భారత ఉపఖండ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. రెండు వేల ఏండ్లలో ఎప్పుడూ ఒక వందేండ్లు కూడా ఉత్తర భారతానికి దాసోహం అనలేదు. దాదాపు రెండు వేల ఏండ్ల ముందు మౌర్యులు, ఆ తర్వాత కొంతకాలం శుంగుల ప్రభావం ఉందేమో కానీ ఆ తర్వాత అంటే గత రెండు వేల ఏండ్లలో, 1310 నుండి ఒక 40 ఏండ్లు, మళ్లీ చివరి కుతుబ్షాహీ సుల్తాన్ అబుల్ హసన్ తానాషా తర్వాత మొఘలుల ప్రత్యక్ష పాలనలో దాదాపు 40 ఏండ్లు మాత్రమే ఉంది. మిగతా కాలమంతా స్వతంత్ర రాజ్యాలు, లేక సామ్రాజ్యాలు. అదీకాకపోతే అసఫ్జాహీల లాగా అప్రకటిత స్వతంత్ర రాజ్యంలా తెలంగాణ ప్రాంతం ఉండేది.
12వ శతాబ్దం మధ్య కాలంలో కళ్యాణి చాళుక్యుల ప్రభావం తగ్గడం లేక పూర్తి పతనం తర్వాత వింధ్యకు కింద వెలిసిన మూడు రాజ్యాలు – ఒకటి, తెలంగాణలో ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ రాజ్యం. రెండోది, మహారాష్ట్రలో దేవగిరి (ఇప్పటి దౌలతాబాద్) రాజధానిగా యాదవ రాజ్యం (సేవున రాజ్యం). మూడవది, కర్ణాటకలో ద్వార సముద్రం (ఇప్పటి హళేబీడు) కేంద్రంగా వెలిసిన హోయసల రాజ్యం. మధ్యయుగాల్లో ఎదుగుతున్న ఈ వంశాల రాజకీయ నేపథ్యం ఏమిటంటే, అప్పటికే ఉన్న రాజ్యాలకు సామంతులుగా లేక సైనిక అధికారులుగా ఉండడం. వీరి ఆర్థిక, సామాజిక నేపథ్యం.. పశుపాలన, వ్యయసాయం వంటి శూద్ర వర్ణ వృత్తులే.
కాకతీయ వంశ పాలన రెండు దశలలో కొనసాగింది. మొదటిది అధికారులుగా, సామంతులుగా ఉంటూ చిన్న ప్రాంతాల్ని పాలించిన తొలి కాకతీయ కాలం. రెండోది, కళ్యాణి చాళుక్య సామంతులు అనే పరిమితిని తెంచుకుని స్వతంత్ర సామ్రాజ్యంగా రుద్రదేవుడి నుంచి రెండవ ప్రతాపరుద్రుడి వరకు ఉన్న కాకతీయ సామ్రాజ్య కాలం. చరిత్రలో అన్ని రాజవంశాలలాగే కాకతీయులది కూడా సాధారణ నేపథ్యమే. అట్లానే అన్ని వంశాలూ రాజరికాన్ని చేపట్టిన తర్వాత తమ మూలాల్ని గొప్పవిగా (మహిమాన్వితం) చేసి చెప్పుకోవడం ద్వారా తమ పాలనకు పవిత్రతను (sanctity), సాధికారతను సాధించుకున్నట్టే కాకతీయుల వంశంలోనూ జరిగింది.
తొలి కాకతీయుల కథ: కాకతీయుల తొలినాళ్ళ చరిత్రలో ఉండే ప్రశ్నలు- మొదటిది జన్మస్థలం, రెండోది వంశం మూలాలు, మూడోది వారి ప్రస్థానం ఎలా మొదలైందనేది. వీరు మొదట రాష్ట్రకూటులకు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులు అనే విషయం శాసనాల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది. వీరి వంశ మూలాల్ని తెలిపే శాసనాల్లో ముఖ్యమైనవి బయ్యారం శాసనం, పాకాల శాసనం, మాంగల్లు శాసనాలు.
బయ్యారం శాసనం: శాతవాహన, ఇక్ష్వాకు వంశాల చరిత్రను వారి రాచరిక స్త్రీలు జారీ చేసిన శాసనాల ద్వారా తెలుసుకుంటున్నట్టే, తెలంగాణ చరిత్రను రికార్డు చేయడానికి కాకతీయ వంశ స్త్రీల శాసనాలు దోహదం చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం చెరువు పక్కన ఉన్న ఒక శాసనం కాకతీయ వంశావళిని అందిస్తున్నది. చెరువును తవ్వించడం సప్త సంతానంలో ఒకటన్న విశ్వాసం కాకతీయుల కాలంలో ఉన్నందున గణపతిదేవుని సోదరి మైలాంబ ఒక పెద్ద చెరువును తవ్వించి దానికి ధర్మకీర్తి-తటాకం అని పేరు పెట్టి ఒక శాసనం వేయించింది. 1965లో వెలుగులోకి వచ్చిన ఈ శాసనంలో గణపతిదేవుడి ముందు ఉన్న 12 మంది పూర్వీకుల పేర్లున్నాయి. ఈ వంశ మూల పురుషుడు దుర్జయుడని, ఆ దుర్జయ వంశంలో పుట్టిన వాళ్లలో వెన్న, మొదటి గుండ, రెండవ గుండ, మూడవ గుండ, ఎర్ర, పిండిగుండ, గరుడాంక బేత, మొదటి ప్రోల, త్రిభువనమల్ల, రెండవ ప్రోల, రుద్రదేవ, మహదేవల పేర్లు తెలుస్తున్నాయి. ఈ శాసనం మొదటివాడైన వెన్న తర్వాత వచ్చిన ముగ్గురు గుండనలు పరశురామ, దశరథరామ, బలరామలాగా పరాక్రమవంతులని వర్ణించి, ఈ వంశం గొప్పదని చెపుతుంది.
రాముడూ, కరికాల చోళుడు: వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు పక్కన గణపతిదేవుడి కాలంలో వేయించిన శాసనం కాకతీయుల మూలాల్ని పౌరాణిక కల్పనకు జోడించింది. 1956లో ఆర్కియాలజీ శాఖ డైరెక్టర్ పి.శ్రీనివాసాచార్ పరిష్కరించిన ఈ శాసనంలో కాకతీయుల వంశం రాముడి వంశమైన ఇక్ష్వాకుల నుంచి మొదలైనట్టు ఉంది. గణపతిదేవుడి మంత్రి కొడుకైన జగదాల ముమ్మడి పాకాల చెరువును తవ్వించి, ఈ శాసనాన్ని జారీ చేశాడు. ఈ శాసనంలో ఇక్ష్వాకు, మాంధాత్రి, సగర, భగీరథ, దశరథ, రామ, కలికాలచోళ (కరికాల చోళ) ఆ తర్వాత దుర్జయ- ఇలా ఒక కాల్పనిక వంశావళి కనిపిస్తుంది. రాముడి వంటి పౌరాణిక పురుషుడి వంశంతో కలిపి కాకతీయ వంశానికి మహత్తును ఆపాదించడం కోసం ఈ శాసనాన్ని వేయించినట్లుగా భావించవచ్చు. రాముడితో సంబంధం లేని తమిళ కాల్పనిక వీరుడు కరికాల చోళుడిని, ఇప్పటివరకు స్పష్టమైన చారిత్రక ఆధారాలే లేని దుర్జయుడిని తమ పూర్వీకులుగా వంశవృక్షంలో చేర్చడం కాకతీయ వంశానికి వీరత్వాన్ని చేకూర్చడానికే. అసలు విషయమేమంటే రాజు అయ్యే అర్హత క్షత్రియులకు మాత్రమే ఉందన్న వైదిక నియమం మధ్యయుగ చరిత్రలో వచ్చిన పాలక వంశాల మూలాలకు వర్తించదు. ఎందుకంటే ఈ కాలంలో ఎదిగిన పాలక వర్గాలు, రాజవంశాలు వ్యవసాయ, పశుపాలన వృత్తుల నుండి (శూద్ర వర్ణం నుంచి) ఎదిగినవే.
మాంగల్లు శాసనం: ఇప్పటి వరకు దొరికిన శాసనాల్లో మొదటిసారి కాకతీయుల గురించిన ప్రస్తావన క్రీ.శ.956 నాడు నేటి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు దగ్గర నుంచి పాలించిన వేంగీ చాళుక్య రాజు దానార్ణవుడు జారీ చేసిన మాంగల్లు శాసనంలో ఉంది. కాకత్య గుండన (పిండిగుండ) విన్నపం మేరకు దానార్ణవుడు మాంగల్లు గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేసినట్టు ఈ శాసనంలో తెలుస్తుంది. కాకతీయ వంశావళిలో వెన్న నుంచి రెండవ ప్రోల వరకు 10 మంది, రాష్ట్రకూట, కల్యాణి చాళుక్య సామంతులుగా కేవలం తెలంగాణలోని ప్రాంతాల్లోనే కాదు, వారి చక్రవర్తుల రాజకీయంతో పాటు ప్రయాణం చేసి దక్షిణ, ఉత్తర భారతాల్లో కూడా యుద్ధాలు చేశారు. రుద్రదేవుడి (మొదటి ప్రతాపరుద్రుడు) నుంచి మొదలై మహదేవ, గణపతిదేవ, రుద్రమదేవి చివరగా రెండవ ప్రతాపరుద్రుడు వరకు స్వతంత్ర చక్రవర్తులుగా తెలంగా నే కాదు తీరాంధ్రం వరకు రాజ్యమేలారు.
-డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000