మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. లాభాల బాటలో నడుస్తున్న ఎల్ఐసీ , బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసింది. ఇక ఇప్పుడు కళారంగంపై పడింది. స్వతంత్ర భారతదేశంలోని అనేక చారిత్రక ఘట్టాలను దృశ్యమానం చేసి భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్లతో పాటు ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియాల ఉనికిని దెబ్బతీస్తూ వాటిని నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎఫ్డీసీ)లో విలీనం చేసింది.
ఫిలిం సెన్సార్ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఇప్పటికే రద్దు చేసిన ప్రభుత్వం మిగిలిన సంస్థలను విలీనం చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల ఫిలిం ఆర్కైవ్స్ వంటి సంస్థల్లో ఉన్న భారతీయ సినిమా వారసత్వ సంపద భావితరాలకు తెలియకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఈ విలీనాన్ని అంగీకరిస్తే భవిష్యత్తులో పుణె, కోల్కతా ఫిలిం ఇన్స్టిట్యూట్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంతు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ చర్య కళారంగాన్ని గంపగుత్తగా ప్రైవేటీకరించడంలో తొలిమెట్టనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర, కళా, సాహిత్య రంగాల ప్రముఖులు తీవ్రంగా నిరసిస్తున్నారు.
సినిమా సంస్థల విలీనాన్ని గురించి ప్రముఖ ఫిలిం క్రిటిక్ వారాల ఆనంద్ రాసిన కథనాన్ని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ‘కళారంగం పైనా కర్కశ పాదం’ శీర్షికన ప్రచురించింది. కళా రంగ సంస్థల మనుగడపై పలువురు కళా కారులు, కవులు, రచయితలు స్పందించారు. కళారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను ఖండించారు.
సినిమాల్లోని వివిధ విభాగాలను విలీనం చేయడమనేది సినిమా రంగాన్ని ఒక గుత్తాధిపత్యానికి అప్పజెప్పడమే. కళ మౌలిక ఉద్దేశాలను మరుగుపరిచి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యాపారీకరించడమే. సమాజ పరివర్తన, సమాజంలోని చలనశీలతకు సినిమా ఎంతో తోడ్పడింది.
ఒమర్ముఖ్తార్, మాభూమి, పథేర్ పాంచా లీ, బ్లాక్ సాంగ్, మహాత్మగాంధీ, భగత్సింగ్, అంబేద్కర్, జై భీమ్ ఇలా అనేక సినిమాలు సమా జ పరివర్తనకు తోడ్పడ్డాయి. నవ్వులు పూయించడమే కాదు కర్తవ్యాన్ని బోధించిన వారసత్వం సినిమాకు ఉన్నది. సత్యజిత్రే, మృణాల్సేన్, రిత్విక్ ఘటక్, తపన్బోస్, శ్యాం బెనగల్, ఆదూర్ గోపాలకృష్ణన్, గిరీష్ కర్నాడ్, బి. నర్సింగరావు, గౌతమ్ఘోష్ లాంటి వారెందరో భారతీయ సినిమా ను అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. అలాంటి వారి ఆశయాలను నిర్వీర్యం చేసి, పాలకుల భావ జాలానికి, ఆలోచనకు అనుకూలంగా ప్రజాస్వామిక భావాలు లేకుండా చేయడం మరుగుజ్జు తన మవుతుంది. సినిమా కానీ, నాటకం కానీ, కవిత్వం కానీ మానవ స్వభావాన్ని ఉన్నతీకరించి మనిషిలోని మంచితనాన్ని ప్రేరేపించాలి. దశాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ సినిమా ఉద్దేశమది. రైతు బిడ్డ , అనందభైరవి, మా భూమి, విముక్తికోసం, మనుషులు మారాలి, అల్లూరి సీతారామరాజు, అర్ధరాత్రి స్వాతంత్య్రం, వేగు చుక్కలు, ఎన్కౌంటర్, జయం మనదేరా, కుబుసం సినిమాలన్నింటిలో ఆ ప్రయత్నం జరిగింది. కానీ ఈ రోజు బాలల సినిమాల స్వతంత్రతను రద్దు చేయడం అంటే వాటి క్రియాశీలతను దెబ్బతీయడం, తద్వారా ప్రపంచంలో భారతీయ సినిమాకు ఉన్న కీర్తిని తగ్గించే ప్రయత్నం చేయడమే. ప్రభుత్వ రంగ సంస్థల్లాగే కళా రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కళా, సాహిత్య, న్యాయ, విద్యారంగా లకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. వాటి నుంచే సుగుణశీలసమాజం వృద్ధి చెందు తుంది. మనది భిన్న ఆలోచనల సమాజం. కానీ ఆ భిన్నత్వాన్ని , బహుముఖీనతను, సమన్విత దృక్పథం లేకుండా తామనుకుంటున్న పద్ధతిని అమలు చేయాలను కుంటు న్నారు. కళారంగం, సినిమా రంగంలోని వారు దీన్ని ఖండించాల్సిం దే. ప్రజల ఆలోచనల నుంచి వచ్చే సినిమాలను అణచివేసే పద్ధతిని కేంద్రం అమలు చేస్తున్నది. అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చేసి తామనుకుంటున్న మరుగుజ్జు తనంలోకి సమాజం మొత్తా న్ని తీసుకుపోయే ధోరణి వీళ్లకు ఇష్టం. విశ్వవిద్యాలయాలు, సాహిత్య రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మానవీయ సం స్కృతిని ధ్వంసం చేసే పని కేంద్రం చేస్తున్నది.
దేశంలో ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే పేరు ఊరు లేనోళ్లు అవార్డులు అందుకుంటున్నారు. కళారంగాల విలీనాన్ని ఒక కమిటీ చెప్పిందని చేశామనడం సరైన వాదన కాదు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఒక ప్రభుత్వ అధికారి ఎలా నడపగల రు? సినిమా గురించి అవగాహన లేకుండా సినిమాల అభివృద్ధి, పరిరక్షణ ఎలా సాధ్యం? కేంద్రం చేపట్టిన ప్రతిష్ఠాత్మక సంస్థల విలీనం తప్పు. బహుశా వాటిని నిర్వీర్యం చేసే ఉద్దేశం ఉందేమో.
డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ వాళ్లు చాలా దేశాలతో సంబంధా లు పెట్టుకుని విదేశీ ఫెస్టివల్కు మన సినిమాలు పంపిస్తారు. దాసి సినిమాను 30 దేశాల్లో ప్రదర్శించారంటే కారణం డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివలే కారణం. ఇప్పుడా సంస్థలు రాజకీయ జోక్యం ఉన్న సంస్థ చేతుల్లోకి పోతే మంచి సినిమాలకు అవకాశాలు రావు. ఫిల్మ్స్ డివిజన్లో ‘మూవింగ్ ఇమేజెస్’ మ్యూజియంలో సినిమా కళా సంపద ఉన్నది. ఆర్కైవ్స్లో భారతీయ సినిమా వారతస్వ సంపద పోగుపడి ఉంది. ఫిల్మ్స్ డివిజన్ స్వాతంత్య్రోద్యమ విశేషాలను డాక్యుమెంట్ చేసింది. న్యూస్రీల్స్ ఎన్నో తయారు చేసింది. జాతీయోద్యమ నేతలు, దేశాభివృద్ధిని మలుపుతిప్పిన ఘట్టాలు, శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు, మేధావుల ఇంటర్వ్యూలు, భారతీయ కళారీతులు, శిల్పకళ, చారిత్రక, పర్యాటక ప్రదేశాల డాక్యుమెంటరీలు లక్షల్లో ఉంటాయి. అలాంటి సంస్థను మరో సంస్థలో విలీనం చేయడం సరైంది కాదు.
