శ్రీనాథ, పోతనలు బావ, బావమరుదులు అని లోకంలో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. పోతన అచ్చమైన తెలంగాణ వాడు. శ్రీనాథుడేమో తీరాంధ్రవాడు. వారి భక్తిమార్గంలో, జీవిత విధానంలో ఉన్న వైరుధ్యం వల్లనో ఏమో అటువంటి కథలు పుట్టాయి. శ్రీనాథునికి దగ్గుపల్లి దగ్గర కాక పోతన పేరుతో ఒక బావమరిది ఉండటం వల్ల కూడా నామసామ్యం వల్లనో ఏమో ఈ కథలు ప్రచారంలోకి వచ్చాయి.
పోతన ఒక పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ‘శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుడై’ గంగానదికి స్నానానికి పోయాడు. అక్కడ మహేశ్వర ధ్యానంతో అతడు అర్ధనిమీలిత నేత్రుడై ఉండగా శ్రీరాముడు ఎదురుగా ప్రత్యక్షమై కనిపించి ‘భాగవతాన్ని రాయ’మని ఆదేశించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పోతన ఏకశిలానగరం వచ్చి అక్కడ గురువృద్ధ బుధ బంధుజనాను జ్ఞాతుడై భాగవతాన్ని తెలుగులో రచించడానికి పూనుకున్నాడు.
పోతన ఏకశిలానగరం అంటే ఓరుగల్లు ఈనాటి వరంగల్ నగరంలో ఉండి భాగవతాన్ని రచించినట్లు దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తున్నది. అంతేగాక అతడి గురు బంధుజనాదులు కూడా అక్కడే ఉండేవారని తెలుస్తున్నది. పోతన వరంగల్ ప్రాంతంలోని జనగామ సమీపంలో ఉన్న ‘బమ్మెర’ అనే గ్రామంలో పుట్టాడు. అందుకే అతని ఇంటిపేరు బమ్మెర. ఒక చంద్రగ్రహణం రోజు గంగకు స్నానానికి వెళ్లాడు అంటే.. ఆ గంగ దక్షిణగంగ అని పిలువబడే గోదావరియే కావాలి. తెలంగాణలో ప్రజలు గోదావరిని ‘గంగ’ అని పిలువటం ఉంది. ధర్మపురి గోదావరి నదీతీరంలోనే ఉంది. ఇది పవిత్రక్షేత్రంగా ఇప్పటికీ భావింపబడ్తున్నది. పోతన వరంగల్ సమీపంలో ఉన్న ధర్మపురి వద్దగల గోదావరిలోనే స్నానమాడాడని చెప్పాలె.
కొందరు పండితులు పోతన రాయలసీమలోని ఒంటిమిట్ట వాడని ఇప్పటికీ చెప్తుంటారు. ఎప్పుడో తెలంగాణ గురించి తెలియని, తెలంగాణలో తెలుగుసాహిత్యం గొప్పగా సృష్టించబడిందని తెలియని నాడు పరిశోధక పండితులు అంటే అన్నారేమో కానీ, ఇప్పుడు కూడా ఆ విధంగా భావించటం సరైన వాదం కాదు. పోతన ‘ఏకశిలానగరం’ అని చెప్తుంటే ‘ఒంటిమిట్టవాడ’నటం మిథ్యావాదం అని చెప్పాలి.
పోతన తెలుగులో భాగవతం రచించాడు. కాని భాగవతంలోని అన్ని స్కంధాలను అతడు రచించలేదు. అతని ముగ్గురు శిష్యులు ఈ రచనలో పాల్గొన్నారు. ‘భాస్కర రామాయణం’ లాగానే ‘భాగవతం’ కూడా అనేక కవులు రచించిన రచన. భాగవతంలో 12 స్కంధాలున్నాయి. వాటిల్లో 5,6, 11,12 తప్ప మిగిలిన ఎనిమిది స్కంధాలను పోతన రచించాడు. ఐదవ స్కంధాన్ని గంగన; ఆరవ స్కంధాన్ని ఏర్చూరి సింగన; పదకొండు, పన్నెండు స్కంధాలను వెలిగంధల నారయ అనువదించారు. భాగవతంలోని నాలుగు స్కంధాలు శిథిలం కాగా, ఈ ముగ్గురు కవులు రచించారని కూచిమంచి తిమ్మకవి అన్నాడు. దేశంలో ఉన్న అన్ని ప్రతుల్లో ఆ భాగాలే నశించటం అనేది సత్యదూరం కాబట్టి.. పోతన తన శిష్యులకు ప్రోత్సాహం ఇవ్వడానికే వారిచేత ఆ భాగాలను రచింపజేశాడని చెప్పాలి.
చారిత్రక దృష్టితో పరిశీలిస్తే విమర్శకులు సంస్కృత భాగవతం క్రీ.శ. 10వ శతాబ్దంలో రచింపబడిందంటారు. ఆ కాలంలోనే శ్రీకృష్ణ భక్తి ప్రచారంతో పాటు, భాగవత రచనకు ప్రాధాన్యం పెరిగింది. అంతవరకు దేవపురాణాన్ని అష్టాదశ పురాణాల్లో చేర్చి చెప్పేవారు. కాని తర్వాత కాలంలో అష్టాదశ పురాణాలలో దేవీభాగవతం స్థానంలో భాగవతానికి ప్రాధాన్యం పెరిగింది.
