పురాణాలు మన జాతి సంపద. మానవ జీవన విధానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన దిక్సూచిలు. అష్టాదశ పురాణాలను వ్యాసమహర్షి రచించాడని శాస్ర్తాలు చెప్తున్నాయి. వాటిని నైమిశారణ్యంలో శౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. యజ్ఞ సమయంలో పురాణం ఆవిర్భవించిందని అథర్వణ వేదం ద్వారా తెలుస్తున్నది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యక ఉపనిషత్తు వంటి గ్రంథాల్లో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించిందని పరిశీలకుల అభిప్రాయం. ఇలాంటి ఐతిహ్యం వాయు, బ్రహ్మాండ, విష్ణు పురాణాల్లో కూడా కనిపిస్తుంది.
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతను దాన్ని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వారిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప, శాంశపాయనులు వేర్వేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంథం పురాణ వాఙ్మయానికి మూలమైంది. పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకున్నదని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకుంటూ 12వ శతాబ్ది వరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఆధారాలున్నాయి.
పురాణాలు ప్రణవం నుంచి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండో స్కందం చెప్తున్నది. బ్రహ్మదేవుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయం నుంచి ఓంకారం ఆవిర్భవించింది. దాని నుంచి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మదేవుడు వేదాలను తన కుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులకు వాటిని అనుగ్రహించారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి. వేదాలు మంత్రపూరకమైనవి, క్లిష్టమైనవి కావడంతో వేద, ఉపనిషత్తుల సారాన్ని అష్టాదశ పురాణాల రూపంలో జాతికి అందించాడు వ్యాస మహర్షి. పురాణం అంటే ఏమిటి? అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. ప్రతి వస్తువు కొన్ని లక్షణాలను కలిగి ఉన్నట్లే, ప్రతీ పురాణం ఐదు లక్షణాలు సంతరించుకొని ఉంటుంది. అవి సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశాను చరితం ఈ ఐదు లక్షణాలు పురాణాలు కలిగి ఉంటాయి.
మధ్యయుగ శతాబ్దాల నుంచి కనుగొన్న పురాణాల రాతప్రతులు పండితుల దృష్టిని ఆకర్షించాయి. పురాణ సాహిత్యం పునర్నిర్మాణంలో కాలక్రమేణా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే అనేక అధ్యాయాలను ఆకస్మికంగా తొలగించడం కొత్త సమాచారంతో భర్తీచేయడం వంటివీ జరిగాయి. భారతీయ సాహిత్యం, పురాణాలు దేశంలోని అధ్యయన వేత్తలను ప్రభావితం చేశాయి. వాస్తవిక చరిత్ర, వ్యక్తిగత ఆత్మపరిశీలన, యోగ మొదలుకొని సామాజిక వేడుకల వరకు, ఉత్సవాలు, దేవాలయాల నుంచి తీర్థయాత్ర వరకు, దేవతల నుంచి తంత్రానికి, పాత నుంచి కొత్త వరకు కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది.
ప్రాచీన మధ్యయుగ భారతదేశంలో సాంస్కృతిక మార్పిడి, ప్రసిద్ధ విద్యకు పురాణాలు సమర్థవంతమైన మాధ్యమంగా పనిచేశాయి. పురాణాల సాంస్కృతిక ప్రభావం భారతీయ శాస్త్రీయ కళలకు విస్తరించింది. సంగీతం, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య సంస్కృతి, నాటకాలు, పారాయణాలు ఇవన్నీ పురాణాలతో ప్రభావితమయ్యాయి. పురాణ సాహిత్యంలో హోళీ, దీపావళి, దుర్గా పూజ వంటి ప్రధాన పండుగలు, ఉత్సవాల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. సనాతన ధర్మం నిత్యనూతనంగా పరిఢవిల్లడానికి పురాణాలు చేయూతనిస్తున్నాయి. పండితులను, పామరులను అలరిస్తూ, వారికి ధార్మిక మార్గాన్ని ఉపదేశిస్తూ భారతజాతిని ఒక్కతాటిపై నిలిపి ఉంచుతున్నాయి.
– నూతి
7337555084