– బి. నర్సింగరావు, సినిమా దర్శకులు
దేని లక్ష్యం దానిది. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ, ఫిల్మ్ డివిజన్, ఫిల్మ్ ఆర్కైవ్స్, ఫిల్మ్ స్కూల్ లక్ష్యాలు వేర్వేరు. వాటిని విలీనం చేసిన ఫిల్మ్ కార్పొరేషన్ లక్ష్యం వేరు. అలాంటప్పుడు ఈ విలీనం ఏ ప్రయోజనం కోసం చేశారో అర్థం కావట్లేదు.
అన్నిటినీ ప్రైవేటీకరణ వైపుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలేవీ బతకకుండా చేస్తున్నారు. వాటిని ఇవాళ కాకపోతే రేపు అమ్మేస్తారు. లేకపోతే నిర్వీర్యం చేస్తారు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ పిల్లల సినిమాల కోసమే పనిచేసే సంస్థ. దానిని మరో సంస్థలో విలీనం చేశారు. ఆ సంస్థకు పిల్లల సినిమాలేమీ లక్ష్యం కాదు. అందువల్ల నష్టం జరగదా? పిల్లల సినిమాకు ఫండ్స్ కూడా తగ్గుతాయి. ఆయా సంస్థల్లో పనిచేసే వాళ్లకు.. ‘మీరు మా మాట వినకపోతే మీ బడ్జెట్కు కోత పడుతుంది’ అనే ధోరణి వస్తే వాళ్లేం చేస్తారు? అప్పుడా సంస్థలు లక్ష్యాలకు విరుద్ధంగా పని చేయాల్సిందేనా? ఆయా రంగాల నిపుణులు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోకుండా విలీనం చేయడం తప్పుడు నిర్ణయం.
– అంబిక, కల్చరల్ యాక్టివిస్ట్
కేంద్రం ఎన్ఎఫ్డీసీలో విలీనం చేసిన సినిమా సంస్థలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. ఏ సంస్థ పని దానిది. వాటి నిర్వహణ, నిర్ణయాధికారాలన్నీ ఒకరి దగ్గర ఉండడం సరైంది కాదు. ఇలా సంస్థలన్నిటినీ విలీనం చేస్తే వాటికున్న ప్రత్యేకతను కోల్పోతాయి.
ఆయా సంస్థల స్వయం ప్రతిపత్తిని, పనిచేసే వాళ్ల స్వాతంత్య్రాన్ని కాపాడాలి. వాటికి బడ్జెట్ ప్రత్యేకంగా ఉండాలి. కేంద్రీకరణ జరిగితే వాటి ఉనికిని కోల్పోతాయి. ఆ సంస్థలు చేయాల్సిన పనులేవీ నెరవేరవు. లక్ష్యా నికి గండి పడుతుంది. కేంద్ర ప్రభు త్వం అధికారాన్ని కేంద్రీకరణ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. అన్ని వ్యవస్థలను వాళ్ల చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తోంది. అధికారాన్ని కేంద్రీకరించి హక్కుల్ని నిరాకరించే వైఖరి ఇది. విలీనం చేయడం అంటే పని చేసేవాళ్లకు నిర్ణయాధికారం లేకుండా చేయడమే. అన్నింటికీ ఒకే నాయకత్వం ఉండడం వల్ల పర్యవేక్షణ, నిర్వహణ లోపిస్తుంది. పోను పోనూ వీటికుండే బడ్జెట్ కేటాయింపులు తగ్గించే ప్రమాదం ఉంది. వాళ్లు ఏం చెబితే అదే చేయాలి. ఆయా సంస్థల బాధ్యతలేవీ నెరవేరవు. చివరికి వీటిని మూసి వేయొచ్చు. ఇది మంచి నిర్ణయం కాదు. సినిమా సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉంటేనే వాటి లక్ష్యం నెరవేరుతుంది.
– ఆనంద్ చక్రపాణి, నటుడు
ఏ విలీనమూ మంచిది కాదు. కళకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఈ విలీనం వల్ల విలువలు దిగజారిపోతాయి. సినిమా సంస్థలన్నిటినీ మరో సంస్థలో విలీనం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.