పోతన సుమధురమైన శైలిలో లలితమైన పదాల కూర్పుతో శబ్దాలంకారాలతో రచించాడు. దాని వల్ల తెలుగుభాగవతం పురాణంలాగా కాక, ఒక కావ్యంగా కావ్యగౌరవాన్ని పొందింది. భాగవతంలోని పోతన రచించిన దశమ స్కంధంలో శ్రీకృష్ణుని చరిత్ర అంతా వర్ణించబడింది. ఇది దీర్ఘమైన స్కంధం. పోతన తన మధురమైన శైలిలో భక్తిరసాన్ని పోషిస్తూ రచించాడు. పోతన స్వయంగా భక్తుడు. భక్తావేశంతో కూడిన ‘గజేంద్రమోక్షం’, ‘ప్రహ్లాద కథ’ మొదలైన ఘట్టాలను భక్తిరసవంతంగా రచించాడు. పోతన మధురమైన సులభశైలి పండిత, పామరులను సమానంగా అలరిస్తుంది. పోతన అనగానే.. మనకు భక్తిరసం జ్ఞాపకానికి వస్తుంది. పోతన భాగవతంలోని ఒక్క పద్యమైనా రాని ఆంధ్రుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. కాని పోతన భక్తితో సమానంగా శృంగార, వీర రసాలను రమణీయంగా పోషించాడు. కృష్ణుడు రుక్మిణీ సోదరుడైన రుక్మితో చేసిన యుద్ధాన్ని పోతన ఏ కవులు వర్ణించనంతగా సహజంగా కన్నులకు కట్టినట్లుగా వర్ణించాడు. యుద్ధాన్ని పోతన, పెద్దన కవులే సహజంగా వర్ణించారని అంటారు. కాని పోతన యుద్ధ వర్ణనలు కూడా చాలా సహజంగా ఉంటాయి.
విష్ణువు ప్రణయ కలహంలో లక్ష్మీదేవి చీరకొంగులాగుతూ, అదేవిధంగా లక్ష్మీదేవితో గజేంద్రుని రక్షించటానికి సన్నద్ధుడై వచ్చాడని పోతన రచించాడు.
ఈ ప్రణయ కలహం.. చీరకొంగులాగడం, ఆ కొంగుతోనే లక్ష్మీదేవి రావడం వట్టి వర్ణన సంస్కృత భాగవతంలో లేదు. శృంగార రసాభిమాని అయిన పోతన స్వంత కల్పనే ఇది. అలాగే వీర రసం, శృంగార రసం కలబోసి చెప్పిన ‘సత్యభామ యుద్ధం’ వర్ణనాదులు కూడా పోతన కవిత్వంలో ఉన్నాయి.
పోతన కవితా మాధుర్యం అంతా అతడు ప్రయోగించిన అనుప్రాసాది శబ్దాలంకారాలలోనే ఉంది. ఒక అక్షరాన్ని ఆవృత్తి చేయడం, అంత్యాను ప్రాసలను ప్రయోగించటం, ‘యమకం, ముక్తపదగ్రస్తం’ వంటి శబ్దాలంకారాలు పోతనలో కనిపించినంతగా మరే కవి కవిత్వంలో కనిపించవు. ‘కొందరు తెనుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు’ అని నేను అందరినీ మెప్పిస్తాను అని పోతన అంటూ తన కవిత్వంలో తెలుగు, సంస్కృత భాషలను సమానంగా ప్రయోగించాడు.
తెలుగు, సంస్కృతాలను మిళితం చేయటమే గాక పోతన కవిత్వం ఒకచోట సంస్కృత పదభరితంగా, మరోచోట దేశీయమైన పదాల ప్రయోగంతో కనిపిస్తుంది. ఆ విధంగా పోతన కవిత్వం అనితరసాధ్యంగా రమ్యంగా సాగింది.
పోతన ‘వీరభద్ర విజయం’ అనే కావ్యాన్ని కూడా రాశాడని అంటారు. భాగవతంలో ‘దక్షాధ్వర ధ్వంసం ఘట్టం’లో శివనింద చేసిన పాపానికి పరిహారంగా పోతన ‘వీరభద్ర విజయం’ రాశాడని లోకంలో ప్రచారంలో ఉంది. కాని రచనాశైలిని పరిశీలిస్తే ఇది నిజం కాదని తెలుస్తుంది. ‘వీరభద్ర విజయం’లోని కవిత్వం పరిపక్వంగా లేదు. ‘వీరభద్ర విజయ’ కర్త పోతన సవతి తమ్ముడో లేదా, అతని వంశంలోని వాడో అయి ఉంటాడని పండితులు అభిప్రాయపడుతున్నారు.
శృంగార రసాన్ని కూడా పోతన చాలా మృధుమధురంగా రచించాడు. ‘సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డేపరివారంబును జీర డభ్రగపతింబన్నింపడా కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొతడు వివా ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై..’
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606