Summer | రాష్ట్రంలో వరుస వర్షాలతో ఎండాకాలం కొద్దిగా ఆలస్యంగా మొదలైనా విశ్వరూపం చూపుతున్నది. భానుడు చెలరేగి పోతున్నాడు. మండుతున్న ఎండలతో.. బయట కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నది. అయితే, ఇది అకస్మాత్తుగా వచ్చిన పరిణామం కాదు. ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన సూచనలు కనిపించాయి. ఆ నెలలో దేశంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. భారతదేశంలో వాతావరణ నమోదు ప్రక్రియ ప్రారంభమైన 1901 నుంచి ఈ 102 ఏండ్ల వ్యవధిలో ఇదే అత్యధికం. దీంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో మార్చి-మే నెలల మధ్య తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. దక్షిణ భారతం, మహారాష్ట్రలో సాధారణ ఉష్ణోగ్రతలే ఉండవచ్చని అంచనా వేసింది. కానీ, ఆ అంచనా తప్పని ఇప్పుడు తేలింది. దక్షిణం కూడా అగ్గిగుండంగా మారింది.
భూమధ్య రేఖ వెంబడి ఉన్న పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం ప్రపంచదేశాలతోపాటు, మన దేశంలో వాతావరణంపై కూడా గణనీయంగా ఉంటుంది. సముద్రం మీద ఉష్ణోగ్రతలు పెరిగితే, భారత్లో కరువు పరిస్థితులు నెలకొంటాయి. దీనినే ఎల్నినో ఎఫెక్ట్ అంటారు. ఈసారి జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎల్నినో సంభవించే అవకాశం 70 శాతం ఉందని ఐఎండీ గతంలోనే ప్రకటించింది. వాస్తవానికి, ఈ శతాబ్దం ఆరంభం నుంచీ భారత్ వరుసగా ఎల్నినోను ఎదుర్కొంటున్నది. 2003, 05, 09-10, 15-16లలో కరువు ఏర్పడింది. ఫలితంగా పంట దిగుబడులు తగ్గాయి. దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడింది.
ఎందుకంటే, దేశంలో సగానికిపైగా జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న ఆర్థికవ్యవస్థ మనది. ఎల్నినో ప్రభావం నుంచి వ్యవసాయాన్ని తప్పించలేమా? అని అంటే.. తెలంగాణ ఏర్పాటు కాకముందు వరకూ సాధ్యం కాదనే సమాధానమే వచ్చేది. కానీ, సాగు రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుతమైన ప్రయోగాలతో వాతావరణ ప్రభావాన్నీ జయించవచ్చని రుజువైంది. ఒకప్పటి తెలంగాణ కరువు నేలలు నేడు పచ్చటి పంటలతో కళకళలాడుతున్నాయి. ఎండాకాలానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక కోణం ఇది.
మండే ఎండలు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి కాబట్టి, వ్యక్తిగత స్థాయిలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, వడదెబ్బ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యే రోజుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ బయట తిరగకపోవటం మంచిది. తప్పనిసరి పనుల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఎండ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య చిట్కాలను పాటించాలి. అవసరమైన పక్షంలో తక్షణం వైద్యసహాయం తీసుకోవాలి. అంతేగానీ, నిర్లక్ష్యం వహిస్తే మొదటికే మోసం వస్తుంది. ఉదయ భానుడితో ఎంత ఉల్లాసంగా ఉంటుందో, ప్రచండ భానుడితో అంత ప్రమాదం ఉంటుంది మరి!