సంస్థల్ని విలీనం చేయడం వల్ల కళాత్మక విలువలు తగ్గిపోవడం వెంటనే మొదలవుతుం ది. ఆ తర్వాత కాలంలో కళాత్మక వ్యక్తీకరణ కూడా పోతుంది. ఈ రెండూ పోయిన ఓ పదేళ్ల కు సినిమా కళ తన సహజ రూపాన్ని కోల్పోతుం ది. పాలకులు, వ్యాపారులు అనుకునే రూపంలోకి పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉన్నది. మార్కెట్, రాజకీయం కలిసి సినిమాను నాశనం చేసే ప్రమాదం ఉన్నది. కళాత్మకత లేని సమాజంలోకి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. ఒకప్పటి గొప్ప నాటకాలు చూడాలని ఈనాటి పెద్దలు తహతహలాడతారు. కానీ, ఆ నాటకాన్ని చూసే అవకాశం ఉందా? రేపు సినిమా అభిమానులు కూడా మంచి సినిమా కోసం అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఉన్న సెన్సార్ వల్ల మంచి సినిమాలు కష్టాలెదుర్కొంటున్నాయి. ఓటీటీలకు సెన్సార్ గండం ఉండదు కాబట్టే కొన్ని మంచి సినిమాలు చూడగలుగుతున్నాం. ఇప్పటికే సాహిత్యానికి ఆదరణ లేని, జనసామాన్యంలో సాహిత్య పదజాలం కనుమరుగైన సమాజంలో బతుకుతున్నాం. కొత్తగా సినిమా కూడా పోయే ప్రమాదం వచ్చింది.
– ప్రొ. గూడూరు మనోజ మాజీ రిజిస్ట్రార్, పాలమూరు విశ్వవిద్యాలయం
ఫిలిం ఆర్కైవ్స్ సంస్థ గొప్ప చిత్రాలను, మంచి చిత్రాలను డిజిటలైజ్ చేసే పని మొదలుపెట్టింది. అలనాటి ఆణిముత్యాలన్నీ అందరికీ అందుబాటులోకి వస్తాయనుకున్నాం. కానీ, పని మొదలైందో లేదో ఇలా విలీనం చేశారు. ఎన్ఎఫ్డీసీ సినిమాలు తీసే సంస్థ. ఆ సంస్థలో విలీనమైన సంస్థల పనులన్నీ నెమ్మదిస్తాయి. ఏ ఒక్కదానికీ న్యాయం జరగదు. సంస్థలన్నిటి నిర్వహణ బాధ్యత ఒకరి చేతుల్లోకి పోయాక పనిచేసే వాళ్లకు స్వాత ంత్య్రం ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ల చేతుల్లో ఈ సంస్థలు ఉంటాయి .
సినిమా తెరకెక్కించే వాళ్లు చాలా గొప్ప ఆలోచనలు, విశాలమైన హృదయం కలిగి ఉండాలి. సంకుచిత భావాలతో, ఒక పక్షం వహిస్తూ పోకూడదు. సినిమా సంస్థల విలీనాలతో ఈ రెండు సమస్యల నూ ఇక నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే.. ఫిలిం ఆర్కైవ్స్ లో మన సినిమాలు చాలా తక్కువ. ఎన్ఎఫ్డీసీ దక్షిణాది సినిమాలకు చేసిన సాయం చాలా తక్కువ. ఈ సంస్థలన్నీ దక్షిణాది సినిమాని, సినిమా వాళ్లని పట్టించుకోవు. ఇప్పుడు అన్ని సంస్థలూ ఒకళ్ల చేతికే పోతే దక్షిణాది మరింత నష్టపోతుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి గోవా శాశ్వత వేదికైనట్లుగానే ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి హైదరాబాద్ శాశ్వత వేదిక. నాలుగేండ్ల నుంచి జరగట్లేదు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిందనుకుంట. ఉత్తరాది ఆధిపత్యం ఉండే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈ సంస్థలుంటే దక్షిణాదికి ఉన్న కొద్దిపాటి ప్రయోజనం కూడా పోతుంది.
