విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి మన కండ్లముందున్న వాస్తవం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ నగరమే కాదు.. పల్లెలు, పట్టణాలతో పాటుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. అన్నిరకాల మౌలిక వసతులతో విలసిల్లుతున్నాయి.
మున్సిపాలిటీలుగా ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాలు కార్పొరేషన్లుగా ఎదిగాయి. నగర పంచాయతీగా ఉన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న బండ్లగూడ, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట్, మీర్పేట్, బడంగ్పేట్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగాయి. మరో 136 పట్టణాలు మున్సిపాలిటీలయ్యాయి. మూడు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఒక్కసారిగా ఇన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రావడం వల్ల రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతున్నదో ప్రజలు గమనించాలి. ఇవేకాకుండా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో పాటుగా యాదాద్రి టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రతి డెవలప్మెంట్ అథారిటీ కింద కోట్లాది రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. చుట్టూరా ఉన్న గ్రామాలను, పల్లెలను ఈ అథారిటీల కిందికి తీసుకొని వాటిని అభివృద్ధి చేయడం జరుగుతున్నది. దీంతో ప్రజలకు మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం, మురుగునీటి నిర్వహణ వంటి సౌకర్యాలు పెరుగుతాయి. ఫ్లై ఓవర్లు, అండర్పాసులు, లింక్ రోడ్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. భూముల ధరలు పెరుగుతాయి. వ్యాపారం, పరిశ్రమలు పెరగడంతో ప్రజల్లో సంపద పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు క్రమంగా పట్టణాలుగా మారుతున్నాయి. పట్టణాలు మండలాలు, రెవిన్యూ డివిజన్లుగా మారుతున్నాయి. నూతన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడటంతో ప్రభుత్వాధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వ్యవసాయ, పశుపోషణ రంగాలే కాకుండా విద్య, వైద్య రంగాల ప్రాధాన్యం కూడా పెరుగుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా ఉన్న తెలంగాణ పల్లెలు ఈ రోజు ‘నిత్య కల్యాణం పచ్చతోరణం’ వలె వెలుగుతున్నాయి. ‘పల్లె ప్రగతి’ కింద జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలి. గతంలో ఎలా ఉన్నాం.. ఇప్పుడెలా మారుతున్నాం అనే విషయాన్నీ ఎవరికి వారు ఆలోచిస్తే వాస్తవం కండ్లముందు కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇంతవరకు జరిగిన అభివృద్ధి, మరికొన్ని రోజుల్లో 375 కి.మీ. పరిధితో నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ నిర్మాణం లోపల కూడా జరగబోయే అభివృద్ధిని ఊహించుకున్నపుడు హైదరాబాద్ నగరం గొప్ప విశ్వనగరంగా మారుతుందనడంలో సందేహం లేదు.
నూతన సచివాలయం నిర్మాణంతో పాటుగా, ప్రతి జిల్లా కేంద్రంలో అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు నిర్మితమవుతున్నాయి. హైదరాబాద్లో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలు నేడు ఖమ్మం, కరీంనగర్, వరంగల్కు వచ్చాయి. కొత్త ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువత ఇక్కడ నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగంలో సాధించిన అభివృద్ధి 1956 మొదలు ఇంతవరకు చూడలేదు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంతో చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులను గత ఏడేండ్లలో ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరం జలాలు రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ వరకు చేరాయి. త్వరలో హైదరాబాద్ మహానగరానికి ఈ నీళ్లు తాకనున్నాయి. పాలమూరు రంగారెడ్డి పూర్తయితే కృష్ణా జలాలతో పూర్వ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు సస్యశ్యామలవుతాయి. ఇవన్నీ మనకు కనపడుతున్న సజీవ సాక్ష్యాలు.
నీళ్లున్నచోట నాగరికత ఉంటుంది. నీళ్లున్నచోట కరవు కాటకాలుండవు. నీళ్లున్నచోట ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. మిషన్ కాకతీయతో చెరువులను సజీవం చేసుకుంటే, మిషన్ భగీరథతో గ్రామాలకు నల్లాల ద్వారా మంచినీళ్లు అందుతున్నాయి. రాష్ట్రం వస్తే ఎలాంటి అభివృద్ధిని ప్రజలకు అందివ్వాలని కలలు గన్నారో అలాంటి అభివృద్ధిని కేసీఆర్ అందిస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, పెంచిన పింఛన్లు, అన్నీ అద్భుత మైన పథకాలే.
ఇక హైదరాబాద్ మహానగర వైభవం గురించి చెప్పుకొంటే.. శాంతిభద్రతల గురించి మాట్లాడుకోవడం అవసరం. అన్ని మతాలను కులాలను ఆప్యాయంగా చూసినప్పుడు ఎలాంటి విద్వేషాలకు చోటుండదు. రాష్ట్రం ఏర్పడిన గత ఏడున్నరేండ్లలో ఒక్క ఘటన జరుగలేదు. ఎస్ఆర్డీపీ పనులతో ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప మార్పులొచ్చాయి. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మారుతున్నది. మెట్రో రవాణా వ్యవస్థ, పెట్టుబడులతో పలు అంతర్జాతీయ ఐటీ కంపెనీల రాక, బస్తీ దవాఖానలు, అర్బన్ పార్క్లు, మహా ప్రస్థానాలు, పాతనగర వైభవాన్ని తిరిగి కనిపించేవిధంగా నాడు నిజాం నిర్మించిన పలు చెరువుల పునరుద్ధరణ పనులతో పాటుగా చార్మినార్, చార్కమాన్, మెట్ల బావులకు, క్లాక్ టవర్లకు, ముజాంజాహీ మార్కెట్కు పూర్వ వైభవం కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇదీ నేను కలలు గన్న తెలంగాణ రాష్ట్రం.. అంటూ ఒక బంగారు పళ్లాన్ని తెలంగాణ ప్రజల ముందుపెట్టే రోజు కోసం శ్రమిస్తున్న కేసీఆర్కు రేపటి యువత రుణపడి ఉంటుంది.
– కన్నోజు మనోహరాచారి
79950 89083