మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 42 రోజులే పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. గత ఐదేండ్లలో ఇదే అతి తక్కువ పనిరోజులు కల్పించిన ఆర్థిక సంవత్సరమని గణాంకాలు చెప్తున్నాయి. దీనికితోడు తక్కువ వేతనాలిస్తూ, పనిదినాల్లో కోత పెడుతూ, ఇప్పుడు ఆధార్ లింక్ చేస్తేనే వేతనాలిస్తామని కేంద్రం నిర్ణయించడంపై నిరుపేద కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తెరపైకి తెస్తున్నది. ఇప్పటికే బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న కేంద్ర సర్కారు ఏదో ఒక కొర్రీ పెడుతూ కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్నది. తాజాగా ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే జాబ్కార్డులకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలని షరతు విధించింది. కేంద్రం వార్నింగ్తో ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఆధార్ అనుసంధానం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఉపాధి హామీ పథకంతో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలను అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు అభ్యర్థనలు పంపినా సానుకూలంగా స్పందించలేదు. కొవిడ్ తర్వాత ఉపాధి అవకాశాలు తగ్గి, గ్రామీణ ఆర్థికావ్యవస్థ సంక్షోభంలో ఉన్న సమయంలో కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ పథకానికి కేటాయించిన నిధులను తగ్గించి, పలు నిబంధనలను విధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కార్మిక కుటుంబాలకు ఏటా వంద రోజులు పనులు దక్కడం లేదు. కొన్నేండ్లుగా కూలీలకు ఏటా 50 రోజులకు మించి పనులు ఉండటం లేదు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీపీ) కొవిడ్ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి, సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది వలస కూలీలకు ఉపాధి కల్పించి ఆదుకున్నది. ఈ బృహత్తర పథకానికి కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో కేటాయింపులను భారీగా తగ్గించింది. 2022-23 బడ్జెట్లో కూడా మోదీ సర్కార్ 25 శాతం మేర కోత విధించింది. రూ.98 వేల కోట్లు అంచనా కాగా రూ.73వేల కోట్లే కేటాయించింది. ఈ ఏడాది జనవరి 6 నాటికి దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి పొందగా 225.8 కోట్ల వ్యక్తి పనిదినాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 24 నాటికి 6.49 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి కోరగా 6.48 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. 5.7 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకున్నాయి. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకానికి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది.
2020-21 బడ్జెట్లో రూ.61,500 కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం, 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.70 వేల కోట్ల చొప్పున కేటాయించింది. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినబడ్జెట్లో ఈ పథకానికి కేటాయించింది రూ.60వేల కోట్లు మాత్రమే. ఇలా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంపై వివక్ష చూపుతుంది. తద్వారా కూలీలు ఉపాధి కోల్పోతున్నారు.
– మోటె చిరంజీవి
99491 94327