– తమ్మారెడ్డి భరద్వాజ, సినీ దర్శకులు
భారతీయ సినిమా సంస్థలు అన్నీ ఒకే గొడుగు కిందకు వస్తే స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు నడిచినట్లుగా నడిచే అవకాశం ఉండదు. వాటి లక్ష్యాలు నెరవేరతాయని అనుకోలేము. ఆ సంస్థలను వేర్వేరుగా ఉంచాలి.
స్వతంత్రంగా పని చేసేలా చూడాలి. ఈ విలీనాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే కళాకారులు, నిపుణులు వ్యతిరేకించవచ్చు. ప్రభుత్వం ఈ విషయాన్ని అనుభవంలోనైనా తెలుసుకోవాల్సిందే. మార్పులు చేయాల్సిందే. ఒకవేళ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కళ కోసం తప్పకుండా బయటికి వచ్చి సొంతంగా పని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ పరిస్థితి అనేక కళలను కాపాడుతున్న వాళ్లకు ఉన్నది. సినిమాని కాపాడే వాళ్లకూ ఆ బాధలు తప్పకపోవచ్చు.
-ఆచార్య కళాకృష్ణ, సంగీత-నాటక అకాడమీ పురస్కార గ్రహీత
ఇంతకుముందు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీలో నిష్ణాతులైన దర్శకులు, నిపుణులు ఉండేవాళ్లు. పిల్లల కోసం అవసరమైన సినిమాలు రూపొందించేందుకు పనిచేసేవాళ్లు. ఆ సినిమాలు పిల్లల్లో అభ్యుదయ దృక్పథం కలిగించేవి.
ఈ సినిమా సంస్థలన్నీ సమా జంలో కళా వికా సం పెంపొందించడం కోసం పని చేశాయి. ఇప్పు డు ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ పెరుగుతోంది. అందువల్ల రాజకీయ జోక్యం పెరుగుతోంది. క్రియేటివిటీకి ఆటంకాలొస్తున్నాయి. అందువల్ల భావ వికాసం ఆగిపోయి, కొత్త తరం సంకుచిత భావాలవైపు మళ్లుతుంది. సినిమాలో భిన్నాభిప్రాయాలకు, వైవిధ్యానికి, ప్రజాస్వామిక భావాలకు తావు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది జరిగితే సమాజం సంకుచితంగా మారిపోతుంది. వికాసం వైపు పోకుండా సంకుచితత్వం వైపు నడవడమంటే మనం మళ్లీ వెనుకటి సమాజాల్లోకి పోతున్నట్లే.
– శాంతారావు, రంగస్థల నిపుణులు
వేర్వేరు లక్ష్యాలతో స్థాపించిన కళా రంగ సంస్థలను విలీనం చేయడం సరికాదు. దాని వల్ల వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదమున్నది. ఈ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయాలి.
అసలు జుల్కా కమిటీ నివేదికకు ఉన్న ప్రామాణికత ఏంటి? ఏ ప్రాతిపదికన దాన్ని ఆమోదిస్తారు? అసలది నివేదికే కాదు. ఫుణె ఫిలిం ఇనిస్టిట్యూట్, ఫిలిమ్స్ డివిజన్, ఫిలిం ఆర్కైవ్స్ వంటి సినిమా కళారంగ అనుబంధ వ్యవస్థల ఉనికిని సమూలంగా తుడిచివేసే కుట్ర. మోదీ, అతని ప్రభుత్వానికి కళారంగాల పట్ల కనీస అవగాహన లేకపోవడం నిజంగా అత్యంత బాధాకరం, శోచనీయం.
