రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, కొన్ని అంశాలను కావాలని వదిలిపెట్టారు. ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించుకుంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. దీనివల్ల రాజ్యాంగంలో కొన్ని స్పష్టమైన ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే కొందరు గవర్నర్లు వీటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన బిల్లులను ఆమోదించకుండా, తిప్పి పంపకుండా పెండింగ్లో పెడుతున్నారు. అయితే రాజ్యాంగం మౌనంగా ఉందంటూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడి, చట్టబద్ధ పాలన స్థానంలో అరాచకత్వానికి స్థానం కల్పించకూడదు.
శాసన సభ పంపించిన బిల్లును ఆమోదించడానికి గవర్నర్కు కాల వ్యవధి 200 అధికరణలో నిర్ణయించే విషయమై రాజ్యాంగం మౌనం వహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను మసకబార్చడానికి బీజేపీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల గవర్నర్లు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారు. తమిళనా డు ఆన్లైన్ జూదాల నిషేధ, ఆటల నియంత్రణ బిల్లు 2022 మొదలుకొని కేరళ లోకాయుక్త సవరణ బిల్లు 2022 వరకు ఆయా అసెంబ్లీల ఆమో దం పొందిన పలు బిల్లులు ఇందుకు ఉదాహరణలు.ఒక్క తమిళనాడులోనే దాదాపుగా 20 బిల్లు లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నా యి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలలో పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. ఇట్లా గవర్నర్ ఫైళ్ళను దగ్గర పెట్టుకొని ఎంత కాలమైనా ఉండవచ్చా?
200 అధికరణ గురించి రాజ్యాంగ సభలో చ ర్చించినప్పుడు, గవర్నర్ నిర్ణయానికి కాలవ్యవధి ఎందుకు లేదన్న విషయాన్ని ప్రొఫెసర్ షిబ్బన్లా ల్ సక్సేనా లేవనెత్తారు. పురుషోత్తమన్ నంబూ ద్రి-కేరళ (1962)వివాదంలో,గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపడానికి రాజ్యాంగం కాల వ్యవధి ని పెట్టలేదని సుప్రీంకోర్టు రాజ్యాంగపీఠం స్పష్టం చేసింది. అయితే గవర్నర్ బిల్లును ఎంతకాలమై నా అట్టిపెట్టుకోవచ్చా అనేది న్యాయస్థానం ముం దుకు రాలేదు. న్యాయస్థానం కూడా ఏ సందర్భంలోనూ ఇటువంటి తీర్పు ఇవ్వలేదు. శాసన సభ అభిప్రాయాన్ని గవర్నర్ గౌరవించాలని, రాష్ట్రపతి గాని, గవర్నర్ గాని తమ మంత్రిమండలితో సామరస్యంగానే వ్యవహరించాలని మా త్రం న్యాయస్థానం అభిప్రాయపడింది. శాసన సభ ఆమోదించిన బిల్లును గవర్నర్ తొక్కిపెట్టడం అంటే రాజ్యాంగ వ్యతిరేక విధానాల ద్వారా శాసనసభ అభిమతానికి భంగం వాటిల్ల చేసినట్టు, రా జ్యాంగ సమాఖ్య వ్యవస్థపై నేరుగా దాడిచేసినట్ట వుతుంది. బిల్లులను ఆమోదించకుండా జా ప్యం చేయడం నిరంకుశత్వం, రాజ్యాంగ విరుద్ధం .
గవర్నర్ తమ పరిశీలన కోసం పంపించిన బిల్లులపై రాష్ట్రపతి జాప్యం చేయడం మరొక విష యం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) మినహాయింపు బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి మే 2022లో చేరింది. దీనిపై రాష్ట్రపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 201వ అధికరణ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గల కాల వ్యవధిని చెప్పడం లేదు. రాష్ట్రపతి బిల్లును తిప్పిపంపితే శాసన సభ పునః పరిశీలనకు మాత్రం ఆరు నెలల గడువు ఉంది.
