కొత్త తెలంగాణ చరిత్ర బృందం సాగించిన చరిత్ర యాత్రలలో చేసిన పరిశీలనలు, పరిశోధనలను చరిత్రలోని దశల ఆధారంగా, విషయం వారీగా సంక్షిప్తంగా తెలిపే ప్రయత్నం ఇది. తెలంగాణ చరిత్ర మరుగున పడ్డది. కొందరి మరుపున పడ్డది. ఎవరినీ నిందించే పనిలేదు. కానీ, తెలంగాణ చరిత్ర నిర్లక్ష్యం చేయబడ్డది. ఉపేక్ష వహించిన బాధ్యుల కారణంగా చాలా ఆలస్యంగా తెలంగాణ చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఎంతోమంది Pride of History కోరుకోవచ్చు. కాని, దానిని Proud of Historyగా తమదని చెప్పుకొనే ఒరవడిలో ఇతర చరిత్రల పట్ల ఉదాసీనత చూపడమో, దాచేయడమో తగని పని. చరిత్ర ‘దాచేస్తే దాగని సత్యం’.
తెలంగాణ చరిత్ర పట్ల ఇష్టం, గౌరవాలతో చరిత్రకారులు, ఔత్సాహికులు సంఘటితంగా, సామూహికంగా చరిత్ర అన్వేషణలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న సంస్థ ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’. పిడికెడు మందితో మొదలై శతాధిక సభ్యులతో కొత్త తెలంగాణ చరిత్రను అన్వేషిస్తున్నది. గడిచిన 25 సంవత్సరాలలో చరిత్ర బృందం చేసిన క్షేత్ర పరిశీలనలు, పరిశోధనలు విలువైనవి. తెలంగాణ చరిత్రకు కొత్త పేజీలు చేర్చిన శోధనలు. చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన ఎన్నో అన్వేషణలు చేసింది చరిత్ర బృందం. తెలంగాణలో చరిత్రకు ఆదరువులైన కపిలాయి గుహ (కొమరంభీం జిల్లా), మైలారం గుహలు (ములుగు జిల్లా), గాజుబేడం గుహలను (నల్గొండ జిల్లా) కొత్తగా గుర్తించింది.
తొలిసారిగా రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరున్నర కోట్ల ఏండ్ల కిందటి లావా స్తంభాలనే కాలామ్నార్ బసాలట్స్ని, నత్తగుల్లల, డైనోసార్ల, చెట్ల, ఆకుల శిలాజాలను వెలుగులోకి తెచ్చింది. జైపూర్లో సమ్మక్కగా పూజిస్తున్న జంతు ఉరఃపంజర శిలాజాన్ని బయటపెట్టింది. రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తించిన 18 రాతి చిత్రాల తావులకు 50 రాతి చిత్రాల తావులను చేర్చింది ఈ చరిత్ర బృందం. వీటిలో మధ్య రాతియుగాల నుంచి చారిత్రక యుగాల దాకా వివిధ కాలాల వైవిధ్యభరితమైన పురా సాంస్కృతిక చిత్రాలున్నాయి. రాతి చిత్రాలున్న తావులలో మధ్యరాతియుగాల నాటి సూక్ష్మరాతి పనిముట్లు విరివిగా లభించాయి. రాతి చిత్రాలను తావులవారీగా విశ్లేషించి ప్రకటించడమే కాకుండా, రాతి చిత్రాలను గీయడంలో వాడే పదార్థాలను గుర్తించడానికి రామన్ స్పెక్ట్రామీటర్ను మొదటిసారిగా వాడింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం. రాతి చిత్రాలను గీయడానికి ఇనుప ఖనిజమైన హెమటైట్ వాడినట్టు గుర్తించి, పూనాలో రాశి జాతీయ రాతిచిత్రాల సదస్సులో పత్రసమర్పణ చేయడమైనది. తెలంగాణ రాతి చిత్రాలలో నెమళ్లు, తెలంగాణ రాతి చిత్రాలలో అమ్మ దేవతలు, లిపుల గుర్తింపు. రాతి చిత్రాలలో అంతర చిత్రాల చిత్రణ. రాతి చిత్రాలలో పెద్ద పులులు, ఏనుగులు, అడవి దున్నలు, ఇఱ్ఱులు, సంభోగ చిత్రాలు, మూపురపుటెద్దులు, యుద్ధరంగంలో రథాలు, ఎద్దుల బండి, తేళ్లు, స్వస్తిక్, చేపలు, వేటగాళ్లు, ఆయుధాలు… రాతిచిత్రాల తావులను తులనాత్మకంగా పరిశోధించింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెదరాతియుగపు సమాధులను వేల సంఖ్యలో గుర్తించింది. 