– మనోహర్ చిమ్మని, నంది అవార్డు రచయిత, ఫిలిం డైరెక్టర్
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు భారతీయ సినిమా పరిశ్రమకు ఎంతో గొప్ప సేవ చేశాయి. పదేళ్ల నుంచి అవి నిర్వీర్యమవుతున్నాయి.
శ్యాం బెనగల్, గౌతమ్ ఘోష్ లాం టి వాళ్లను అందించిన సంస్థల్ని కాపాడుకోవాలి. భారతీయ సమాజంలో బహుళత్వం ఉంది. అదే మన గొప్పదనం. అవ న్నీ కోల్పోతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది అదే. అందుకే ఈ విలీనా లు. సినిమా సంస్థల విలీనం వల్ల వాటి పనితీరుపై చాలా ప్రభావం ఉంటుంది. ఇది పక్కా ఎజెండాతో జరుగుతున్న పని. ఇప్పటికే ఈ సంస్థల్లో వాళ్ల సభ్యుల్ని నియమించుకున్నారు. భావజాల పరం గా వాళ్లతో ఏకీభవించే వాళ్ల పాలనలో ఆ సంస్థలు ఉన్నాయి.
– దెంచనాల శ్రీనివాస్ జనపథం థియేటర్ రిపర్ట్రీ
ఈ విలీనం వల్ల వాటి స్వతంత్రతకే కాదు లక్ష్యాలకూ గండి పడుతుంది. ఎంతో గొప్ప సినిమా అని చెబితే వినడం, చదవడమే కానీ, చూడాలంటే ఆ సినిమా ఎక్కడా లేదు.
అలాంటి సినిమాలను కాపాడుకోవడానికి ఆర్కైవ్స్ లేవు. కొన్ని సినిమాలనైనా కాపాడిన సంస్థను భ్రష్టు పట్టిస్తానంటే ఎలా? ఆర్కైవ్ అనేది చాలా ముఖ్యమైనది. గొప్ప చిత్రాల డాక్యుమెంటేషన్ జరగాలి. క్లాసిక్ మూవీస్ని డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉన్న ది. రేపటి తరానికి అవి ఎంతో అవసరం. ఈ సినిమా సంస్థలన్నీ పెద్ద సంస్థలో విలీనమైన తర్వాత ప్రత్యేకమైన కృషికి ఆటంకం కలుగుతుంది.
– లక్ష్మణ్ ఏలె, ఆర్టిస్ట్
భారతీయ సినిమాను ప్రమోట్ చేయడంలో నేషనల్ ఫిలిం డెవలఫ్మెంట్ కార్పొరేషన్ చాలా కృషి చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడానికి, విలువైన సినిమాలు తీయడానికి ఎన్ఎఫ్డీసీ బాగా సహకరించింది. ముఖ్యంగా నిర్మాతలకు ఎంతో తోడ్పడింది.
భారతీయ చిత్రాలన్నీ, అంటే అన్నిభాషల చిత్రాలు ఎన్ఎఫ్డీసీ ద్వా రానే ప్రమోట్ అయ్యాయి. వాటికి అవార్డులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దర్శకులు కూడా ఎన్ఎఫ్డీసీ ద్వారా నే సినిమాలు చేశారు. ఇది చాలా కాలంగా వస్తున్న ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అన్ని రకాల సంస్థలను ఎన్ఎఫ్డీసీలో విలీ నం చేయడమంటే దాని స్వతంత్రతను, స్వయం ప్రతిపత్తిని తొక్కివేయడమే. విలువైన, క్వాలిటీ, సందేశాత్మక, సమాజానికి ఉపయోగపడే సినిమాను తీయడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం ఉన్నది. ఈ ఆలోచనను మార్చుకోవాలి. దీనివల్ల అనేకమంది కవులకు, కళాకారులకు, దర్శకులకు, నిర్మాతలకు కూడా మేలు కలుగులుతుంది.క్వాలిటీ సినిమాలు వస్తాయి. అవే రేపు అంతర్జాతీయ ఫెస్టివల్కు వెళ్లే అవకాశం ఉన్నది. కేంద్రం చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహించలేదు. బాలలకు సందేశాన్ని ఇచ్చే చిత్రాలు లేవు. వాటికి కావలసిన ఇన్సెంటివ్లు లేవు. ఇవన్నీ లేకపోవడం వల్ల నిజాయితీగా సినిమా తీయాలనుకునేవారు అండను కోల్పోయినట్లవుతుంది. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి.
