పచ్చగా కళకళలాడిన ప్రాంతాలు కొన్ని ఎడారులవుతుంటే, ఎడారుల్లో పచ్చదనం చిగురిస్తున్నది. మంచుకొండలు కరిగి నీరైపోతున్నాయి. ఇసుక పర్రల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ప్రకృతి తారుమారవుతుండటం మనం గమనించవచ్చు. ఇది మానవ కల్పితమా లేక ప్రకృతి ప్రకోపమా? ఎక్కడ చూస్తే అక్కడ ఇసుక తిప్పలు పరచుకుని ఉండే దుబాయిలో కుండపోతగా వర్షం కురవడం ఏమిటి? వానొచ్చే, వరదొచ్చే అని నగరాలు అతలాకుతలం కావడం ఏమిటి? విమానాల రాకపోకలు రద్దు చేశారంటే పరిస్థితి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలను చూసిన ప్రపంచం విస్తుపోయింది.
ఎడారి నగరమైన దుబాయిలో కేవలం 24 గంటల్లో 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది ఏడాది మొత్తంలో నమోదయ్యే వర్షపాతం కంటే ఎక్కువ. 75 ఏండ్ల తర్వాత దుబాయి ఈ స్థాయి వర్షాన్ని చూసిందంటున్నారు. రహదారులు వడిగా పారే నదులయ్యాయి. భవనాలు నీటిలో తేలే పడవలయ్యాయి. ఎటుచూసినా వరదనీరే ఆవరించి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా ప్రసిద్ధి పొందిన బుర్జ్ ఖలీఫాపై పిడుగులు పడుతున్న దృశ్యాలు ప్రకృతి ముందు మానవశక్తి అల్పత్వాన్ని ఎత్తిచూపాయి.
ఇంతకూ ఈ ఉత్పాతం ఎందుకు వచ్చిపడిందనే తర్జనభర్జనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాల కోసం జరిపిన క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ వికటించి ఆకాశం భళ్లున బద్దలైందని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని, తీవ్ర అల్పపీడనం ఫలితంగానే ఎడతెరిపి లేకుండా వానలు పడ్డాయని వాతావరణ శాస్త్రజ్ఞులు తేల్చిచెప్పారు. దుబాయిలో ఆవిష్కృతమైన అనూహ్య విలోమ దృశ్యాలు రాబోయే పెను విపత్తుకు నిదర్శనమని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరుగుతుండటం తెలిసిందే. కాలుష్యం కారణంగా వాతావరణం వేడెక్కడమే అందుకు కారణం. అధిక ఉష్ణోగ్రతల వల్ల తేమ పెరిగిపోతుంది. దానికి అల్పపీడనం తోడైతే భారీవర్షాలు కురుస్తాయి. ఇలాంటి ఉత్పాతాల వల్ల 2050 నాటికి ప్రపంచ ఆదాయం ఏటా సగటున 19 శాతం వరకు దెబ్బ తింటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థికభారం ప్రభుత్వాలకో, కార్పొరేట్లకో పరిమితం కాదు. పౌరులకు వ్యక్తిగత స్థాయిలోనూ నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. దుబాయి జోరువానల్ని ప్రమాద ఘంటికలుగా భావించి భూతాపం తగ్గింపునకు ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2050 నాటికి భూతాపం తగ్గింపు కోసం 6 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని ప్యారిస్ వాతావరణ ఒప్పందం నిర్దేశిస్తున్నది. ఆ మొత్తంతో దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే వాటిల్లే నష్టం అంతకు ఆరురెట్ల కంటే ఎక్కువగా, అంటే 38 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని నేచర్లో ప్రచురితమైన తాజా అధ్యయనం తెలిపింది. భూతాపం వల్ల దుబాయి తరహా జలవిలయాలే కాదు, ఇతర నష్టాలూ ఉంటాయి. ధ్రువాల వద్ద మంచు కరిగి సముద్రమట్టం పెరగడం వల్ల తీరాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. వ్యవసాయంలో అధిక ఉష్ణం వల్ల చీడపీడలు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోతుంది. ఇదంతా మానవ కల్పిత పర్యావరణ వినాశనం వల్లనే! చికిత్స కన్నా నివారణే ముఖ్యమన్న సూక్తి వైద్యంలోనే కాదు వాతావరణం విషయంలోనూ వర్తిస్తుంది. పారిస్ ఒప్పందం లక్ష్యాల సాధనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయడం అవసరం.