‘నేను రాను బిడ్డో మాయదారి దవాఖానకు’ అనే సినిమా పాట 1980 దశకం నాటిది. సర్కారు దవాఖానల్లోని సౌకర్యాల లేమి, లంచగొండితనం గురించి కండ్లకు కట్టినట్లు వివరిస్తుంది ఈ పాట. 40 ఏండ్ల కిందట ప్రైవేట్ వైద్యవ్యవస్థ వేళ్లూనుకోలేదు. ఏ ఆపద వచ్చినా సర్కారు దవాఖానకు పోవాల్సిందే. కానీ, ఆ దవాఖానల్లో ఆ సమస్యలతో రోగులు ఇబ్బందులు పడేవాళ్లు. తెలంగాణ ఏర్పడేవరకూ ఇదే దుస్థితి.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యవ్యవస్థలో గణనీయ మార్పులు సంభవించాయి. వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు జరిగాయి. మౌలిక వసతుల కల్పన జరిగింది. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. దవాఖానల్లో పడకల సంఖ్య పెంచింది. 2017 లో జీఓ 78 ద్వారా రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఒకేసారి ప్రత్యేక వైద్యులు, సిబ్బందికి సంబంధించి 1,099 పోస్టులు మంజూరు చేశారు. వీరి ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు విస్తృతమయ్యాయి.
ప్రతి నియోజకవర్గంలో నిపుణులైన వైద్యులతో ఒక దవాఖానతోపాటు, ప్రతి జిల్లా కేంద్రంలో ఉస్మానియా లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటుచేయాలనేది కేసీఆర్ ఆలోచన. దీనివల్ల హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా, గాంధీ వైద్యశాలలపై అదనపు భారం తగ్గుతుంది. ఇప్పటికే మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొత్తగా వైద్య కళాశాలలతోపాటు వాటికి అనుబంధంగా బోధనాసుపత్రులు ఏర్పాటుచేశారు. గచ్చిబౌలిలోని ‘టిమ్స్’ దవాఖానతో కలుపుకొని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో మూడు స్పెషాలిటీ వైద్యశాలల ఏర్పాటుకు రూపకల్పన జరిగింది.
‘కాలేయ మార్పిడి’ శస్త్రచికిత్స కార్పొరేట్ దవాఖానల్లో, ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ చికిత్సను నేడు ఉస్మానియా దవాఖానలో పేదలకు కూడా ఉచితంగా అందిస్తున్నారు. మూత్రపిండాలు చెడిపోయిన పేదవారికి ప్రభుత్వ దవాఖానల్లోని పలు సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా డయాలిసిస్ నిర్వహిస్తున్నది. ఈ మధ్యనే ప్రభుత్వం ‘ఉస్మానియా’లో స్కిన్ బ్యాంక్ను ఏర్పాటు చేసింది. దీనితో సేకరించిన చర్మాన్ని 40 నుంచి 50 శాతం కాలినవారి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగిస్తారు. అర్బన్ ఏరియాల్లో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా 2018లో హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన బస్తీ దవాఖానలు విజయవంతంగా సాగుతున్నాయి. ఈ బస్తీ దవాఖానలను ఇతర జిల్లాల్లోని అర్బన్ ఏరియాలకూ రాష్ట్ర ప్రభుత్వం విస్తరించబోతున్నది.
తెలంగాణ వస్తే ఏమొస్తదనే ప్రశ్నకు నేడు వైద్యరంగంలో జరుగుతున్న ఈ పురోగతి ఒక జవాబు. దెప్పిపొడిచిన వారికి చెంప చెళ్లుమనిపించేలా తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో సమర్థవంతంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ వైద్యం మీద ప్రజలు ఎంతగా ఆధారపడ్డారో, ఎంత నమ్మకంతో ఉన్నారో ప్రతిరోజు లక్షల మంది ఓపీ చికిత్స తీసుకుంటున్న వారిని, ఇన్ పేషెంట్లుగా ఉండి చికిత్స పొందుతున్నవారిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్యకూడా భారీగా పెరిగిపోయింది. కరోనా, బ్లాక్ ఫంగస్ విజృంభించిన సందర్భంలో ప్రభుత్వ వైద్యవ్యవస్థ ఎంత గొప్పగా సేవలందించిందో ప్రత్యక్షంగా మనం చూశాం.
కేసీఆర్కు ఉద్యమ కాలం నుంచే అన్నిరంగాల గురించిన అవగాహన వైద్య, ఆరోగ్య వ్యవస్థలో కూడా ఏయే మార్పులు తీసుకురావాలనే స్పష్టత ఉన్నది. కాబట్టే నేడు ప్రభుత్వ వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తున్నది.
డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి