సహేతుకమైనవి.
తెలంగాణకు పరిమితంగా ఉండిన దార్శనికతను, అభివృద్ధి- సంక్షేమ లక్ష్యాలను కేసీఆర్ ఎప్పుడైతే దేశవ్యాప్తం చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మా ర్చారో, అప్పుడే రెండు తెలుగు రాష్ర్టాల మధ్య భౌగోళిక సరిహద్దు మిగిలి ఉన్నా సైద్ధాంతిక సరిహద్దులు, తాత్విక సరిహద్దులు చెరిగి పోయాయి. రెండు రాష్ర్టాల ప్రజల అభివృద్ధి-సంక్షేమాల ఆలోచనలు, ఆకాంక్షలు ఒకటయ్యాయి. మొత్తం దేశ ప్రజలు ఇవే ఆలోచనల పరిధిలోకి రావాలన్న లక్ష్యంలో ఇది తొలి అడుగు అవుతున్నది. అటువంటి తొలి అడుగు, మొదటి బీఆర్ఎస్ శాఖ రూపంలో సోదర తెలుగు రాష్ట్రంతో మొదలవుతుండటం ఒక మంచి పరిణామమని చెప్పాలి.
ఇటువంటి పరిణామాన్ని బీఆర్ఎస్ స్థాపన జరిగిన సమయంలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. బీఆర్ఎస్ శాఖల ఏర్పాటు ఆలోచనలు ఆ తొలినాళ్లలో కర్ణాటక, మహారాష్ట్రల చుట్టూ తిరిగి వినిపించాయి. కానీ, వివిధ సానుకూల పరిస్థితులు చరిత్ర పొరలలో నుంచీ, వర్తమాన పరిణామాల తెరల వెనుక నుంచీ తోసుకురాగా, రెండు తెలుగు రాష్ర్టాల ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు సాధారణమైన చూపులకు అందని విధంగా అనూహ్యంగా, వేగంగా ఒక్కటయ్యాయి. ఈ విధమైన చరిత్ర, వర్తమానాల ప్రోద్బలంతో బీఆర్ఎస్ తొలి శాఖ సోదర తెలుగు రాష్ట్రంలో ఏర్పడింది. ఇది సోదర రాష్ర్టాల ప్రజలు తమ చరిత్రకు తాము సహజ న్యాయం చేయటమవుతున్నది.
ఇక్కడ ఉపయోగించిన రెండు కీలకమైన మాటల గురించి కొంత వివరణ అవసరం కావచ్చు. అవి, వివిధ సానుకూల పరిస్థితులు చరిత్ర పొరలలో నుంచీ, వర్తమాన పరిణామాల తెరల వెనుక నుంచీ తోసుకురావటం అన్నవి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అవి ఈ విధంగా ఉన్నాయి. ఉభయులూ స్థూలంగా ఒకే భాషా సంస్కృతులు, చరిత్రవారై, కొన్ని సమస్యలున్నా చిరకాలం కలిసి ఉండటమన్నవి చరిత్ర పొరలలోని విషయాలు. ఎంతోకాలం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగినా తెలంగాణలోని ఆంధ్రులతో సామరస్యం, సహజీవనం భంగపడకపోవటం, మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత కూడా అవి కొనసాగటం, కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ శరవేగంతో అభివృద్ధి చెందుతున్నదనే భావన రెండు రాష్ర్టాలలోని ఆంధ్రులలో బాగా వ్యాపించటం, ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీల పట్ల, పరిపాలన పట్ల అసంతృప్తి పెరుగుతుండటం, అభివృద్ధి, శాంతి సామరస్యాలు లేవనే చింత, కేంద్రంలోని అధికార పార్టీ వల్ల, దాని పాలన వల్ల తమ రాష్ర్టానికి, సమాజానికి, మొత్తంగా దేశానికి, రాజ్యాంగానికి ఎంతెంత హాని సంభవిస్తున్నా తమ వద్ద అన్ని పార్టీల నాయకత్వాలు స్వప్రయోజనాల కోసం మిన్నకుండటం మినహా కనీసం గట్టిగా మాట్లాడలేకపోవటం, అదే సమయంలో కేసీఆర్ దృఢంగా నిలబడి ప్రతిఘటించడం, ఎటువంటి వత్తిళ్లకు వెరవకపోవటం అన్నవి వర్తమాన పరిణామాల తెరల వెనుక నుంచి తోసుకువస్తున్న విషయాలు. ఈ రెండు విధాలైన వాటికి కొనసాగింపుగా ఇప్పుడు కేసీఆర్ రెండు తెలుగు రాష్ర్టాల పరిధులను అధిగమించి యావద్దేశం కోసం జాతీయ స్థాయిలో నిలిచేందుకు ముందుకు వస్తున్నారు.
వాస్తవానికి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు సీమాంధ్ర ప్రాంత నాయకత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ కోసం రెండు దశల ఉద్యమాలు గాని, 2014 గాని వచ్చి ఉండేవి కావు. ఈ చేదు నిజాన్ని అందుకు బాధ్యులైన సీమాంధ్ర రాజకీయ నాయకులు, ధనిక వర్గాలు బయటకు ఒప్పుకోకపోయినా, ఉద్యమ కాలంలో సామాన్య ప్రజలు కూడా కొన్ని అపోహలకు గురైనా, తర్వాత ఎక్కువ సమయం గడవకుండానే ప్రజలలో వాస్తవాల గుర్తింపు మొదలైంది. ఇంతవరకు చర్చించిన అన్ని పరిస్థితులు, పరిణామాల వెరశి ఫలితమే మొదట పేర్కొన్నట్లుగా చరిత్ర చేస్తున్న చిత్రం. ఇది అనూహ్యం, ఒక విధంగా ఆశ్చర్యకరం కావచ్చుగాని దేశ కాల పరిస్థితులను బట్టి చూసినపుడు, సామాన్య ప్రజల దృక్కోణం నుంచి పూర్తిగా తర్కబద్ధమే. ఇందులో చారిత్రక తర్కం, వర్తమాన తర్కం రెండూ ఉన్నాయి. ఆ తర్కాల బలమే ఈ ప్రయత్నాన్ని గెలిపించగలదు. రెండు రాష్ర్టాల సామాన్యులను చేయి చేయి కలిపి నడిపించగలదు.
బీఆర్ఎస్కు సంబంధించి ఇటువంటి తర్కమే దేశం మొత్తంలోని సామాన్యులు అందరికీ వర్తిస్తుంది. ఇది సూత్రరీత్యా అంటున్న మాట. అది వాస్తవరూపం తీసుకునేందుకు కార్య దీక్ష అవసరమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకోసం ఇప్పటికే శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సఫలుడు కావటం దేశానికి ఒక అవసరంగా మారింది.
– టంకశాల అశోక్