72 అడుగుల అతిపెద్ద బంతిరాళ్ల సమాధిని నల్లగొండ జిల్లా ఎర్రగడ్డలగూడెంలో గుర్తించింది. భద్రాచలం ప్రాంతంలో కొరియాకు సరితూగే మెగాలిథ్స్ని గుర్తించింది. ప్రాక్చారిత్రక కాలానికి సంబంధించిన అమ్మదేవతలను పుల్లూరులో, సోమారంలో, సింగరాయకొండలో గుర్తించింది. ఇవి మరెక్కడా లభించనివి. నంగునూరులో కొత్త రాతియుగానికి చెందిన బంకమట్టి ఎద్దు తల, ఆకునూరు, నర్మెట, చేర్యాల, కొండపాకలో టెర్రకోట బొమ్మలు, గాజు పూసలు, మట్టి పూసలు, ఎముక పాచిక, రాతి పనిముట్లు సేకరించింది. వీటిలో నగ్నకబంధ వంటి అమ్మదేవత శిల్పాలు, ఆంత్రోపోమార్ఫిక్ మెన్హర్లు, ఒక అడుగు ఎత్తున్న రాతికడ్డి అమ్మదేవత, మూడంగుళాల మట్టి అమ్మ బొమ్మలున్నాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శాతవాహన పూర్వయుగం నుంచి అసఫ్జాహీల దాక వివిధకాలాల రాజవంశాల నాణేలను సేకరించారు. వాటిమీద పత్ర సమర్పణలు చేశారు. చారిత్రక యుగానికి సంబంధించిన కొత్త చారిత్రక విశేషాలను గుర్తించి, వెలుగులోకి తెచ్చింది చరిత్ర బృందం.
కోటి లింగాలలో శాతవాహన పూర్వయుగ కాలపు ఐదక్షరాల శాసనం, మొక్కట్రావుపేట మునులగుట్ట మీద రెండు బ్రాహ్మీలిపి శాసనాలు వెలుగులోకి తెచ్చింది. విష్ణుకుండినుల కాలం 2వ మాధవవర్మ రెండవ రాజధాని కీసరగుట్టలో తొలి తెలుగు శాసనం ‘తొలుచువాన్డ్రు’ మీద ఒక పుస్తకం వేసింది. పాత మహబూబునగర్ జిల్లాలోని కృష్ణా నదీపరీవాహక ప్రదేశాలలో దేవాలయాలలోని ప్రతిమలను, వాటి కాలాలను నిర్ధారించి ప్రకటించింది. రాష్ట్రకూటుల కాలపు కొలనుపాక పాలకుడు శంకరగండరస కాలాన్ని నిర్ధారించే ఆమనగల్లు శాసనాన్ని వెలుగులోకి తెచ్చింది. వెల్మజాలలో కొత్త శాసనాన్ని పరిష్కరించింది. కళ్యాణీ చాళుక్యుల కాలానికి సంబంధించిన వందకు మించి దేవాలయాలను, వాటిలోని శిల్పాలను ప్రతిమాలక్షణ సహితంగా గుర్తించింది. కొత్త బౌద్ధ, జైన, కాలాముఖ, శిల్పాలను గుర్తించింది. శ్రీ ఉత్పత్తి పిడుగు, కంకాళధారి శాసనాలను సేకరించి, పత్రరచన చేసింది. కాకతీయులకు ఆ పేరెట్లా వచ్చిందో, కాకతి దేవత ఎవరో పరిశోధనాత్మకంగా నిరూపించింది. రుద్రమ మరణాన్ని నిర్ధారించే మూడవ శాసనాన్ని పరిష్కరించింది. తొలిసారిగా తెలంగాణ దేశం అని పేర్కొన్న శ్రీరంగం తామ్రశాసనం గురించి వెల్లడి చేసింది. కుతుబ్షాహీల కాలపు ఏదులాబాద్, వల్మిడి, నాగర్కర్నూలు శాసనాలను పరిష్కరించి, ప్రకటించింది. 93 కొత్త శాసనాలను సమకూర్చి కొత్త తెలంగాణ శాసనాలుగా ప్రచురించింది.
(కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరపున)
– శ్రీరామోజు హరగోపాల్