‘బిల్లును నిరవధికంగా అట్టిపెట్టుకున్నట్టయితే, అది రాజ్యాంగం వాంఛిస్తున్న గవర్నర్ వ్యవహార సరళికి అనుగుణమైంది కాదు’ అని జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ తమ సంప్రదింపుల పత్రంలో పేర్కొన్నది. గవర్నర్ ఆమోదించడానికి లేదా రాష్ట్రపతి ఆమోదానికి పంపించడానికి ఆరు నెలలో ఎంతో కొంత గడువు ఉండాల ని 2000 సంవత్సరంలో వాజపేయి ప్రభుత్వం నియమించిన ‘రాజ్యాంగ పనితీరు సమీక్షపై జాతీయ కమిషన్’ సూచించింది.
బిల్లుకు గవర్నర్ ఆమోదాన్ని నిర్దేశిస్తున్న 200 అధికరణ ఆంతర్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. రాష్ర్టాలు చేసే చట్టాలు, కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉండకుం డా చూసేందుకు స్వతంత్రమైన గవర్నర్ వ్యవస్థ అవసరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. శాసన సభల తొందరపాటు చట్టాలకు గవర్నర్ సేఫ్టీ వాల్వ్గా పనిచేస్తారనీ, వారి చర్యలు రాష్ట్ర ప్రభుత్వ, శాసన సభ నిర్ణయాలను సమీక్షించుకునేలా చేస్తాయని కొన్ని రాష్ర్టాలు సర్కారియా కమిషన్ ముందు అభిప్రాయపడ్డాయి.
దేశ సమాఖ్య ఆవరణకు మొండిరోగంగా పరిణమించిన ఈ వ్యాధికి చికిత్స అవసరమనే తీరులో సర్కారియా కమిషన్ అభిప్రాయపడింది. ఇప్పుడున్న విధానాలను ప్రక్షాళన చేయడం ద్వారా గవర్నర్ దగ్గర జాప్యాన్ని నివారించాలనే సూచన చేసింది. బిల్లు ముసాయిదా దశలో గవర్నర్ను సంప్రదించడం లేక కాల వ్యవధిని విధించడం వంటి సూచనలు చేసింది.
పరిపాలనా న్యాయ శాస్త్రం ప్రకారం- పాలనాపరమైన మంజూరులో జాప్యం జరగడం అంటే చట్టబద్ధ పాలనకు భంగం కలిగించడమే. అందువల్ల గవర్నర్ హేతుబద్ధ కాల వ్యవధిలోపే ఆమోదించడమో, నిరాకరించడమో జరగాలి. హేతుబద్ధమైన సమయం అంటే పరిస్థితులను బట్టి అవసరమైనంత వ్యవధి. కేయిషం మేఘచంద్ర సింగ్ – మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ (2020) కేసులో – ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ హేతుబద్ధమైన సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి మూడు నెలలు హేతుబద్ధమైన సమయం అని కూడా స్పష్టం చేసింది. ‘రాణి ఏలుతుంది, మంత్రులు పాలిస్తారు’ అనేది పార్లమెంటరీ వ్యవస్థ మూల సూత్రం. ప్రజా ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుస్తుండేలా చూడటం మాత్రమే గవర్నర్ విధి. కానీ ఎలాగూ కాల వ్యవధి లేదు కదా అని ఫైళ్లను పెట్టుకొని కూర్చోవడం కాదు. రాజ్యాంగాన్ని సందర్భానుసారం అర్థం చేసుకుంటే, గవర్నర్ హేతుబద్ధమై కాల వ్యవధిలో, ఓ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగం మౌనంగా ఉందంటూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడి, చట్టబద్ధ పాలన స్థానంలో అరాచకత్వానికి స్థానం కల్పించకూడదు. శంషేర్ సింగ్ తదితరులు- పంజాబ్ రాష్ట్రం కేసులో జస్టిస్ కృష్ణ అయ్యర్ ముక్తసరిగా చెప్పినట్టు- ‘విచ్చలవిడి దుర్వినియోగాలను, వక్ర పోకడలను ఊహించగలిగే రాజకీయ ప్రవక్తలు అయి ఉండరు మన రాజ్యాంగ నిర్మాతలు’.
– ముకుంద్ పి. ఉన్నీ
(వ్యాసకర్త: సుప్రీం కోర్టు న్యాయవాది)
(ది హిందూ సౌజన్యంతో)