-ఎన్. శంకర్, సినిమా దర్శకులు
మనం చాలా కాలం నుంచి ప్రభుత్వ విధానాలను చూస్తున్నాం. పని చేయకపోవడం, మంచి ప్రొడకక్షన్ రాకపోవడం ఇప్పటి సమస్యలు. ఇప్పుడా సంస్థలే లేకుండా పోయే ప్రమాదం వస్తోంది.
కళల్ని అభిమానించేవాళ్లు ఎంత మంచిగా పనిచేద్దామని ఉన్నా పని చేయలేని పరిస్థితి ఉంది. పనిచేయాలనే వాళ్ల ఉత్సాహాన్ని నిధుల లేమి, నిరుత్సాహపరుస్తోంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. వాటిని నిర్వీర్యం చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే సినిమా, సాహితీ, కళా రంగాలకు చెంది న సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ఉత్సాహం ఉన్నవాళ్లకు తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం ఈ దేశంలో ఉన్న పెద్ద సమస్య. భవిష్యత్లో ఈ సంస్థలు ప్రైవేటు చేతుల్లోకి పోతే వాళ్లు చెప్పినట్టు చేయాలి. కానీ, దేశ ప్రయోజనాలు, కళల పరిరక్షణ వాటికి అవసరం లేదు. సినిమా సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడాలి.
– ఒగ్గు రవి, సంగీత-నాటక యవ పురస్కార గ్రహీత
సినిమా అనేది కళా వికాసానికి పాటు పడుతున్నది. అలాంటి రంగంలో ఉన్న వేర్వేరు సంస్థలను ఒకే సంస్థలో విలీనం చేయడం సరికాదు. అలా చేయడం వల్ల వాటికి ఉన్న స్వతంత్రను కోల్పోతాయి.
ఎంతోమంది గొప్ప గొప్ప కళా దర్శకులను అందించిన భారతీయ సంస్థలు తమ ఉనికిని కొల్పోతా యి. వేర్వేరు లక్ష్యాలున్న సంస్థల ను ఒకే సంస్థగా మార్చడం వల్ల ప్రయోజనాలు ఉండకపోగా తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదమే ఎక్కువ. కనుక ఈ విలీన ప్రక్రియ ను వెంటనే రద్దు చేయాలి. హైదరాబాద్ చిల్ట్రన్ ఫెస్టివల్కు శాశ్వత వేదిక. కానీ చాలా కాలంగా ఆ వేడుకలను నిర్వహించడం లేదు. ఆ సంస్థను కూడా ఎన్ఎఫ్డీసీలో చేర్చడం వల్ల బాలల చిత్రాలకు భవిష్యత్ ఉండదు. వారసత్వ సం స్కృతి తన ఉనికిని కోల్పోతుంది.
-పులి అమృత్గౌడ్ సినిమా దర్శక, నిర్మాత
సినిమా రంగానికి చెందిన సంస్థలు వేటికవే వేర్వేరు కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసినవి. అలాంటి సంస్థల విలీనం వల్ల ఉపయోగం లేదు.
దేశ స్వాతంత్య్రం, నాయకుల పోరాట చరిత్ర ను, చారిత్రక ఘట్టాలను రికార్డు చేసి భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్లతో పాటు ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండి యా తదితర సంస్థలను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావడం సరికాదు. అలా చేయడం వల్ల సినిమా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. కనుక ఆ ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. వాటికున్న స్వతంత్రతను కాపాడాలి.
– మురళి కాసర్ల , ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్
– నాగవర్ధన్ రాయల, మధుకర్ వైద్యుల